స్నానం చేస్తుండగా ఓ యువకుడు మహిళను రహస్యంగా వీడియో తీశాడు. ఆ వీడియోతో ఆమెను లోబర్చుకున్నాడు. విషయం ఆమె భర్తకు తెలిసినా కుటుంబ పరువు పోతుందనే భయంతో మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యువకుడి ఆగడాలు మితిమీరిపోవడంతో.. అతడిని లేకుండా చేయాలని దంపతులు పథకం రచించారు. గుజరాత్లోని గాంధీనగర్లో తీవ్ర కలకలం రేపిన ఘటన వివరాల్లోకి వెళ్తే..
గాంధీనగర్ జిల్లా పరిధిలోని కలొల్ ప్రాంతానికి చెందిన హార్దిక్ (20) కాలేజీ స్టూడెంట్. దాదాపు ఒకటిన్నర నెలల క్రితం ఓ మహిళ స్నానం చేస్తుండగా చాటుగా తన ఫోన్తో వీడియో తీశాడు. ఆ వీడియోను అడ్డుపెట్టుకుని ఆమెను మహిళను బెదిరించాడు. తనతో శారీరక సంబంధం కొనసాగించాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. భయంతో ఆమె అతడి డిమాండ్లకు అంగీకరించింది.
మహిళ భర్త ఫ్యాన్ రిపేర్లు, వైరింగ్ పనులు చేస్తుంటాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య పదే పదే ఫోన్లో మాట్లాడడంపై గట్టిగా నిలదీశాడు. ఆమె జరిగింది చెప్పింది. అయితే పరువు పోతుందనే భయంతో అతను మౌనంగా ఉండిపోయాడు. అయితే ఈలోపు హార్ధిక్ మితిమీరి ప్రవర్తించాడు.
ఇంటి ముందు నుంచి వెళ్లే సమయంలో మహిళను చూసి కన్ను కొట్టడం, అసభ్య సైగలు చేయడం ఆ భర్త భరించలేకపోయాడు. మొదట హార్దిక్ కుటుంబ సభ్యులతో పంచాయితీ పెట్టి విషయం చెప్పాలని దంపతులు భావించారు. అయితే.. విషయం బయటకు తెలిసిపోతుందని భావించారు. ఈలోపు హార్దిక్ చేష్టలు ఆ భర్తకు మరింత కోపం తెప్పించాయి. దీంతో అతన్ని హతమార్చాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు.
పథకం ప్రకారం జూలై 11 ఉదయం మహిళ హార్దిక్కు ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పింది. అంతకుముందే భర్త పని కోసం బయటకు వెళ్తున్నట్లు నటించి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పిల్లలు స్కూల్కు వెళ్లిపోయారు. హార్దిక్ తన తండ్రికి ఫోన్ చేసి.. పర్బత్పురలో ఓ భూమి చూసేందుకు వెళ్తున్నట్లు చెప్పాడు. అయితే అతడు నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు.
ఈలోపు.. హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చిన భర్తను చూసి హార్దిక్ పరుగులు తీయబోయాడు. భర్త అతని ఛాతీ మీద కూర్చోగా.. భార్య కాళ్లు, చేతులు బలంగా పట్టుకుంది. తొలుత ఆమె స్కార్ప్తో, ఆ తర్వాత కరెంట్ వైర్లను మెడకు బిగించి హార్దిక్ను హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఇంటికి తాళం వేశారు. సరాసరి స్కూల్కు వెళ్లి పిల్లలను తీసుకుని.. వివాహిత స్వస్థలానికి పారిపోయారు.
మొబైల్ స్విచ్చాఫ్ రావడంతో..
హార్దిక్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కంగారుపడ్డ తండ్రి.. కలోల్ పీఎస్లో ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుల ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఈ హత్య బయటపడింది. పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమి మరణించినట్లు వెల్డి కావడంతో.. దంపతుల్ని ట్రేస్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.
హార్దిక్ వద్ద ఉన్న మొబైల్లోనే మహిళకు సంబంధించిన వీడియో ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య తర్వాత భర్త ఆ ఫోన్ను పగలగొట్టి రోడ్డుపక్కన పడేసినట్లు సమాచారం. ఫోన్ స్వాధీనం చేసుకునేందుకు నిందితులను విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.


