హైదరాబాద్: మాదాపూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రామేశ్వరం కేఫే సమీపంలో భాస్కర్ అనే యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తులు, కర్రలతో దాడి చేయగా, అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, భాస్కర్ కొంతకాలంగా ఇద్దరు యువతులను వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై గతంలో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదుకాగా, పోలీసులు ఇరు పక్షాలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కూడా భాస్కర్ లో మార్పు రాలేదని సమాచారం.
ఈ మధ్యకాలంలో భాస్కర్ “దమ్ముంటే హైదరాబాద్కు రండి” అంటూ సవాల్ విసిరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన యువతుల్లో ఒకరి తండ్రి, మరో వ్యక్తితో కలిసి వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చి దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు . హత్య అనంతరం నిందితులిద్దరూ స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు.
భాస్కర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వేధింపుల వివాదమే హత్యకు ప్రధాన కారణమా, లేక ఇతర వ్యక్తిగత విభేదాలు కూడా ఉన్నాయా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం నిందితులిద్దరూ పోలీసుల అదుపులో ఉండగా, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.


