breaking news
Future City Hyderabad
-
రేవంత్కు ఆశ లావు.. పీక సన్నమైంది!
తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా మూడు అంశాలపై చర్చోపచర్చలు జోరందుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు బాటలోనే తలపెట్టిన ‘ఫ్యూచర్ సిటీ’, హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలు ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వం చేతుల్లోకి మారిపోవడం.. కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో చేపట్టిన కాళేశ్వరం మాదిరిగానే రేవంత్ ప్రభుత్వం రూ.35 వేల కోట్ల ప్రాణహిత చేవెళ్ల పథకం నిష్ప్రయోజనం కానుందా? అన్నవి ఆ మూడు అంశాలు.ఫ్యూచర్ సిటీ విషయంలో రేవంత్ పట్టుదలతోనే ఉన్నారు. అభివృద్ధి సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టి తామే నగరాన్ని నిర్మిస్తామని చెప్పడమే విస్మయం కలిగిస్తుంది. కులీకుతుబ్ షా మాదిరి రేవంత్ కూడా నగర సృష్టి చేయనున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పొగడటం బాగానే ఉన్నా.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని కార్యాచరణకు దిగడం మంచిది అనిపిస్తుంది. అంతర్జాతీయ కంపెనీలూ, ఫార్చ్యూన్ 500 కంపెనీలు అనేకం ఇప్పటికే హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మరిన్ని వచ్చిన తగినంత భూమి ప్రభుత్వం ఉంది. వచ్చిన ప్రతిపాదనలకు తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో భూ సేకరణ చేయవచ్చు కూడా. ఇదో నిరంతర ప్రక్రియ.అయితే, ఒకవైపు ప్రభుత్వ భూములను వేలం పెడుతూ, మరోవైపు కొత్త నగరం పేరిట రైతుల నుంచి భూములను సమీకరించడం ఎంతవరకు అవసరమన్నది ఆలోచించుకోవాలి. ఫ్యూచర్ సిటీని న్యూయార్క్ నగరంతోనో, లేక టోక్యో, దుబాయి వంటి నగరాలతో పోల్చి, అక్కడి వారు కూడా ఇక్కడకు వచ్చి చూసి వెళ్లాలన్న ఆకాంక్ష తప్పు కాదు కానీ రేవంత్ ఇలాంటి విషయాలు చెబుతుంటే గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ను డల్లాస్ నగరంగా మార్చేస్తానని, హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్ల మాదిరి చేసేస్తామని చెప్పిన కబుర్లు గుర్తుకు వస్తాయి. హుసేన్ సాగర్ను ఎండగట్టి శుభ్రం చేయాలన్న కేసీఆర్ ప్రతిపాదించినప్పటికీ విపరిణామాలపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత ఈ ప్రణాళిక ముందుకు పోలేదు. హైదరాబాద్ డల్లాస్గా మారలేదు. కాకపోతే ఆ తరువాతి కాలంలో ప్రాక్టికల్గా ఆలోచించి నగరంలో పలుచోట్ల వంతెనలు, రోడ్ల వెడల్పు చేయడం, రేడియల్ రోడ్ల నిర్మాణం వంటివి చేశారు.ఇక, ఏపీలో చంద్రబాబు అమరావతి పేరుతో అవసరం లేకపోయినా లక్ష ఎకరాలు తీసుకుని లక్షల కోట్లు వెచ్చించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడంతో వారంత ఆందోళన చెందుతున్నారు. అందుకే ఒకప్పటి మద్దతుదారులైన అమరావతి రైతులే ఇప్పుడు బాబకు నిరసన చెప్పడం మొదలుపెట్టారు. రాజధాని నిర్మాణం పేరుతో పలు నగరాలు సందర్శించిన చంద్రబాబు ఏ దేశమెళితే అక్కడి మాదిరిగా అమరావతిని కట్టేస్తానని ఊదరగొట్టేవారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు వ్యయం చేసినా పది శాతం కూడా పూర్తి కాలేదని మంత్రి నారాయణే చెబుతున్నారు. ఫ్యూచర్ సిటీ గురించి వింటున్నప్పుడు కేసీఆర్ కబుర్లు, చంద్రబాబు డాంబికాలను కలగలిపి మరీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారా అన్న సందేహం వస్తుంది. ఏ అవసరాల కోసం ఈ నగరాన్ని నిర్మించదలిచారు? పారిశ్రామిక అవసరాలకా? లేక పాలన కోసమా? రైతుల నుంచి భూములు ఏ పద్దతిలో తీసుకుంటారు?.అవుట్ ఆఫ్ కోర్టు ద్వారా రైతులు భూముల పరిహారం సెటిల్ చేసుకోవాలని రేవంత్ చెబుతున్న తీరు వారిని బుజ్జగించడమా? లేక బెదిరించడమా?. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫార్మా సిటీ భవిష్యత్తు ఏమిటి?. ఆ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని అప్పట్లో కాంగ్రెస్ వారు చెబుతుండేవారు. మరి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కోసం కొత్తగా భూములు తీసుకో తలపెట్టారు. ఇదంతా రియల్ ఎస్టేట్ విలువలు పెరిగి భూముల లావాదేవీలు పుంజుకోవాలన్న లక్ష్యంతో చేస్తున్నారా?. కాంగ్రెస్ పార్టీనే తీసుకు వచ్చిన 2013 భూ సేకరణ చట్టం గురించి ఎందుకు మాట్లాడడం లేదు?. ఆయన మాటలు వింటుంటే రైతులకు కొంతవరకు నష్టం తప్పదేమో అనిపిస్తుంది. ఈ విషయాలే భవిష్యత్తులో సమస్యలుగా మారవచ్చు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బుల్లెట్ రైలు వస్తుందని చెబుతున్న తీరు అచ్చంగా చంద్రబాబు నాయుడు చెప్పే అతిశయోక్తుల మాదిరే అనిపిస్తాయి. అక్కడి ప్రజలను ఊరించడానికా, లేక వారిలో నమ్మకం పెంచడానికా? ఏది ఏమైనా రేవంత్ ఫ్యూచర్ సిటీపై గట్టి ఆశతో ఉన్నారా? లేక వేరే లక్ష్యంతో హైప్ చేస్తున్నారా అన్నది తేలడానికి మరికొంత కాలం పడుతుంది. హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ తప్పుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో (పీపీపీ) జరిగే ప్రాజెక్టులన్నీ సఫలమవుతాయన్న గ్యారెంటీ లేదనేందుకు ఈ ప్రాజెక్టు ఒక నిదర్శనం. ప్రైవేట్ సంస్థలు తమకు నష్టం వస్తుందనుకుంటే కాడి పడేస్తాయని ఈ అనుభవం చెబుతుంది. చివరికి తెలంగాణ ప్రభుత్వం నెత్తి మీదకు రూ.15వేల కోట్ల భారం పడుతోంది. ఈ ప్రాజెక్టు కింద 300 ఎకరాల విలువైన భూములు ఉన్నాయని, వాటిని ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్లాన్ చేసిందని బీఆర్ఎస్ ఆరోపిప్తోంది. ఆ భూముల అమ్మకం ద్వారా 15వేల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందా? లేక ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టిందా అన్నది తెలియదు.మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టును ఏ రకంగా తీసుకువెళతారో తెలిస్తే ఎల్ అండ్ టీ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఉపయోగమా? కాదా? అన్నది తేలుతుంది. చంద్రబాబుకు సంబంధించిన తెలుగుదేశం మీడియా రేవంత్కు సహకరిస్తోంది కాబట్టి సరిపోయింది కానీ, లేకుంటే ఈ పాటికి హైదరాబాద్ను విధ్వంసం చేశారని, ఎల్ అండ్ టీని తరిమేశారని విపరీతంగా ప్రచారం చేసేది. ఆర్థికంగా స్థోమతు ఉంటే ఫ్యూచర్ సిటీ నిర్మించవచ్చు. మెట్రో స్వయంగా నడపవచ్చు. కొత్తగా మెట్రో రైలును పొడిగించవచ్చు. ప్రాణహిత-చేవెళ్ల స్కీమ్ను వేల కోట్లతో చేపట్టవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండ అని చెబుతున్న రేవంత్ ప్రభుత్వం దానిని పక్కనబెట్టి ప్రాణహిత స్కీమ్ను ఎలా తీసుకు వస్తుందన్నది ఆసక్తికరమే. అది అంత తేలిక కాకపోవచ్చు.ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రుణ భారం మోయలేనంతగా రూ.6.72 లక్షల కోట్లకు చేరింది. ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు లక్షన్నర కోట్ల అప్పు చేశారని లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ ఆదాయం, భూముల అమ్మకం, ఎక్సైజ్ ఆదాయం వంటి వాటి ద్వారా ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ, అప్పులు సైతం తక్కువేమీ లేవు. ఈ ఆర్ధిక సంవత్సరంలో అనుమతించిన అప్పులలో ఇప్పటికే ప్రభుత్వం 85 శాతం తీసేసుకుంది. ప్రభుత్వానికి రూ.54009 కోట్ల అప్పునకు అవకాశం ఉంది. ఇందులో రూ.45900 కోట్ల రుణాలు తీసేసుకున్నారు. మిగిలిన ఆరు నెలలకు అప్పులు చేయాలనుకున్నా వచ్చేది 8109 కోట్లే.మరోవైపు కాంట్రాక్టర్ల బిల్లులు వేల కోట్లలో ఉన్నాయని అంటున్నారు. ఆ మధ్య సచివాలయంలో కూడా నిరసనకు దిగారు. ఆర్టీసీకి ఫ్రీ బస్ స్కీమ్ కింద రూ.మూడు వేల కోట్ల బకాయిపడ్డారట. ఇంకా పలు హామీలను నెరవేర్చవలసి ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా ఆర్ధిక పరిస్థితి చక్కబరచుకోకుండా ఆశ లావు, పీక సన్నం అన్న చందంగా కొత్త, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలనుకుంటే అది ఆకాశానికి నిచ్చెనలు వేసినట్లు అవుతుందేమో! జాగ్రత్త సుమా!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మూసీ.. అందాల రాశి!
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి.. త్వరలోనే మూసీ సమగ్రాభివృద్ధి పనులకు సైతం శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఆర్డీసీఎల్) అధికారులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్లో మూసీ 55 కి.మీ. మేర ప్రవహిస్తుండగా..తొలి దశలో 20.5 కి.మీ. మేర నదిని పునరుజ్జీవింప చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన సంగతి తెలిసిందే. జంట జలాశయాలైన హిమాయత్సాగర్, గండిపేటల నుంచి బాపూఘాట్ వరకు రూ.5,641 కోట్ల వ్యయంతో మూసీ నది సుందరీకరణ చేపట్టనున్నారు. మాస్టర్ ప్లాన్ రెడీ! తొలి దశ మూసీ అభివృద్ధి పనుల కోసం రుణం మంజూరు చేసేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) సుముఖత వ్యక్తం చేయడంతో.. రాష్ట్ర ప్రభుత్వం మూసీ నదీతీర అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. ఇందుకోసం ఏర్పాటైన కన్సల్టెన్సీ సంస్థ ఇప్పటికే సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిసింది. తొలి దశలో 20.5 కి.మీ. అభివృద్ధి చేసేందుకు రూ.5,641 కోట్ల వ్యయాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫేజ్–1ను రెండు సబ్ ఫేజ్లుగా విభజించిన అధికారులు ఫేజ్–1ఏలో హిమాయత్సాగర్ టు బాపూఘాట్ వరకు 9.5 కి.మీ, ఫేజ్–1బీలో ఉస్మాన్సాగర్ టు బాపూఘాట్ వరకు 11 కి.మీ. అభివృద్ధి చేయనున్నారు. ఫేజ్–1ఏ కింద రూ.2,500 కోట్లు, ఫేజ్–1బీ కింద రూ.3,141 కోట్లు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు. అంచనా వ్యయంలో రూ.4,100 కోట్లు ఏడీబీ నుంచి రుణం రూపంలో పొందనుండగా.. మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోనుంది. 493 ఎకరాలు అవసరం మూసీ తొలి దశ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వానికి 493 ఎకరాల (199.89 హెక్టార్లు) భూమి అవసరమని అధికారులు గుర్తించారు. ఇందులో 340 ఎకరాలు (137.72 హెక్టార్లు) పట్టా భూములు కాగా.. మిగిలిన 153 ఎకరాలు (62.17 హెక్టార్లు) ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నాయి. భూ సేకరణ, పునరావాసం, నాణ్యమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం (ఆర్ఎఫ్సీటీఎల్ఏఆర్ఆర్)–2013 కింద భూ సేకరణ చేపట్టనున్నారు. సేకరించే భూమిలో మూసీ చుట్టూ గ్రీన్ బెల్ట్ కోసమే సుమారు 270 ఎకరాలు (109.42 హెక్టార్లు) కేటాయించనున్నారు. ఇరువైపులా రిటైనింగ్ వాల్లు మూసీకి పునరుజ్జీవం కల్పించాలంటే తొలుత ఘన, జల వ్యర్థాలతో నిండిపోయిన నదిని శుభ్రం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నదిలో 2 మీటర్ల లోతు వరకు వ్యర్థాలు, పూడిక తీయనున్నారు. నదికి ఇరువైపలా రిటైనింగ్ వాల్లను నిర్మిస్తారు. ఆ తర్వాత నదిలోకి గోదావరి జలాలను వదులుతారు. ఈ నీళ్లు 24/7 ఉండేలా చూస్తూ గండిపేట నుంచి బాపూఘాట్ వరకు బోటింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. నది సరిహద్దుల నుంచి 20 మీటర్ల వెడల్పు వరకు గ్రీన్ బెల్ట్ ఉంటుంది. ఇందులో గ్రీనరీ పెంపకంతో పాటు వాక్ వేలు, సైక్లింగ్ ట్రాక్లు, భూగర్భ జలాల రీచార్జ్ కోసం పార్క్లు, వర్షపు తోటలు, గ్రీన్రూఫ్లు, బ్యాటరీతో నడిచే వాహనాలు, ఎలక్ట్రిక్ రిక్షాలు వంటివి ఉంటాయి. వరదల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ నదికి ఇరువైపులా 50 మీటర్లు బఫర్ జోన్గా అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాంతాన్ని కూడా ప్రాజెక్టులో అంతర్భాగంగా అభివృద్ధి చేస్తారు. మరోవైపు మూసీ వరదలను నియంత్రించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. బఫర్ జోన్లో వరద నియంత్రణ కాల్వలు, నాలాలు, పంపింగ్ స్టేషన్లు, వరద నియంత్రణ గోడలు, వరద పర్యవేక్షణ భవనాలు, వరద నిరోధక డెక్ల వంటి పటిష్టమైన మౌలిక సదుపాయాలుంటాయి. త్వరలో ‘మూసీ ఉద్యోగాల’ భర్తీ మూసీని సుందరీకరించడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. నది పునరుజ్జీవ ప్రాజెక్టు నిర్మాణ దశలో 100 శాశ్వత పోస్టులను ఏర్పాటు చేసి భర్తీ చేయడంతో పాటు తాత్కాలిక ప్రాతిపదికన 3 వేల మంది ఉద్యోగులను నియమించనున్నారు. కార్యాచరణ దశలో 200 శాశ్వత పోస్టులతో పాటు తాత్కాలిక ప్రాతిపదికన మరో 200 పోస్టులు ఏర్పాటు చేసి నియామకాలు జరుపుతారు. మూసీని నైట్ (రాత్రి) ఎకానమీగా, అదనపు ఆదాయాన్ని సమకూర్చే వనరుగా అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు మూసీ చుట్టూ యాంఫీ థియేటర్లు, షాపింగ్ మాల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్లు, వీధి విక్రేతల దుకాణాలు, కియోస్్కలు వంటి వ్యాపార, వాణిజ్య నిర్మాణాలను చేపడతారు. లైట్ అండ్ సౌండ్ షోలు, వాటర్ స్పోర్ట్స్, మేళాలు, సాంస్కృతిక వేదికలు కూడా ఉంటాయి. -
ఇకపై పాలన ఫ్యూచర్ సిటీ నుంచే: సీఎం రేవంత్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: త్వరలో భారత్ ఫ్యూచర్ సిటీ నుంచే పరిపాలన సాగిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇకపై సచివాలయంలో కాకుండా ఫ్యూచర్సిటీ ఆఫీ సులో కూర్చు ని పనిచేస్తానని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) భవన నిర్మాణంతోపాటు రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు నిర్మించనున్న రేడియల్ రోడ్డు పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి సీఎం ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘భూమి విలువ నాకు తెలుసు. వ్యవసాయంతోనే కాదు వ్యాపారంలోనూ భూమితో నాకు సంబంధం ఉంది. మీ తాతల నాటి ఆస్తులు గుంజుకునే ఆలోచన నాకు లేదు. బాధితులకు పూర్తిగా న్యాయం చేసిన తర్వాతే భూములు తీసుకుని ముందుకు వెళ్తాం. డిసెంబర్లో యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించుకోబోతున్నాం. ఫ్యూచర్సిటీ అభివృద్ధి పనులను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తాం. ఇకపై సచివాలయంలో కాకుండా ఫ్యూచర్సిటీ ఆఫీసులో కూర్చుంటా. నెలకు మూడుసార్లు ఇక్కడే ఉంటా. ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ఇకపై ఇక్కడి నుంచే చేపడుతా. నాతోపాటు ఉపముఖ్య మంత్రి భట్టి కూడా నెలకు నాలుగుసార్లు ఇక్కడికి వస్తారు. ఆయన కూడా తన కార్యకలాపాలను ఇక్కడి నుంచే కొనసాగిస్తారు. సింగరేణి సంస్థ కోసం 10 ఎకరాలు కేటా యించి, 2026 డిసెంబర్లోగా ఆఫీసును ప్రారంభించాల్సిందిగా కోరుతున్నా. ఫ్యూచర్సిటీలో ఓవర్హెడ్ విద్యుత్ లైన్లు కూడా తొలగించి, యూజీ కేబుల్స్ వేయబోతున్నాం. ఈ ఫ్యూచర్సిటీలో ఫార్చూన్ 500 జాబితాలోని కంపెనీలు ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పటివరకు నగరంలో 85 వరకే ఉన్నాయి. రాబోయే పదేళ్లలో ప్రతి కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెట్టే విధంగా తీర్చిదిద్దుతున్నాం’అని వివరించారు. భావితరాల కోసమే మా తపన భావితరాల బంగారు భవిష్యత్తు కోసమే తమ ప్రభుత్వం కష్టపడుతోందని సీఎం రేవంత్ తెలిపారు. ‘ఈరోజు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. కానీ మంచి సంకల్పంతో చేపట్టిన నవ్య.. భవ్య.. భారత్ ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన కోసం వరుణుడ కూడా సహకరించాడు. రేవంత్రెడ్డికి భూములున్నాయని చెప్తున్నారు. ఆయన కోస మే నగరం కడుతున్నారని ఆరోపిస్తున్నారు. నాకు భూమి ఉంటే భూమి మీదే ఉంటుంది. రహస్యంగా దాచుకోవడానికి నా దగ్గరేమీ లేదు. నేను నాగురించో.. నా సహచర మంత్రుల గురించో ఆలోచన చేయడం లేదు. మేమంతా రేపటి తరాల కోసమే ఆలోచన చేస్తున్నాం’అని సీఎం పేర్కొన్నారు. న్యూయార్క్లో ఉన్నవాళ్లు చెప్పుకునేలా చేస్తా ‘కుతుబ్షాహీలు, నిజాంలు పునాదులు వేసిన హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు నేడు ఎంతో అభివృద్ధి చెందాయి. నాడు చంద్రబాబు, వైఎస్సార్ మాకెందుకు అనుకుని ఉంటే..ఇవాళ హైటెక్సిటీ, ఔటర్రింగ్రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్టు వచ్చేవి కాదు. నాటి నాయకుల ఆలోచన వల్లే ఫార్మా, ఐటీ రంగంలో ప్రపంచంతో పోటీపడుతున్నాం. సిలికాన్ వ్యాలీలో మన పిల్లలు గొప్ప స్థానాల్లో ఉన్నారు. గతకాలపు నేతల నుంచి మంచిని నేర్చుకుని భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి. భవిష్యత్తు తరాల కోసమే భారత్ ఫ్యూచర్ సిటీ. న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్ తరహాలో ఫ్యూచర్సిటీ గురించి గొప్పగా చెప్పుకునేలా తీర్చిదిద్దుతాం. నాకు పదేళ్లు అవకాశం ఇవ్వండి. న్యూయార్క్లో ఉన్నవాళ్లు కూడా ఫ్యూచర్ సిటీ గురించి చెప్పుకునేలా అభివృద్ధి చేస్తాం’అని సీఎం తెలిపారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి చెన్నై, బెంగళూరుకు బుల్లెట్ రైళ్లు.. బందర్కు రోడ్డు ఫ్యూచర్సిటీకి తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ఇతర నగరాలకు రవాణా సౌకర్యం, అంతర్జాతీయ విమానాశ్ర యం వంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయని సీఎం తెలిపారు. ‘ఫ్యూచర్ సిటీ నుంచి శ్రీశైలం వరకు 100 మీటర్ల రోడ్డు వేస్తున్నాం. ఇటు ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు వరకు రోడ్డు, బుల్లెట్ ట్రైన్ మంజూరు చేయించుకున్నాం. దక్షిణ భారతదేశంలో నౌకాశ్రయం లేని రాష్ట్రం తెలంగాణ మాత్ర మే. ఈ కొరతను తీర్చేందుకు మచిలీపట్నం వరకు రోడ్డు వేస్తున్నాం. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్కు కేంద్రం అనుమతించింది’అని చెప్పారు. రైతులు నాయకుల ఉచ్చులో చిక్కుకుని నష్టపోవద్దని సూచించారు. బాధిత రైతులతో మాట్లాడి సమస్య లేకుండా చూడాలని కలెక్టర్, టీజీఐఐసీ అధికారులను ఆదేశించారు. ‘అందరికీ న్యాయం చేస్తా. కోర్టు బయట కూర్చొని నష్టాన్ని పూడ్చుకుందాం’అని సూచించారు. భవిష్యత్తు అంతా ఇక్కడే దేశ భవిష్యత్తు అంతా ఫ్యూచర్ సిటీ చుట్టే తిరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో ఏ నగరానికి లేని రేడియల్ రోడ్లు, సరీ్వసు రోడ్లు, మెట్రో సౌకర్యం దీనికి ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఈ సిటీ ప్రపంచానికే తలమానికం అవుతుందన్నారు. ఈ ప్రాంత వాసులకు అత్యాధునిక వైద్యశాలలు, కాలేజీలు, వర్సిటీలు, పరిశ్రమలు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. సింగరేణి గ్లోబల్ కార్పొరేషన్ ఆఫీసు నిర్మాణాన్ని ఏడాదిలోపే పూర్తి చేస్తామని వెల్లడించారు. కొత్త యుగానికి కొత్త బాటలు వేయాలనే ఆలోచనతో ప్రణాళికాబద్ధమైన ఫ్యూచర్సిటీకి శంకుస్థాపన చేసినట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. చండీగఢ్ కంటే పది రెట్లు భిన్నంగా ఫ్యూచర్సిటీ రాబోతోందని చెప్పారు. సిటీ నిర్మాణం, అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
‘రేవంత్.. ఫ్యూచర్ సిటీ దేవుడెరుగు.. ఉన్న నగరాన్ని పట్టించుకోండి’
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఇంటింటికీ వెళ్లి ‘కాంగ్రెస్ బకాయి కార్డు’ పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ గ్యారంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రజలకు పడ్డ బకాయిలను బాకీ కార్డు ఉద్యమంతో గుర్తుచేస్తామన్నారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ జూబ్లీహిల్స్ పరిధి షేక్పేటలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ‘కాంగ్రెస్ బకాయి కార్డు’ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్కు బుద్ధి చెప్పే అవకాశం ఉపఎన్నిక, స్థానిక ఎన్నిక రూపంలో వచ్చింది. వీటిలో ఆ పార్టీకి గుణపాఠం తప్పదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ప్రచారం చేసేది టూరిస్టు మంత్రులే. ఎన్నికలు అయిపోగానే మంత్రులు, సామంతులు అందరూ మాయమైపోతారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునేది బీఆర్ఎస్ నేతలే అని స్పష్టం చేశారు.‘ప్రజెంట్ సిటీ’ వరదలతో మునుగుతుంటే, దోమలతో జనం ఇబ్బందులు పడుతుంటే, ‘ఫ్యూచర్ సిటీ’ కడతానని సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. తెలంగాణ భవిష్యత్ తరాలే ఫ్యూచర్ సిటీని అద్భుతంగా నిర్మించుకుంటారు. ఉన్న మెట్రోను రద్దుచేసి జనం లేని ఫ్యూచర్ సిటీకి కొత్త మెట్రో కడతాననడం రేవంత్ రెడ్డి చావు తెలివితేటలకు నిదర్శనం. కాంగ్రెస్కు ఇప్పుడు బుద్ధి చెప్పకపోతే మరో మూడేళ్లపాటు వారి అరాచకాలకు అడ్డే ఉండదు. బీఆర్ఎస్ అభ్యర్థి, మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. -
‘ఫ్యూచర్సిటీ’కి సీఎం రేవంత్ శంకుస్థాపన
సాక్షి, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్సిటీకి పునాది రాయి పడింది. కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్సీడీఏ) కార్యాలయానికి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు 15 వేల చదరపు అడుగుల్లో రూ.20 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నాలుగు నెలల్లో ఈ భవన నిర్మాణం పూర్తికానుంది. అనంతరం ఫ్యూచర్సిటీలో జరిగే అభివృద్ధి పనులు, లేఅవుట్లు, పరిశ్రమలకు ఎఫ్సీడీఏ అధికారులు అనుమతులివ్వనున్నట్లు సమాచారం. రావిర్యాల నుంచి అమన్గల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్-1నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంరేవంత్తో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు శ్రీధర్బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా, ఉద్యోగ అవకాశాల కేంద్రంగా, పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి మోడల్గా తీర్చిదిద్దే లక్ష్యంతో భారత్ ఫ్యూచర్ సిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. మొత్తం 30 వేల ఎకరాల్లో.. 15,000 ఎకరాలు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి, మరో 15,000 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్గా(హరిత ఊపిరి)గా కేటాయించింది. -
హైదరాబాద్ 4.0 దిశగా శరవేగంగా అడుగులు
నిజాం కాలంలో 1591లో పురుడు పోసుకున్న హైదరాబాద్ నగరం అభివృద్ధి ప్రస్థానం నేడు శరవేగంగా సాగుతోంది. తాజాగా ఫ్యూచర్ సిటీ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. 1998లో ఐటీ రాకతో హైదరాబాద్ వేగం మరింత పుంజుకుంది. అప్పటివరకు హైదరాబాద్, సికింద్రాబాద్లకే పరిమితమైన అభివృద్ధి సైబరాబాద్కు విస్తరించింది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్రోడ్డు, మెట్రోల ఏర్పాటుతో నగర రూపురేఖలే మారిపోయాయి. అంతర్జాతీయ మౌలిక వసతులు, నైపుణ్య కారి్మకుల లభ్యత, తక్కువ జీవన వ్యయం, కాస్మోపాలిటన్ కల్చర్, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో ప్రపంచ దిగ్గజసంస్థలు నగరంలో కొలువుదీరాయి. అయితే గ్రేటర్పై ఒత్తిడి పెరగడంతో దానికి అనుబంధంగా నాలుగో నగరం అనివార్యమైపోయింది. ప్రధాన నగరంలో రద్దీని తగ్గించడంతోపాటు భవిష్యత్తు అవసరాల కోసం ఫ్యూచర్ సిటీ ఏర్పాటు తప్పనిసరైంది. –సాక్షి, సిటీబ్యూరోప్రపంచంలో కోటి జనాభా ఉన్న 37 మెగా నగరాల్లో ఆరు ఇండియాలోనే ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా నగరాలు కేవలం జనాభా సెంటర్లు మాత్రమే కాదు. ప్రధాన ఆరి్థక, ఉద్యోగ కేంద్రాలు కూడా. 146 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో దాదాపు 37 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2050 నాటికి ఇది 53 శాతానికి, 87.6 కోట్ల జనాభాకు చేరుతుందని అంచనా. మన మెట్రో నగరాలు ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్నాయి. విధానపరమైన మార్పులు, స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రపంచీకరణ, శ్రామిక జనాభా పెరుగుదల వంటివి నగరాల అభివృద్ధి, విస్తరణకు ప్రధాన కారణాలు.మహానగరం మనదే.. ప్రపంచవ్యాప్తంగా నగరాలు ఆర్థిక వృద్ధికి ఇంజిన్లు అని చెప్పవచ్చు. ప్రపంచ జీడీపీలో 80 శాతం కంటే ఎక్కువ వాటా నగరాలదే. ఉత్పాదకత, ఆవిష్కరణ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అభివృద్ధిని సాధించడంలో నగరాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. దేశంలోని 8 ప్రధాన నగరాలు 4,308 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్నాయి. 1995 నుంచి 2025 మధ్య కాలంలో ఈ నగరాలు ఏకంగా 2,136 చ.కి.మీ. విస్తరించాయి. గత మూడు దశాబ్దాల్లో విస్తీర్ణాలు 98 శాతం పెరిగాయి. ఇందులో అత్యధిక విస్తీర్ణం హైదరాబాద్దే. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ 7,257 చదరపు కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది.వృద్ధి ఎక్కడ్నుంచి ఎక్కడికి.. 1990 చివర్లో హైదరాబాద్లో ఫార్మాతోపాటు ఐటీ, ఐటీఈఎస్ రంగం జోరందుకుంది. దీంతో 2000 సంవత్సరాంతంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ అప్గ్రేడ్ అయ్యాయి. 2008లో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ప్రపంచ ప్రయాణికులు, కార్గో సేవలతో వృద్ధి రెండింతలైంది. అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనతో నగరం పశి్చమ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్ను విమానాశ్రయానికి అనుసంధానించింది. దీంతో హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోయింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, నైపుణ్య కారి్మకులకు నగరం వేదికైంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమలు చేసిన వ్యాపార అనుకూల విధానాలతో ఆరి్థక, సాంకేతిక కేంద్రంగా హైదరాబాద్ స్థానం మరింత బలోపేతమైంది. ఔటర్, మెట్రోలు అందుబాటులోకి రావడంతో నగరంలో కనెక్టివిటీ మరింత పెరిగింది. దీంతో నగరాభివృద్ధి పశి్చమం వైపు నుంచి దక్షిణం దిశగా విస్తరించింది.గ్రేటరే..7,257 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో పట్టణ ప్రాంతం 519 చ.కి.మీ. 1995లో 267 చ.కి.మీ.లుగా ఉన్న నగర అర్బన్ ఏరియా 2005లో 319 చ.కి.మీ. 2015లో 407 చ.కి.మీ.లకు విస్తరించింది. గత మూడు దశాబ్దాల్లో గ్రేటర్ పట్టణ ప్రాంతం 252 చ.కి.మీ. పెరిగింది. 95 శాతం మేర వృద్ధి చెందింది. 1995లో 49 లక్షలుగా ఉన్న గ్రేటర్ జనాభా 2015 నాటికి 87 లక్షలు, ఇప్పుడు 1.13 కోట్లకు చేరింది. గత 30 ఏళ్లలో జనాభా 131 శాతం పెరిగింది. ఐటీ, ఐటీఈఎస్, ఫార్మాసూటికల్స్, బయో టెక్నాలజీ, టూరిజం ఇదే నగరాభివృద్ధికి చోదకాలు.హెచ్ఎంఆర్ దిశగా.. దేశానికే తలమానికంగా నిలిచేలా తెలంగాణలో ఒక ప్రధాన పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్, యాదాద్రి–భువనగిరి, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలను కలుపుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్(హెచ్ఎంఆర్)ను ప్రతిపాదించింది. 10,472.723 చ.కి.మీ. మేర విస్తరించి ఉండే హెచ్ఎంఆర్.. రీజినల్ రింగ్ రోడ్డుతో అనుసంధానమై ఉంటుంది. దీంతో హైదరాబాద్తోపాటు పొరుగు జిల్లాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది.మాస్టర్ ప్లాన్ తప్పనిసరి ఏ నగరానికైనా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి అవసరం. మౌలిక వసతుల కల్పనతోపాటు పర్యావరణానికి ప్రాధాన్యం ఇచ్చే మాస్టర్ప్లాన్ ప్రకారమే అభివృద్ధి జరగాలి. సిటికీ వలసలు పెరుగుతుండటంతో పట్టణ ప్రాంతం విస్తరిస్తుంది. – కె.విద్యాధర్, డైరెక్టర్, హెచ్ఎండీఏఉద్యోగ అవకాశాల గని ఉద్యోగ, ఉపాధి అవకాశాల పుష్కలంగా ఉండటమే హైదరాబాద్ అభివృద్ధికి కారణం. పటిష్టమైన లా అండ్ ఆర్డర్, నైపుణ్య కార్మికుల లభ్యత, కాస్మోపాలిటన్ కల్చర్ వంటి వాటితో నగరంలోకి జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి.–కె.ఇంద్రసేనారెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయ్ తెలంగాణ -
అభివృద్ధికి కొత్త ‘దారులు’
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో రహదారి నెట్వర్క్ విస్తరణ, విద్యాభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర మంత్రులు నితిన్గడ్కరీ, నిర్మలా సీతారామన్ను మంగళవారం ఆయన వేర్వేరుగా కలిసి ఈ అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. హైదరాబాద్ సమీపంలోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా బందరు ఓడరేవు వరకు 12 వరుసల రహదారి నిర్మించాలని నితిన్ గడ్కరీని కోరారు. ఈ ప్రతిపాదిత మార్గంలో 118 కిలోమీటర్లు తెలంగాణ పరిధిలో ఉంటుందని సీఎం వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) పనులను వేగవంతం చేయాలని కోరారు. శ్రీశైలానికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మించండి హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వెళ్లే మార్గంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా మన్ననూర్–శ్రీశైలం మధ్య నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని సీఎం రేవంత్ ప్రతిపాదించారు. దీనితో పాటు రావిర్యాల–ఆమన్గల్–మన్ననూర్ మార్గాన్ని నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిగా, రద్దీ అధికంగా ఉన్న రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్–మంచిర్యాల మధ్య కొత్త గ్రీన్ఫీల్డ్ రహదారిని మంజూరు చేయాలని కోరారు. సీఎం విజ్ఞప్తులపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సీఆర్ఐఎఫ్ కింద ప్రతిపాదించిన రూ.868 కోట్ల పనులకు వారంలోగా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. బందరు పోర్టుకు గ్రీన్ఫీల్డ్ రహదారిపై ఈ నెల 22న హైదరాబాద్లో ఎన్హెచ్, ఎన్హెచ్ఏఐ అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రూ.30 వేల కోట్లతో విద్యా ప్రణాళిక తెలంగాణలో విద్యా రంగాన్ని సమూలంగా మార్చేందుకు తమ ప్రభుత్వం రూ.30 వేల కోట్లతో ప్రణాళిక రూపొందించిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు రేవంత్రెడ్డి వివరించారు. మంగళవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో ఆమెను కలిసి.. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కూళ్ల ఏర్పాటు, ఇతర విద్యా సంస్థల అభివృద్ధికి ఉద్దేశించిన రూ.30 వేల కోట్ల ప్రణాళికకు అనుమతులివ్వాలని కోరారు. 105 నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో పాఠశాలలో 2,560 మంది చొప్పున సుమారు 2.70 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని వివరించారు. ఈ స్కూళ్లకు రూ.21 వేల కోట్లు, ఇతర ఉన్నత విద్యాసంస్థల అభివృద్ధికి రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. నిధుల సమీకరణకు ఏర్పాటు చేసే ప్రత్యేక కార్పొరేషన్కు అనుమతి ఇవ్వడంతో పాటు ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం కోరారు. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు చేసిన అప్పుల రీస్ట్రక్చర్కు అనుమతించాలని విన్నవించారు. సీఎం విజ్ఞప్తులపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సీఎం వెంట ఎంపీలు రేణుకా చౌదరి, మల్లు రవి, పోరిక బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, చామల కిరణ్కుమార్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
గ్రోత్ కారిడార్లలో భూమి బంగారమే.. 3 రెట్లు పెరిగిన ధరలు
రేపటి అర్బన్ ఇండియా విజనే భారత్ ఫ్యూచర్ సిటీ. కృత్రిమ మేధస్సు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ తయారీ, పర్యాటకం, స్పోర్ట్స్, చలనచిత్ర నిర్మాణం, ఆరోగ్యం వంటి అన్ని రంగాలకు ప్రత్యేకంగా జోన్లను కేటాయిస్తూ.. రేపటి తరాలకు పర్యావరణ హితమైన నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వచ్చే పదేళ్లలో సుమారు 10 లక్షల ఉద్యోగులు పనిచేయనున్న ఈ ఫోర్త్ సిటీలో ఈ మేరకు హౌసింగ్ డిమాండ్ ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు కొత్త మనోహర్రెడ్డి అన్నారు. హైదరాబాద్కు దక్షిణం వైపున 765 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చెందనున్న ఈ సమగ్ర పట్టణ ప్రాంతం భారత్కే తలమానికంగా నిలుస్తుందని తెలిపారు. –సాక్షి, సిటీబ్యూరోఇప్పటికే ఫేజ్–1లో 14 వేల ఎకరాల భూమిని సమీకరించారు. మరో 30 వేల ఎకరాల భూమిని సమీకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో రహదారుల నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయి. పనుల ప్రారంభమైతే ఆయా ప్రాంతాల్లోని భూమి బంగారంగా మారుతుంది. వచ్చే రెండేళ్లలో ఫ్యూచర్ సిటీలోని ప్రాంతాలలో భూముల ధరలు మూడు రెట్లు పెరగడం ఖాయం. మీర్ఖాన్పేట, ముచ్చర్ల, గుమ్మడవల్లి, లేమూరు, యాచారం, కందుకూరు, నందివనపర్తి, కడ్తాల్, ఆమన్గల్ ప్రాంతాల్లో అభివృద్ధి జోరుగా ఉంటుంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో ఎకరం రూ.2–5 కోట్లు ఉండగా.. వచ్చే రెండేళ్లలో రూ.10–15 కోట్లకు చేరుతుంది.గ్రోత్ కారిడార్లో బంగారమే.. ఔటర్ రింగ్ రోడ్డుతో అభివృద్ధి హైదరాబాద్కే పరిమితమైంది. కానీ, రీజినల్ రింగ్ రోడ్డు, దాని చుట్టూ రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్లతో సగం తెలంగాణ ప్రాంతం అభివృద్ధి నెక్ట్స్ లెవల్కు చేరుతుంది. ఇప్పటికే ఆయా కీలక ప్రాజెక్ట్లపై సర్కారు కసరత్తు చేస్తోంది. ఔటర్కు ఇరువైపులా గ్రోత్ కారిడార్ కిలో మీటర వరకే కేటాయించారు. దీంతో మల్టీ పర్పస్ జోన్గా మారిన ఆ ప్రాంతంలో హైరైజ్ అపార్ట్మెంట్లు, భారీ గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య సముదాయాలు వచ్చాయి. ఇక, ఇరువైపులా 5 కి.మీ. వరకూ గ్రోత్ కారిడార్గా పరిగణించనున్న ట్రిబుల్ ఆర్ ప్రాంతంలో అభివృద్ధి ఇంతకు రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఈ కారిడార్లలో ఎక్కడ భూమి కొన్నా బంగారంగా మారడం ఖాయం.శంషాబాద్ మెయిన్ సిటీ.. బేగంపేట విమానాశ్రయం ప్రారంభించిన తొలినాళ్లలో హైదరాబాద్కు శివారు ప్రాంతమది. కానీ, ఇప్పుడు సిటీకి మెయిన్ సెంటర్గా అభివృద్ధి చెందింది. ఇదే తరహాలో ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డుల అభివృద్ధితో సమీప భవిష్యత్తులో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కూడా ప్రధాన నగరంగా మారుతుంది. ఫోర్త్ సిటీ నుంచి శంషాబాద్కు 20 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గమంతా శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. హైటెక్ సిటీలతో ఐటీ కంపెనీల రాకతో గచ్చిబౌలి, నానక్రాంగూడ ఎలాగైతే అభివృద్ధి చెందాయో అంతకు రెట్టింపు వేగంతో మహేశ్వరం అభివృద్ధి చెందుతుంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎయిరో స్పేస్ కంపెనీల రాకతో రావిర్యాల, ఆదిభట్ల, మహేశ్వరం ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి. బెంగళూరు హైవే, ఫ్యూచర్ సిటీలతో అనుసంధానమై ఉండటం అదనపు అంశాలు.అనుమతులు వేగం.. గత ప్రభుత్వంలో ఎలాగైతే టీఎస్–బీపాస్ ద్వారా 21 రోజుల్లోనే పారిశ్రామిక పెట్టుబడులు, సంస్థలకు అనుమతులు ఇచ్చారో.. అదే తరహాలో హెచ్ఎండీఏ, హెచ్ఎంఆర్ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు టైం లైన్ పెట్టి అనుమతులను ఇవ్వాలి. దీంతో ప్రాజెక్ట్లు చేపట్టేందుకు బిల్డర్లు ముందుకు రావడంతో పాటు పన్నులు, ఫీజుల రూపంలో ప్రభుత్వానికి బోలెడంత ఆదాయం సమకూరుతుంది. కొత్త మనోహర్రెడ్డి, రియల్ ఎస్టేట్ నిపుణులు -
రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకుంటోంది..
రాష్ట్రాభివృద్ధి కసం ప్రభుత్వం చేసే పనులు, అవలంభించే విధానాలు ప్రజలకు తెలిస్తేనే మరింత సక్సెస్ అవుతాయి. రాబోయే తరాల భవిష్యత్తును మార్చేసే అలాంటి కీలక ప్రాజెక్ట్లకే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైటెక్ సిటీ, ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్లతో సుమారు మూడు దశాబ్దాలుగా రాష్ట్ర ముఖచిత్రం ఎలా మారిపోయిందో అంతకు రెట్టింపు స్థాయిలో మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్లతో తెలంగాణ దశదిశలు మారిపోతాయి. ఎయిర్పోర్ట్తో హైదరాబాద్ నుంచి ప్రపంచం మొత్తానికి తలుపు తెరిచినట్టే.. ఔటర్తో తెలంగాణ మొత్తానికి కనెక్టివిటీ పెరిగింది. ఇప్పుడిదే స్థాయిలో ప్రపంచ దేశాలను ఆకర్షించే ఈ మూడు గేమ్ చేంజర్ ప్రాజెక్ట్లు రాష్ట్రాభివృద్ధిని మార్చనున్నాయని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య(క్రెడాయ్) తెలంగాణ ప్రెసిడెంట్ కే.ఇంద్రసేనారెడ్డి అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోవరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వ విధానాలు వంటి హనీమూన్ పీరియడ్ ముగిసింది. దీంతో స్థిరాస్తి రంగం మళ్లీ పుంజుకుంటోంది. 18 నెలల్లో నగరంలో 2 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడమే ఇందుకు ఉదాహరణ. వంద చ.అ.కు ఒక జాబ్ చొప్పున 2 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. దీంతో గృహాలకు డిమాండ్ ఏర్పడింది. పాత ప్రభుత్వాలు కేవలం పశ్చిమ హైదరాబాద్ మీదనే దృష్టి పెట్టాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పాతబస్తీలో మెట్రో విస్తరణ, దక్షిణ హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్.. ఇలా ఎక్కడికక్కడ అభివృద్ధి ప్రణాళికలు చేస్తోంది. గ్రీన్ఫీల్డ్ రోడ్లు, ఓఆర్ఆర్– ట్రిపుల్ ఆర్ మధ్య కొత్త ప్రాంతాలలో భూములు అందుబాటులోకి వస్తాయి. వ్యాపార అవకాశాలూ పెరుగుతాయి. రోడ్లను వెడల్పు చేస్తే కార్ల సంఖ్య పెరగడమే తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. మెట్రో విస్తరణ దూరాలు దగ్గరవుతాయి. ప్రజా రవాణా పెంచితేనే సిటీ అభివృద్ధి, దూరం పెరుగుతుంది. దీంతో కస్టమర్లు ఎక్కడికక్కడ ఇళ్లు కొనుగోలు చేయవచ్చు.హైడ్రా లాగే రెరా.. ప్రస్తుతం దేశంలో సుమారు 1.10 లక్షల మంది బిల్డర్లు ఉన్నారు. నిర్మాణ రంగంలో అసంఘటిత బిజినెస్ ఎక్కువగా ఉంటుంది. నకిలీ బిల్డర్లు, మధ్యవర్తుల మాయమాటలు నమ్మి, తక్కువ ధరకు వస్తుందనే ఆశతో వారి చేతిలో కస్టమర్లు మోసపోతున్నారు. గృహ కొనుగోలుదారులకు భరోసా, వారి పెట్టుబడులకు భద్రత కల్పించే పదునైనా అస్త్రం రెరా. దీన్ని గత ప్రభుత్వం విస్మరించింది. దీంతో ప్రీలాంచ్, సాఫ్ట్లాంచ్ల పేరుతో అమాయక కస్టమర్ల కష్టార్జితాన్ని కాజేశారు. కస్టమర్లు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అనుమతులు లేకుండా, రూపాయి పన్ను చెల్లించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే నకిలీ బిల్డర్లను హైడ్రా తరహాలో కఠినంగా వ్యవహరించాలి. ఈమేరకు రెరాను మరింత బలోపేతం చేయాలి.ఏటా లక్ష కార్మికులకు నైపుణ్య శిక్షణ.. దేశీయ నిర్మాణ రంగంలో వచ్చే పదేళ్లలో 4.5 కోట్ల మంది నైపుణ్య కార్మికులు అవసరం. ఒడిశా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి సుమారు 18 లక్షల మంది కార్మికులు తెలంగాణ నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది నైపుణ్య కార్మికులు నెలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకూ సంపాదిస్తున్నారు. కొడంగల్, నిజామాబాద్, పరిగి, కరీంనగర్, వరంగల్ వంటి మన తెలంగాణ నుంచి యువత ముంబై, ఎన్సీఆర్–ఢిల్లీ, దుబాయ్, గల్ఫ్ వంటి దేశాలకు వలస వెళ్తున్నారు. నెలకు రూ.25–రూ.30 వేలకు పనిచేస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో సుమారు వెయ్యి ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. ఆయా విద్యా సంస్థలు అకడమిక్ స్థాయిలో బాగానే ఉన్నా ఆన్సైట్ ప్రాక్టికల్ శిక్షణలో వెనుకబడి ఉన్నాయి. 12 తరగతిలోపు, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు 180 రోజుల పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. 90 రోజుల పాటు క్లాస్రూమ్ శిక్షణ, 90 రోజులు ఆన్సైట్ ట్రెయినింగ్ ఉంటుంది. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే జరగనున్న క్రెడాయ్ స్టేట్కాన్ సదస్సులో సీఎం రేవంత్రెడ్డితో చర్చించనున్నాం.త్వరలోనే ఫ్యూచర్ సిటీ చాప్టర్..ప్రస్తుతం క్రెడాయ్ తెలంగాణలో 15 చాప్టర్లు, వెయ్యి మంది సభ్యులు ఉన్నారు. వీటిని 25 చాప్టర్లకు విస్తరించాలన్నది లక్ష్యం. త్వరలోనే ఫ్యూచర్ సిటీ క్రెడాయ్ చాప్టర్ను ప్రారంభించనున్నాం. కనీసం ఒక్క ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) పొందిన, నాణ్యమైన 30 మంది సభ్యులతో ఈ చాప్టర్ను తెరవనున్నాం. కోడ్ ఆఫ్ కండక్ట్ విధిగా పాటించే సభ్యులతో ఆ తర్వాత సంగారెడ్డి, జహీరాబాబాద్ చాప్టర్లు కూడా రానున్నాయి. ప్రభుత్వం, బిల్డర్లకు మధ్య క్రెడాయ్ వారధిలా పనిచేస్తుంది. ప్రభుత్వ పాలసీలు, పన్నులు తదితరాలపై బిల్డర్లకు అవగాహన కల్పిస్తుంది. -
రెండు నగరాల జంట కథ.. ముఖ్యమంత్రుల వింత వ్యథ!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశలన్నీ ఇప్పుడు రెండు నగరాలపైనే ఉన్నాయి. ఫ్యూచర్ సిటీపై రేవంత్, అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు గంపెడు ఆశలతో ఉన్నారు. అయితే, ఈ రెండు కొత్త నగరాల ప్రతిపాదనలను పరిశీలిస్తే రేవంత్ రెడ్డి పరిస్థితే కొంత మేలు అనిపిస్తుంది.ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులతో జరిగిన ఒక సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘కొంతమంది ఫ్యూచర్ సిటీని ఫోర్ బ్రదర్స్ సిటీ అని అంటున్నారు.. మీరంతా నాకు సోదరులే. మీ అందరి ప్రయోజనం కోసమే దాన్ని డిజైన్ చేస్తున్నాను. ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోను’ అని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు పుంజుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడుతోందో అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఫ్యూచర్సిటీ అని రేవంత్ ధైర్యంగా చెప్పగలిగారు కానీ.. చంద్రబాబు మాత్రం ఇప్పటికీ రైతు ప్రయోజనాల కోసమే అమరావతి అన్న బిల్డప్ను కొనసాగిస్తున్నారు. కానీ అందరూ దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగానే పరిగణిస్తున్నారు.వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి భూముల అమ్మకం ద్వారా ఆ రుణాలు తీరుస్తామన్న ప్రభుత్వం వ్యాఖ్యలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అచ్చంగా సరిపోతుంది కూడా. అయితే చిన్న చినుకుకే చిత్తడై పోతూ.. చెరువులను తలపిస్తున్న అమరావతి ప్రాంతం సహజంగానే పలు రకాల సందేహాలకు తావిస్తుంది. ఈ విషయాలపై మాట్లాడిన వారిపై కేసులు పెట్టి అణగదొక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలనూ అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒక పక్క వరద లేదని ప్రభుత్వం చెబుతుంటే.. మరోపక్క మంత్రి నారాయణ వరద ఏ రకంగా ఉందో చెప్పకనే చెప్పారు.అమరావతి నగరం ఎప్పటికి పూర్తి అవుతుంది? అందుకోసం ఎన్ని లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది? రాష్ట్ర ప్రజలందరిపై పడే అప్పుల భారం ఎంత? అన్న చింత ఏపీలోని ఆలోచనాపరుల్లో కనిపిస్తోంది. అమరావతికి సంబంధించి ఊహా చిత్రాలు అంటూ గ్రాఫిక్స్ ప్రదర్శించి ప్రజలను తన అనుకూల మీడియా ద్వారా టీడీపీ మభ్యపెట్టాలని యత్నిస్తే, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఊహా చిత్రాలను ప్రచారంలోకి తేవడం విశేషం. ఫ్యూచర్ సిటీ నిర్మాణం కూడా అంత తేలిక కాకపోవచ్చు. ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలు తెలియాల్సి ఉంది. అయినా ఇక్కడి భూ స్వభావం, వరదల వంటి సమస్యలు లేకపోవడం, ఇప్పటికే అభివృద్ది చెందిన హైదరాబాద్ చెంతనే ఉండడం కలిసి రావచ్చు. దానికి తోడు ఫార్మా సిటీ కోసం గత కేసీఆర్ ప్రభుత్వం సమీకరించిన 14 వేల ఎకరాల భూమి అదనపు అడ్వాంటేజ్ కావచ్చు.నిజానికి ఏ ప్రభుత్వం కూడా కొత్త నగరాలను నిర్మించదు. ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించి నగరాభివృద్దికి దోహదపడతాయి. ఈ క్రమంలో నగరాభివృద్ది సంస్థలు ఆయా చోట్ల భూములు సేకరించి, కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను తయారు చేస్తుంటాయి. ఉదాహరణకు హైదరాబాద్లో హెచ్ఎండీఏ ప్రభుత్వ భూములను కొన్నిటిని తీసుకుని, లేదా ప్రైవేటు భూములను సమీకరించి ప్లాట్లు వేసి వేలం నిర్వహిస్తుంటుంది. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న అనుభవమే. గత టర్మ్లో ఏపీలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా ఆయా పట్టణాలు, నగరాలలో ప్రభుత్వపరంగా ఇలాంటి వెంచర్లు వేసి మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలలో స్థలాలను సమకూర్చాలని ప్లాన్ చేసింది. అందుకోసం భూములు కూడా తీసుకున్నారు. ఇది ఒక క్రమ పద్దతిలో జరిగితే స్కీములు సక్సెస్ అవుతాయి. లేదంటే విఫలమవుతాయి. పారిశ్రామిక అవసరాల కోసం ప్రత్యేకంగా వసతుల కల్పన సంస్థలు ఉన్నాయి.అవి ఆయా చోట్ల, అంతగా పంటలు పండని భూములను సేకరించి రోడ్లు, విద్యుత్, నీరు తదితర వసతులు కల్పించి పరిశ్రమలకు అనువైన రీతిలో తయారు చేసి విక్రయిస్తుంటాయి. తెలంగాణ, ఏపీలలో పలుచోట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. కొన్ని ఇతర చోట్ల కూడా పరిశ్రమలు భూములు కొనుగోలు చేసుకుని యూనిట్లను పెట్టుకుంటాయి. ఇదంతా నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. అయితే ఏపీ విభజన తర్వాత చంద్రబాబు తానే కొత్త రాజధాని నగరం నిర్మిస్తానంటూ 33 వేల ఎకరాల భూమిని సమీకరించారు. మరో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ప్రభుత్వ భూమిలో తమకు అవసరమైన కార్యాలయాల భవనాలు నిర్మించడం కాకుండా, ఆయన వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించి వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రతిపాదించారు. ప్రభుత్వం అన్ని సదుపాయాలతో ప్లాట్లు ఇస్తే బాగా రేట్లు వస్తాయని ఆశపడ్డ రైతులు తమ భూములను పూలింగ్ కింద ఇచ్చారు.కానీ, ఇప్పటికీ పదేళ్లు అయినా వారికి ప్లాట్లు దక్కలేదు. వసతుల కల్పన జరగలేదు. పైగా మరో 44 వేల ఎకరాల భూమిని అదనంగా సమీకరిస్తామని ప్రభుత్వం చెప్పడంపై రైతులలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ లక్ష ఎకరాల భూమి ఎప్పటికి అభివృద్ది కావాలి? అక్కడకు ఏ తరహా పరిశ్రమలు ఎప్పటికి వస్తాయి? నవ నగరాల పేరుతో గతంలో చేసిన హడావుడి ఇప్పుడు కూడా చేస్తారా?. అమరావతిలో భూములు కొంటే కోట్ల రూపాయల లాభం వస్తుందని భావించి అనేకమంది పెట్టుబడి పెడితే రేట్లు పడిపోయి వారంతా అయోమయంలో చిక్కుకున్నారు. రైతులకు తమ ప్లాట్లు వస్తే అమ్ముకోవచ్చని అనుకుంటే దానికి పలు షరతులను అధికారులు పెడుతున్నారు. వెయ్యి గజాలు, రెండువేల గజాల ప్లాట్లు వచ్చిన రైతులు అవి కాగితం మీదే ఉన్నా, వాటిని విభజించుకోవడానికి లేదన్న కండిషన్ వారిని ఆందోళనకు గురి చేస్తోంది. పలువురు రైతులు తమకు ఈ కాగితాల ఆధారంగా అప్పులు పుట్టడం లేదని, భూములు అమ్ముదామన్నా అవి ఎక్కడ ఉన్నాయో చూపలేక పోతున్నామని వాపోతున్నారు.ఇన్ని సమస్యలు ఒకవైపు ఉంటే, మరోవైపు ఓ మోస్తరు వర్షం కురిసినా ఆ ప్రాంతం అంతా నీటిమయం అవుతోంది. భూమి చిత్తడిగా మారుతోంది. ఈ భూమి భారీ నిర్మాణాలకు అనువు కాదని శివరామకృష్ణ కమిటీ, ప్రపంచ బ్యాంక్లు కూడా చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతోంది. ఈ సమస్యలన్నీ సర్దుకుని నిర్మాణాలు సాగితే ఫర్వాలేదు కాని, లేకుంటే ప్రభుత్వం రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకోవడం కోసం ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. అక్కడకు పలు సంస్థలు వచ్చేస్తున్నట్లు, ఏఐ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ, స్పోర్ట్స్ సిటీ, కొత్త విమానాశ్రయం ఏర్పాటు, వంటివి జరగబోతున్నట్లు హడావుడి చేస్తున్నారు. అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదార్లు.. అవన్నీ అయినప్పుడు చూద్దాంలే అన్నట్టు వేచి చూసే ధోరణిలోనే ఉంటున్నారు.ఇక, ఫ్యూచర్ సిటీ విషయానికి వస్తే ఇక్కడ కూడా భూ సేకరణపై కొంత నిరసన వ్యక్తమవుతోంది. అధిక వాటా, అనాసక్తి వంటి కారణాలతో రైతులు కొంతమంది ప్రభుత్వానికి సహకరించడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం బాగా మందగించింది. ఇప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. ఫ్యూచర్ సిటీ ప్రతిపాదన వల్ల ఆ ప్రాంతంలో భూముల రేట్లు కొంత పెరిగిన మాట నిజమే కాని, రకరకాల సందేహాల వల్ల ఇప్పుడు అంత ఊపు లేదు అంటున్నారు. దానిని పారదోలడానికి రేవంత్ సర్కార్ కష్టపడుతోంది. వదంతులు నమ్మవద్దని, ఫ్యూచర్ సిటీకిగాని, హైదరాబాద్కు కాని రియల్ ఎస్టేట్ తదితర రంగాలలో మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. ప్లాన్డ్గా అభివృద్ది ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.అయితే ఆయా గ్రామాల మధ్య శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డుల మధ్య ఈ సిటీ అభివృద్దికి ఎన్నో ఆటంకాలు కూడా రావచ్చన్న అనుమానం ఉంది. హైడ్రాను స్థాపించడం వల్ల రేవంత్ సర్కార్కు కొంత కీర్తి, మరికొంత అపకీర్తి వచ్చింది. చెరువుల శిఖం భూములనో, మరొకటనో, కొత్తగా నిర్మిస్తున్న పలు భవనాలు, అపార్టెమెంట్లు కూల్చడం వల్ల మధ్య తరగతి ప్రజలు కొంత నష్టపోయారు. వారు ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేయడానికి సందేహిస్తున్నారు. అయితే చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు వంటి వాటి వల్ల కొంత పేరు కూడా వచ్చింది. ఇందులో కూడా పక్షపాతంగా కొన్ని జరిగాయన్న విమర్శలూ ఉన్నాయి. ఇక ఓవరాల్ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని ఉండడం, ఐటీ రంగంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడడం, ఉద్యోగుల లేఆఫ్ల ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై కూడా ఉందని అంటున్నారు.హైదరాబాద్లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఏ అభివృద్ది లేని అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం అంత తేలిక కాదని అంచనా. తాజాగా హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో ఏడు ఎకరాల ప్లాటును గోద్రోజ్ కంపెనీ 547 కోట్లకు కొనుగోలు చేయడం రేవంత్ ప్రభుత్వానికి ఒక సానుకూల అంశం. చంద్రబాబు, రేవంత్లు అలవికాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక సతమతమవుతున్నారు. ఏపీ సర్కార్ రికార్డు స్థాయిలో అప్పులు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పుల ఊబిలో దిగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ స్థితిలో రెండు కొత్త నగరాల నిర్మాణం వీరికి అవసరమా?. ఇతర ప్రజా సమస్యలను పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ కోసం ఇంత రిస్క్ అవసరమా? అని ఎవరైనా అడిగితే ఎవరి వ్యూహం వారిది అని తప్ప ఇంకేమీ చెప్పగలం.!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.