‘ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్‌’గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు | Hyderabad As Laboratory Of The Future: Minister Sridhar Babu | Sakshi
Sakshi News home page

‘ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్‌’గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు

Feb 17 2026 1:23 PM | Updated on Feb 17 2026 1:33 PM

Hyderabad As Laboratory Of The Future: Minister Sridhar Babu

లైఫ్ సైన్సెస్ రంగంలో 2030 నాటికి కొత్తగా 5 లక్షల మందికి ఉద్యోగాలు

ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా తెలంగాణను నిలిపేలా కృషి

"బయో ఏషియా 2026" ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి

హైదరాబాద్‌: ఫార్మా రాజధానిగా పేరొందిన హైదరాబాద్‌ను ‘‘ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్‌’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి.. కొత్తగా 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 

ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో రాష్ట్రాన్ని ఒకటిగా నిలిపేందుకే "తెలంగాణ నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ(2026- 2030)" రూపొందించామని మంగళవారం హెచ్ఐఐసీ లో నిర్వహించిన "బయో ఏషియా 2026" సదస్సు ఆయన వివరించారు. ఇప్పటి వరకు లైఫ్ సైన్సెస్ రంగంలో సప్లై కోసం మాత్రమే మన వైపు చూసిన ప్రపంచం ఇప్పుడు ప్రస్తుతం ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాల కోసం చూస్తోందన్నారు.

ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా తెలంగాణను అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నామన్నారు. తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ఎంఆర్ఎన్ఏ(mRNA), జీన్ ఎడిటింగ్, ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ వంటి అత్యాధునిక రంగాల్లో "రెడీ టూ వర్క్ ఫోర్స్"గా ఇక్కడి యువతను తయారు చేస్తున్నామన్నారు. సీబీఆర్ఈ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ (2025) ప్రకారం, బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, బీజింగ్, టోక్యో లాంటి గ్లోబల్ హబ్‌ల సరసన నిలిచిన ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ అని అన్నారు.

అందుకే... కేవలం ఉత్పత్తి చేయడమే కాకుండా, నేటి అవసరాలకు అనుగుణంగా కొత్త ఔషధాలను కనుగొనే కేంద్రంగానూ హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. అలాగే... గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్ గానూ మార్చేందుకు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చామన్నారు. ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ, ఆటోమేషన్ ఇన్ బయోలాజిక్స్ మాన్యుఫాక్చరింగ్, డేటా ఆధారిత ప్రెసిషన్ మెడిసిన్ , కంప్యూషనల్ బయాలజీ, బయో మాన్యుఫాక్చరింగ్ 4.o తదితర రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement