కొత్త ప్రైవేట్ వర్సిటీల్లో కన్వినర్ కోటా సీటు ఫీజుపై సందిగ్ధం
ఇంజినీరింగ్ ప్రవేశాలు మొదలవుతున్నా ఖరారు కాని ఫీజు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఫీజు నిర్ణయించడంలో ప్రభుత్వం చేసిన జాప్యం కారణంగా శనివారం ఆప్షన్లు నమోదు చేసేందుకు అర్ధరాత్రి వరకు వీలుపడలేదు. రాత్రి 11 గంటల వరకు ఏపీఈఏపీ సెట్ వెబ్సైట్ తెరుచుకోలేదు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో కన్వీనర్ కోటా ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. కొత్తగా ఏర్పాటైన ప్రైవేట్ యూనివర్సిటీల్లో కన్వీనర్ సీట్లకు ఫీజును ఇంతవరకు ఖరారు చేయకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
2026–27 విద్యాసంవత్సరానికి 11 ప్రైవేట్ యూనివర్సిటీల్లో కన్వినర్ కోటా (35 శాతం) కింద మొత్తం 13,610 ఇంజినీరింగ్ సీట్లను భర్తీచేయనున్నారు. ఈ సీట్లకు ఫీజు ఖరారయ్యే వరకు ఏటా రూ.47 వేలు తాత్కాలిక బేస్ ఫీజు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి కోర్సు వారీ తుది ఫీజును ఏపీ ఉన్నతవిద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్ఈఎఫ్ఆర్ఎంసీ) నిబంధనల ప్రకారం తర్వాత నిర్ణయిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
అడ్మిషన్ల సమయంలోనే కోర్సు ఫీజు ఎంత అనేదానిపై స్పష్టత ఉంటే తమకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. నాణ్యమైన బోధన, అధ్యాపకుల అర్హతలు, మౌలిక వసతులు, ల్యా»ొరేటరీలు, ప్లేస్మెంట్లు వంటి అంశాలపైన కూడా ప్రభుత్వం సమగ్ర పర్యవేక్షణ చేపట్టాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు.
కొన్ని కోర్సులకే ప్రాధాన్యం
రాష్ట్రంలో 11 ప్రైవేట్ యూనివర్సిటీల్లో కన్వినర్ కోటా కింద మొత్తం 13,610 ఇంజినీరింగ్ సీట్లను భర్తీచేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో నంబూరులోని వీవీఐటీ యూనివర్సిటీలో అత్యధికంగా 2,240 సీట్లు ఉన్నాయి. ఆదిత్య యూనివర్సిటీలో 1,849 సీట్లు, విట్–ఏపీలో 1,814, అన్నమాచార్య యూనివర్సిటీలో 1,554, మోహన్బాబు యూనివర్సిటీలో 1,519, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ–ఏపీలో 1,450, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో 1,324, భారతీయ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీలో 1,134, సెంచూరియన్ యూనివర్సిటీలో 273,, అపోలో యూనివర్సిటీలో 273, శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో 180 సీట్లు ఉన్నాయి. ఎక్కువ యూనివర్సిటీల్లో కంప్యూటర్ సైన్స్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకే అధిక ప్రాధాన్యం కనిపిస్తోంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి సంప్రదాయ ఇంజినీరింగ్ కోర్సుల్లో తక్కువ సీట్లు ఉన్నాయి.


