ఖర్గే చురకలు.. శశిథరూర్‌ కౌంటర్‌! | After Kharge Modi is first Comments Tharoor Reacts With This | Sakshi
Sakshi News home page

ఖర్గే చురకలు.. శశిథరూర్‌ కౌంటర్‌!

Jun 25 2025 4:54 PM | Updated on Jun 25 2025 5:17 PM

After Kharge Modi is first Comments Tharoor Reacts With This

కాంగ్రెస్‌ అధిష్టానంతో సీనియర్‌ నేత శశిథరూర్‌కు ఉన్న విభేదాలు ఇవాళ మరోసారి అధికారికంగా బయటపడ్డాయి. శశిథరూర్‌ను ఉద్దేశించి కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. కాసేపటికే థరూర్‌ సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

నాకు ఇంగ్లీష్‌ చదవడం అంత బాగా రాదు. కానీ, శశిథరూర్‌ భాష చాలా బాగుంటుంది. అందుకే ఆయన ఇంకా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో ఉన్నారు.  మేము మాకు వచ్చిన భాషలో ‘‘దేశమే ముందు(మా తొలి ప్రాధాన్యం) అంటాం’’. భారత సైన్యానికి మద్దతుగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఆపరేషన్‌ సిందూర్‌ కోసం ఐక్యంగా నిలబడ్డాం. కానీ కొంతమంది ‘‘మోదీనే ముందు.. ఆ తర్వాతే దేశం అంటారు. అలాంటప్పుడు మేమేం చేయాలి?’’ అని నవ్వుతూ అన్నారాయన. మోదీని ప్రశంసించినందుకు థరూర్‌పై చర్యలు ఉంటాయా? అని ఎదురైన ప్రశ్నకు.. ఆ వ్యాఖ్యలకు పార్టీ దూరంగా ఉంటుందని, చర్యలు తీసుకునే ఉద్దేశమేదీ లేదని అన్నారు. అదే సమయంలో పార్టీ ఐక్యతే అధిష్టానానికి ముఖ్యం అని ఖర్గే పేర్కొన్నారు. 

మరోవైపు.. ఖర్గే ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ తన ట్విటర్‌లో ఓ పోస్ట్‌ ఉంచారు. ‘‘ఎగరడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు. రెక్కలు నీవి.. ఆకాశం ఎవరి సొంతం కాదు’’ అంటూ ఓ పోస్ట్‌ను ఉంచారాయన. దీంతో  ఇది ఖర్గేకు సెటైరే అంటూ ఆయన కామెంట్‌ సెక్షన్‌లో చర్చ నడుస్తోంది. 

2020 – G-23 లేఖ దగ్గరి నుంచి శశిథరూర్‌కు, అధిష్టానం మధ్య గ్యాప్‌ మొదలైంది. థరూర్‌ సహా 23 మంది సీనియర్ నేతలు ‘కాంగ్రెస్‌లో  అంతర్గత ప్రజాస్వామ్యం, స్థిరమైన నాయకత్వం’ కోరుతూ లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది సోనియా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా(మరీ ముఖ్యంగా అప్పటి రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ..) తిరుగుబాటు లాగా భావించారంతా.  

ఆపై 2022లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇది మరోసారి బయటపడింది. శశిథరూర్ మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఖర్గే గెలిచినా, థరూర్‌కు 1,000కి పైగా ఓట్లు వచ్చాయి. అయితే పార్టీలో అంతర్గతంగా థరూర్‌కు మద్దతు ఉన్నట్లు ఈ ఎన్నిక సూచించింది.

2023–24.. శశిథరూర్ ఈ మధ్యకాలంలో తరచూ పార్టీ లైన్‌కు భిన్నంగా మాట్లాడారు. మరీ ముఖ్యంగా విదేశాంగ విధానాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. కొన్ని సందర్భాల్లో ఆయన ప్రధానమంత్రి మోదీని ప్రశంసించడం పార్టీ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది. అదే సమయంలో థరూర్‌ అభిప్రాయాల ఆధారంగానే కాం‍గ్రెస్‌పైకి బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది.

2025.. ఆపరేషన్ సిందూర్ తర్వాత కాంగ్రెస్‌కే షాకిస్తూ ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ను అఖిలపక్ష బృందంలో ఎంపిక చేసింది బీజేపీ. పలు దేశాల సమావేశాల్లో థరూర్‌ మోదీ నాయకత్వంపై ప్రశ్నలు గుప్పించారు. ఇది ఆయన కొందరు కాంగ్రెస్‌ నేతలతో సోషల్‌ మీడియా వేదికగా వాగ్వాదానికి కారణమైంది. విదేశాల నుంచి తిరిగి వచ్చాక పార్టీ అధిష్టానంతో విభేదాలున్నాయని అంగీకరిస్తూనే.. అవి నాలుగు గోడల మధ్య చర్చించుకునే విషయమని కేరళలో స్పష్టం చేశారు. ఆపై ది హిందూ కోసం ఆయన రాసిన ఓ కథనం.. ప్రధాని మోదీ శక్తి, చురుకుదనం భారతదేశానికి ప్రధాన ఆస్తి అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు మరింత ఆగ్రహం తెప్పించాయి. అయితే ఇవేవీ తాను బీజేపీలో చేరతాననే సంకేతాలు మాత్రం కాదని శశిథరూర్‌ తాజాగా స్పష్టత ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement