Shashi Tharoor: స్వరం మార్చిన కాంగ్రెస్‌ ఎంపీ! | Congress Tharoor Rift: Congress MP Toned Changed | Sakshi
Sakshi News home page

Shashi Tharoor: కాంగ్రెస్‌తో విభేదాలు.. స్వరం మార్చిన సీనియర్‌ ఎంపీ!

Jun 19 2025 9:30 PM | Updated on Jun 19 2025 9:30 PM

Congress Tharoor Rift: Congress MP Toned Changed

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ పార్టీలో విభేదాలపై స్వరం తగ్గించారు. గురువారం నీలంబూర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ జరగ్గా.. ఆ ఎన్నిక ప్రచారానికి థరూర్‌ దూరంగా ఉండడంపై మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన పార్టీ నుంచి పిలుపు లేకపోవడం వల్లే దూరంగా ఉన్నానని చెబుతూనే.. అయినా అదేమీ పెద్ద విషయం కాదన్న రీతిలో మాట్లాడారు.

దౌత్య సంబంధమైన మిషన్‌ కోసం నేను విదేశాలు వెళ్లాను. తిరిగి వచ్చాక కూడా అధిష్టానం నుంచి నాకు ఫోన్‌ రాలేదు. కనీసం ప్రచారం చేయాలని కూడా నాకు సూచించలేదు. ఎన్నికల ప్రచారానికి పార్టీ నన్ను ఆహ్వానించలేదు. అయినా ఫర్వాలేదు. కొన్ని విషయాల్లో పార్టీ అధిష్టానంతో విభేదాలు ఏర్పడడం సహజమే అని అన్నారాయన.

నేను ఇవాళే కేరళకు వచ్చాను. ఇవాళ ఓటింగ్‌ రోజు(నీలంబూర్‌ ఉప ఎన్నికకు). మా పార్టీ అభ్యర్తి మంచి వ్యక్తి. ఆయనకు ఓటేయమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అని గురువారం ఉదయం ఎయిర్‌పోర్టులో మీడియాతో ఆయన వ్యాఖ్యానించారు.

అయితే పార్టీతో విభేదాల నేపథ్యంతోనే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారా? అనే మీడియా ప్రశ్నను ఆయన తోసిపుచ్చారు. గత నాలుగు ఎన్నికలుగా తిరువనంతపురం నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తలు నా వెంటే ఉన్నారు. నా గెలుపు కోసం వాళ్లు తీవ్రంగా శ్రమించారు. రాజకీయాల్లో అధిష్టానంతో కొన్ని అంశాల్లో విభేదాలు తలెత్తడం సహజమే. అయితే అవి అంతర్గతంగా నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోగలిగినవే. వాటి ఇప్పుడు చర్చించడం అప్రస్తుతం. సమయం వచ్చినప్పుడు స్పందిస్తా. ఇలాంటివి సహజమే. కాంగ్రెస్‌ పార్టీ విలువలకు నేను ఎప్పటికీ కట్టుబడి ఉంటాను’’ అని థరూర్‌ స్పష్టం చేశారు.  

పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టి పాక్‌ ఉగ్ర​ స్థావరాలను, ఎయిర్‌బేస్‌లను భారత సైన్యం నాశనం చేసింది. ఆపై దౌత్యపరమైన యుద్ధాన్ని ప్రకటించింది. ఈ క్రమంలోనే.. అఖిలపక్ష ఎంపీల బృందాన్ని పలు దేశాలకు పంపింది. కాంగ్రెస్‌ ప్రమేయం లేకుండా శశిథరూర్‌ను ఆ బృందంలోకి ఎంపిక చేసి కేంద్రంలోని బీజేపీ ఆశ్చర్యపరిచింది.

ఈ క్రమంలో.. విదేశీ పర్యటనల్లో పాక్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎండగడుతూనే.. మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరిపిందంటూ థరూర్‌ ఆకాశానికెత్తారు. ఈ వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. యూపీఏ హయాంలో జరిగిన సర్జికల్‌ స్ట్రయిక్స్‌ను కూడా థరూర్‌ ప్రస్తావించి ఉంటే బాగుండేదని, మరీ బీజేపీ ఏజెంట్‌లా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. కొందరు కీలక నేతలు సైతం థరూర్‌ లక్ష్మణరేఖ దాటారంటూ వ్యాఖ్యానించారు. అయితే తాను సందర్భానుసారం ఆ వ్యాఖ్యలు చేసినట్లు గుర్తిస్తే మంచిదంటూ కాంగ్రెస్‌ నేతలకు చురకలంటించారాయన. ఈ క్రమంలో ఆయనకు పార్టీకి మధ్య దూరం పెరుగుతోందని అంతా భావించారు. అయితే తిరిగి స్వదేశానికి చేరుకున్న ఆయన.. ఆ విభేదాలు నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోగలిగనవే అని వ్యాఖ్యానించడం కొసమెరుపు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement