మంటల్లో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు.. ప్రయాణికుల సజీవ దహనం | karnataka Private Travels Bus Accident Dec 25th News Updates | Sakshi
Sakshi News home page

మంటల్లో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు.. ప్రయాణికుల సజీవ దహనం

Dec 25 2025 6:28 AM | Updated on Dec 25 2025 8:36 PM

karnataka Private Travels Bus Accident Dec 25th News Updates

కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదంపై దాదాపుగా ఓ స్పష్టత వచ్చింది. రాంగ్‌రూట్‌లో వచ్చిన కంటెయినర్‌ లారీ ఢీ కొట్టడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో 17 మంది మరణించగా.. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

దాదాపు 30 మంది ప్రయాణికులతో( డ్రైవర్‌, క్లీనర్‌తో కలిపి 31 మంది అని)  కూడిన బస్సు బుధవారం అర్ధరాత్రి దాటాక బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తుండగా.. బెంగళూరు-హెబ్బులి హైవేపై సిరా-హిరియూర్‌ మధ్య గోర్లత్తు గ్రామం(చిత్రదుర్గ జిల్లా) వద్ద ప్రమాదానికి గురైంది. ఆ మంటల ధాటికి బస్సుతో పాటు ట్రక్కు కూడా పూర్తిగా కాలిబూడిదైంది. తొలుత ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రచారం జరిగింది.   

అయితే.. ఈ ఘటన నుంచి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌, హెల్పర్‌ సురక్షితంగా బయటపడ్డాడు. వాళ్లు తెలిపిన వివరాల ప్రకారం.. అపోజిట్‌ రోడ్డులోంచి దూసుకొచ్చిన బస్సు ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగింది. ‘‘డివైడర్‌కు మరోవైపున ప్రయాణిస్తున్న లారీ ఒక్కసారిగా నేను వెళ్తున్న రోడ్డు పైకి దూసుకొచ్చింది. లారీ ఢీకొట్టబోతోందని అర్థమై బస్సును కంట్రోల్‌ చేసేందుకు ప్రయత్నించా. కానీ అప్పటికే ప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి మా బస్సు పక్కనే వెళ్తోన్న మరో వాహనాన్ని కూడా తాకింది. అయితే ఆ వాహనం ఏంటో నేను చూడలేకపోయా. అతివేగం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుంది’’ అని ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ వివరించాడు.

ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి ‍వ్యక్తం చేసిన సీఎం సిద్ధరామయ్య.. మంత్రులను, అధికార యంత్రాగాన్ని ఘటనా స్థలానికి తక్షణమే వెళ్లాలని, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించాలని ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు తర్వాతే ప్రమాదానికి గల కారణంపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని అన్నారాయన. 

ప్రమాదం జరిగిందిలా..
చిత్రదుర్గ జిల్లాలోని జాతీయరహదారి-48పై గోర్లత్తు క్రాస్‌ వద్ద గురువారం వేకువజామున 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న సీబర్డ్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును కంటెయినర్‌ లారీ ఢీకొట్టింది. బస్సు డీజిల్‌ ట్యాంక్‌కు మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగింది. డీజిల్‌ ట్యాంక్‌ వద్ద ఢీ కొట్టడంతో.. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో రెండు వాహనాలు కాలి బూడిద అయ్యాయి. కంటెయినర్‌ డ్రైవర్‌తో పాటు గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికుల్లో చాలామంది కాలి బూడిదయ్యారు.

 

 

యువకుడి సాహసంతో.. 
ప్రయాణికుల్లో ఒక యువకుడు సాహసం చేసి బస్సు అద్దాలు పగలకొట్టాడు. దీంతో 9 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది. వీళ్లలో కొందరికి గాయాలు కావడంతో చిత్రపురి, సిరా ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. కాలిన గాయాలతో ఉన్న క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

సకాలంలో స్పందించినా.. 
సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే మంటలు శరవేగంగా అంటుకుని అప్పటికే బస్సు మొత్తం బూడిదైంది. ట్రావెల్స్‌ నిర్వాహకులు ఇచ్చిన లిస్ట్‌ ప్రకారం.. మృతుల్లో చాలామంది గోకర్ణవాసులేనని తెలుస్తోంది. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

తప్పిన ఘోరం!
అయితే.. ఈ ప్రమాదం నుంచి 40 మందికి పైగా స్కూల్‌ విద్యార్థులు త్రుటిలో తప్పించుకున్నారు. టి.దర్శహళ్లి నుంచి దండేలికి వెళ్తున్న ఓ టూర్‌ బస్సు.. ప్రమాదానికి గురైన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుకు సమాంతరంగా ప్రయాణించింది. ఈ టూర్‌ బస్సులో 42 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రావెల్స్‌ బస్సును లారీ ఢీకొనడంతో ఆ ప్రమాద ధాటికి స్కూల్‌ బస్సు కూడా అదుపు తప్పింది. ఈక్రమంలో స్కూల్‌ బస్సు ప్రమాదానికి గురైన ప్రైవేట్‌ బస్సును వెనక నుంచి ఢీకొట్టి రోడ్డు పక్కకు జారింది. అయితే, పిల్లల బస్సుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ మేరకు ఆ బస్సు డ్రైవర్‌ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్‌ చేశారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement