లైకులు, వ్యూస్‌ కోసం ఇంత దిగజారాలా? | Air India Incident: Victims Familes On Fake Content Viral | Sakshi
Sakshi News home page

లైకులు, వ్యూస్‌ కోసం ఇంత దిగజారాలా?

Jun 16 2025 1:47 PM | Updated on Jun 16 2025 2:59 PM

Air India Incident: Victims Familes On Fake Content Viral

ఒకవైపు.. ఘోర ప్రమాదంలో అయినవాళ్లను కోల్పోయి పుట్టెడు దుఖంలో బాధిత కుటుంబాలు రోదిస్తున్నాయి. డీఎన్‌ఏ పరీక్షలు పూర్తి కాకపోవడంతో మృతదేహాల కోసం బీజే మెడికల్‌ కాలేజీ ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్నాయి. ఈలోపు.. సోషల్‌ మీడియాలో లైక్స్‌, వ్యూస్‌ కోసం కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారు. మృతుల గురించి తప్పుడు సమాచారాన్ని పోస్ట్‌ చేస్తున్నారు. ఈ పరిణామాలపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కొమ్మి వ్యాస్‌.. తన భార్య, ముగ్గురు పిల్లలతో లండన్‌లో స్థిరపడేందుకు ఎయిరిండియా విమానం ఎక్కడిన డాక్టర్‌. అయితే అహ్మదాబాద్‌ ఎయిరిండియా ప్రమాదంలో ఆ కుటుంబం మొత్తం దుర్మరణం పాలైంది. ఇప్పుడు.. ఆ ఫ్యామిలీని బద్నాం చేస్తూ కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. విమానం ఎక్కిన తర్వాత ఫ్యామిలీ ఫొటోను వ్యాస్‌ తన కుటుంబానికి చెందిన వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశారు. అయితే ఆ ఫొటోను ఏఐ వీడియోగా కొందరు వైరల్‌ చేస్తున్నారు. మరికొందరు.. ఒక అడుగు ముందుకు వేసి వ్యాస్‌ కూతురు మిరాయ ఫొటోను, ఓ వీడియోను తెరపైకి తీసుకొచ్చారు. 

‘‘మా కుటుంబాన్ని కోల్పోయామన్న బాధలో మేముంటే.. కొందరు విలువలు మరిచి ప్రవర్తిస్తున్నారు. ఎడిట్‌ చేసిన వీడియోను వైరల్‌ చేస్తున్నారు. మా పాప మిరాయ్‌ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. డీఎన్‌ఏ టెస్టులో ఏ మృతదేహం అనేది దృవీకరణ కాలేదు. కానీ.. ఈలోపే మిరాయ్‌ అంత్యక్రియలంటూ భావోద్వేగం పేరిట ఓ వీడియోను పోస్ట్‌ చేసి కొందరు వ్యూస్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాగేనా చేసేది?’’ అంటూ వ్యాస్‌ కుల్దీప్‌ భట్‌ ఆవేదన-అసహనం వ్యక్తం చేశారు. 

వ్యాస్‌ కుటుంబం మాత్రమే కాదు.. బాధిత కుటుంబాలు చాలా వరకు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఇలాంటి కంటెంట్‌ను ఖండిస్తోంది. సంబంధం లేని వీడియోలు, కంటెంట్‌ను తెర మీదకు తీసుకొచ్చి షేర్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

‘‘ప్రమాదం జరిగిన నాటి నుంచే ఇలాంటి కంటెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎక్కడెక్కడివో వీడియోలను తెచ్చి.. ఎయిరిండియా విమానంలోవి అంటూ పోస్టులు పెడుతున్నారు. మా వాళ్లకు ఏమాత్రం సంబంధం లేని పోస్టులు ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌(ట్విటర్‌)లలో కనిపిస్తున్నాయి. వీటి ఆధారంగా మీడియా సంస్థలు కూడా వార్తలు ప్రచురిస్తున్నాయి. అసలేం చేస్తున్నారు?. ఇలాంటి విషాద సమయంలోనూ కనీస నైతిక విలువలు పాటించరా?’’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విమాన ప్రమాదంపైనా జోకులు, మీమ్స్‌ వేస్తున్న పరిస్థితి. ఈ తరుణంలో.. ప్రభుత్వాలైన స్పందించి అలాంటి కంటెంట్‌ను కట్టడి చేయాలని కోరుతున్నారు మరికొందరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement