వాషింగ్టన్/హైదరాబాద్: భారతదేశంలోని క్రైస్తవ సమాజాలు, మిషనరీలు, దాతృత్వ సంస్థలను రక్షించేందుకు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా సెనేటర్ టిమ్ షీహీ మద్దతు ప్రకటించారు. బుధవారం విడుదల చేసిన వీడియో ప్రకటనలో షీహీ మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ అమెరికాకు భౌగోళిక-రాజకీయ పరంగా ఎంతో ప్రాధాన్యమున్న దేశమని చెప్పారు. ముఖ్యంగా చైనా, ఇతర దేశాలతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఈ ప్రాధాన్యం మరింత ఎక్కువని అన్నారు.
వాషింగ్టన్లోని తన కార్యాలయంలో పాల్తో కలిసి మాట్లాడిన షీహీ, ఆయనను "అమెరికన్ లెజెండ్"గా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పేదరికాన్ని అధిగమించేందుకు, మత స్వేచ్ఛ, స్వాతంత్య్రం ప్రోత్సహించేందుకు ఆయన పని చేశారని చెప్పారు. భారతదేశంలో క్రైస్తవులు, మిషనరీలు, దాతృత్వ సంస్థలను రక్షించడం ముఖ్యమని చెప్పారు. ఈ విషయంలో పాల్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు.
డాక్టర్ పాల్ మాట్లాడుతూ.. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) సవరణ బిల్లుపై తన ఆందోళనలను షీహీతో చర్చించినట్లు తెలిపారు. ప్రతిపాదిత సవరణల్లోని సెక్షన్ 16ఏ, ఎఫ్సీఆర్ఏ పరిధిలో పనిచేస్తున్న చర్చిలు, దేవాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, దాతృత్వ సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆ నిబంధనను పునఃపరిశీలించాలని, క్రైస్తవ దాతృత్వ సంస్థలు, వాటి ఆస్తులకు రక్షణ కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పాల్ కోరారు.
అమెరికా కాంగ్రెస్ సభ్యుల్లో పలువురు, స్పీకర్ మైక్ జాన్సన్తో పాటు రిపబ్లికన్లు, డెమొక్రట్లు కూడా ఈ అంశానికి మద్దతు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. పాల్ వ్యక్తం చేసిన ఆందోళనలకు స్పందించిన షీహీ, "మేము మీకు 100 శాతం అండగా ఉంటాం" అని చెబుతూ తన మద్దతును ప్రకటించారు.


