అమెరికా ఖ్యాతి దిగజారింది.. భారత్‌తో సంబంధాలు క్షీణించాయి | US India Ties At Lowest In 30 Years Due To Trumps Destructive Policies, Claims Indian Origin US Lawmaker Ro Khanna | Sakshi
Sakshi News home page

అమెరికా ఖ్యాతి దిగజారింది.. భారత్‌తో సంబంధాలు క్షీణించాయి

Jun 30 2026 3:37 PM | Updated on Jun 30 2026 4:38 PM

us india ties at lowest in 30 years due to trumps destructive policies ro khanna

వాషింగ్టన్ డీసీ: భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు గత ముప్పై ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి దిగజారాయని అమెరికా డెమెక్రటిక్ నేత రో ఖన్నా (రోహిత్) కన్నా ఆరోపించారు. సోమవారం వాషింగ్టన్‌లో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం వల్లనే ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయని తెలిపారు.

కాలిఫోర్నియాకు చెందిన డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రోహిత్‌ ఖన్నా మాట్లాడుతూ..  ఇరాన్ పట్ల ట్రంప్ వైఖరి, ఇతర విదేశాంగ విధాన నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రతిష్టను దెబ్బతీశాయి. అదే సమయంలో భారత్‌తో సంబంధాలను దెబ్బతీశాయి.  ప్రభుత్వ వలస, విద్యార్థి వీసా విధానాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభను ఆకర్షించే అమెరికా సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. 

గత 30 ఏళ్లలో అమెరికా-భారత్ సంబంధాలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇరాన్‌తో యుద్ధానికి దిగాలన్న ట్రంప్ విధానాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. అవి భారతదేశంలో గ్యాస్ ధరలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. మీరు నా మాట నమ్మకపోతే (విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్) జైశంకర్‌తో మాట్లాడండి." అని సమ్మిట్‌లో మాట్లాడుతూ అన్నారు.

అదే విధంగా ఇటీవల ట్రంప్‌ చైనా పర్యటనను ప్రస్తావిస్తూ ద్వైపాక్షిక సంబంధాలపై ట్రంప్ విధానాల దీర్ఘకాలిక ప్రభావం గురించి ఒక భారతీయ దౌత్యవేత్త ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. నేను చైనాలో ఉన్నప్పుడు, అధ్యక్షుడు ట్రంప్ వల్ల ఒక తరం నమ్మకం దెబ్బతిందని అక్కడి భారత రాయబారి తనతో చెప్పారన్నారు. 

ట్రంప్ చేసిన నష్టం గురించి నిజం మాట్లాడకపోతే... మనం వాస్తవంలో జీవించనట్లే అని ఖన్నా పేర్కొన్నారు.. అమెరికా తన సాంప్రదాయ ప్రపంచ నాయకత్వాన్ని విడిచిపెట్టి, విలువలకు బదులుగా బలప్రయోగంతో నడిచే విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్నారని ఆయన ట్రంప్‌పై మండిపడ్డారు.

రోఖన్నా నేపథ్యం

రోఖన్నా డెమెక్రాటిక్ పార్టీకి చెందిన ప్రముఖ నేత. 2017 నుండి కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెస్ నియోజకవర్గానికి (సిలికాన్ వ్యాలీ ప్రాంతం) ప్రతినిధుల సభలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈయన తల్లిదండ్రులు 1970లలో భారతదేశం నుండి అమెరికాకు వలస వెళ్లారు. గతంలో ఈయన అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్‌లో డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీగా పనిచేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement