సాక్షి,బెంగళూరు: లైంగిక దాడుల కేసుల్లో అరెస్టై బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జైల్లో ఆయన ఉంటున్న సెల్పై అధికారులు ఆకస్మిక దాడి నిర్వహించి రహస్యంగా వాడుతున్న స్మార్ట్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ను పరిశీలించగా అందులో పదుల సంఖ్యలో అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. నిషేధిత మొబైల్ ఫోన్ వినియోగంపై జైలు అధికారులు ప్రజ్వల్ రేవణ్ణపై తాజాగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పరప్పన అగ్రహార జైల్లో నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారన్న నిఘా సమాచారంతో అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రజ్వల్ రేవణ్ణ బ్యారక్లో దాచి ఉంచిన స్మార్ట్ఫోన్ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లో ఇంటర్నెట్ వినియోగం, కాల్స్ డేటాతో పాటు పెద్ద ఎత్తున అశ్లీల వీడియోలు నిల్వ ఉన్నట్లు తేలింది.
మరో ఎఫ్ఐఆర్.. జైలు సిబ్బంది పాత్రపై విచారణ
హై-ప్రొఫైల్ ఖైదీగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ వద్దకు స్మార్ట్ఫోన్, సిమ్ కార్డు ఎలా చేరాయన్న దానిపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. కర్ణాటక ప్రిజన్స్ యాక్ట్, ఐటీ చట్టం, ఇతర సంబంధిత సెక్షన్ల కింద పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. జైలు భద్రతా సిబ్బంది లేదా బయటి వ్యక్తుల సహకారంతోనే ఈ ఫోన్ లోపలికి వచ్చి ఉంటుందని అనుమానిస్తూ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడి వీడియోలు తీశారు. ఈ ఆరోపణలతో ప్రత్యేక దర్యాప్తు బృందం చేతిలో అరెస్టయి గత కొంతకాలంగా జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా బెంగళూరు సెంట్రల్ జైల్లోనే ఉంటున్నారు. ఇప్పుడు జైలు లోపల కూడా నిబంధనలు ఉల్లంఘించి ఫోన్ వాడుతూ దొరికిపోవడం తీవ్ర సంచలనంగా మారింది.


