ప్రియుడిపై ప్రేమ.. తండ్రి భయం.. చివరకు జైలు గేటు ముందు జరిగిన ఘటన సంచలనంగా మారింది. ఖైదీని కలిసేందుకు వచ్చిన మైనర్ బాలిక దగ్గర 10 బుల్లెట్ తూటాలు దొరకడం ఉత్తరప్రదేశ్లో కలకలం రేపింది. నకిలీ ఆధార్ కార్డు, కొంత నగదును కూడా ఆమె నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గోండా డివిజనల్ జైలులో ఉన్న ఖైదీ హర్షు కశ్యప్ను కలిసేందుకు బాలికతో పాటు మరో వ్యక్తి గురువారం జైలుకు వచ్చినట్లు జైలర్ అఫ్తాబ్ ఆలం అన్సారీ తెలిపారు. జైలు ప్రధాన గేటు దగ్గర తనిఖీల సమయంలో బాలిక తప్పుడు గుర్తింపుతో రావడం భద్రతా సిబ్బందికి అనుమానం కలిగించింది. ఆధార్ కార్డులో ఉన్న పేరుకు భిన్నంగా ఆమె మరో పేరు చెప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆమెను తనిఖీ చేయగా.. జేబులో 10 లైవ్ బుల్లెట్ కార్ట్రిడ్జ్లు బయటపడ్డాయి. వెంటనే జైలు ఔట్ పోస్ట్ ఇన్ఛార్జ్కు సమాచారం అందించి.. బాలికతో పాటు వచ్చిన వ్యక్తితో పాటు వారి దగ్గర ఉన్న వస్తువులను పోలీసులకు అప్పగించారు.
విచారణలో బాలిక తన అసలు వివరాలను బయటపెట్టింది. ఆ బుల్లెట్లు తన తండ్రి లైసెన్స్ గన్లోనివని.. తన తండ్రికి కోపం ఎక్కువని.. తాను జైలులో ఉన్న ప్రియుడిని కలవడానికి వెళ్లిన విషయం తెలిస్తే ఆయన ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భయపడి బుల్లెట్లను వెంట తీసుకువచ్చానంటూ చెప్పింది. దీంతో అధికారులు షాక్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


