ఏసీ గదిలో నిద్ర.. అదే చివరి రాత్రైంది! | UP House Collapse Tragedy: 6 Family Members Killed in Pratapgarh | Sakshi
Sakshi News home page

ఏసీ గదిలో నిద్ర.. అదే చివరి రాత్రైంది!

Aug 7 2026 12:31 PM | Updated on Aug 7 2026 12:43 PM

Slept in an AC Room, Never Woke Up: 6 Family Members Killed in House Collapse

ఎల్‌ నినో ప్రభావంతో వర్షాకాలంలోనూ ఉక్కపోత కొనసాగుతోంది. మండుతున్న వేడి నుంచి ఉపశమనం కోసం ఆ కుటుంబం మొత్తం ఏసీ గదిలో నిద్రకు ఉపక్రమించింది. కానీ అదే వారి చివరి రాత్రిగా మారింది. భారీ వర్షాల ధాటికి దాదాపు 100 ఏళ్ల నాటి ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి ప్రకోపం ఓ కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టింది.

ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మండుతున్న వేడి నుంచి ఉపశమనం కోసం కుటుంబమంతా ఒకే ఏసీ గదిలో నిద్రించగా.. అదే వారికి చివరి రాత్రిగా మారింది. భారీ వర్షాలకు దాదాపు 100 ఏళ్ల నాటి ఇల్లు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ప్రతాప్‌గఢ్‌ జిల్లాలోని మహులి ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి ఈ విషాద ఘటన జరిగింది. నగర్‌ కోత్వాలి పరిధిలోని ఓ పాత ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా పైకప్పు కుప్పకూలింది. ఆ సమయంలో ఇంట్లో ఏడుగురు ఉన్నారు.

క్షణాల్లో శిథిలాల కింద
ఎండ తీవ్రత కారణంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏసీ ఉన్న ఒకే గదిలో నిద్రించాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఇప్పటికే బలహీనంగా మారిన పాత ఇంటి పైకప్పు వర్షం ధాటికి కూలిపోయింది. దీంతో నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు.

ఆరుగురి మృతి.. ఒకరి ప్రాణాలతో పోరాటం
ఈ ఘటనలో ప్రమోద్‌ శ్రీవాస్తవ్‌ (60), ఆయన భార్య రీటా (55), కుమారుడు నితిన్‌ (25), కోడలు మాధురి (24), మరో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కుటుంబ పెద్ద కుమారుడు అమన్‌ (28) మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డాడు. శిథిలాల నుంచి స్వయంగా బయటకు వచ్చి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించాడు. తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పాత భవనం పరిస్థితి, కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

వర్షాలకు వరుస విషాదాలు
ప్రతాప్‌గఢ్‌ ఘటనతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ పాత నిర్మాణాలు కూలి ప్రాణ నష్టం జరిగింది. బారాబంకీ జిల్లాలోని అలియాబాద్‌లో పాత ఇటుక గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలడంతో పిల్లలు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఆస్పత్రికి తరలించినప్పటికీ ఏడేళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయారు. సహరన్‌పూర్‌ జిల్లాలోనూ భారీ వర్షాల కారణంగా మట్టి ఇల్లు కూలి 35 ఏళ్ల మహిళ మృతి చెందింది. గ్రామస్థుల సహాయంతో ఆమెను బయటకు తీసినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

వరుసగా కురుస్తున్న వర్షాలు పాత ఇళ్లకు ప్రమాదంగా మారుతున్నాయి. బలహీనంగా ఉన్న నిర్మాణాలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement