ఇప్పటికే అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాం | Supreme Court Reacts On BJP leaders Criticism | Sakshi
Sakshi News home page

ఇప్పటికే అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాం.. ఇప్పుడు ఆదేశాలు ఇవ్వాలా?

Apr 21 2025 12:58 PM | Updated on Apr 21 2025 1:27 PM

Supreme Court Reacts On BJP leaders Criticism

న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి సహా పలువురు బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ప్రస్తుతం తాము కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామంటూ సోమవారం వ్యాఖ్యానించింది.

ముర్షిదాబాద్‌ అల్లర్ల కేసు నేపథ్యంతో.. పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన(Bengal President Rule) విధించాలని కోరుతూ విష్ణు శంకర్‌ జైన్‌ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో జస్టిస్‌ గవాయ్‌ పిటిషన్‌ను పరిశీలిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘మేం ఇప్పటికే కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి తరుణంలో.. బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని, సైన్యాన్ని మోహరింపజేయాలని మాండమస్‌ రిట్‌ ప్రకారం రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా?’’ అని పిటిషనర్‌ లాయర్‌ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పిటిషనర్‌ కోరిన ఆదేశాలు జారీ చేయడానికి బెంచ్‌ నిరాకరించింది. 

ఇదిలా ఉంటే.. రాష్ట్రాలు రూపొందించే బిల్లుల విషయంలో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును సుప్రీం కోర్టు తప్పుబడుతూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో గవర్నర్‌, రాష్ట్రపతికి సైతం కాలపరిమితి విధించింది. ఈ వ్యవహారంలో రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక అధికారాలు పని చేయబోవని..  ఒకవేళ ఆ కాలపరిమితిని ఉల్లంఘిస్తే కోర్టులను ఆశ్రయించొచ్చని రాష్ట్రాలకు సూచించింది. అదే సమయంలో వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లనూ విచారిస్తూ.. స్టే ఆదేశాలు జారీ చేసింది కూడా. 

అయితే ఈ రెండు పరిణామాలపై బీజేపీ నేతలు కొందరు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే సుప్రీం కోర్టుపై చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే గనుక.. పార్లమెంట్‌ భవనాన్ని మూసివేయాలి’’ అని ఎంపీ వ్యాఖ్యానించారు. మరో బీజేపీ నేత దినేశ్‌ శర్మ సైతం సుప్రీం కోర్టుపై విమర్శలు గుప్పించారు. ఆఖరికి ఉపరాష్ట్రపతి జగదీప్‌ దన్‌ఖడ్‌ కూడా సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టారు. 

‘రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. అది ప్రజాస్వామ్యశక్తులపై అణుక్షిపణిని ప్రయోగించడమే అవుతుంది. ఇప్పుడు.. శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు! కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తించేస్తారు. సూపర్‌ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు’’ అని అన్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి నోట్ల కట్టల వ్యవహారంపై స్పందిస్తూ దన్‌ఖడ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇక బీజేపీ నేతల వ్యాఖ్యలను వ్యతిగతం అని పేర్కొంటూ అధిష్టానం దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.

ప్రస్తుతం సీజేఐగా ఉన్న సంజీవ్‌ ఖన్నా పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఆ స్థానంలో బీఆర్‌ గవాయ్‌(BR Gavai) బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కీలకమైన వక్ఫ్‌ పిటిషన్లపై ఈయనే విచారణ జరపబోతున్నారు. ఈ క్రమంలో.. ఆయన కార్య నిర్వాహక వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

ఇదిలా ఉంటే.. వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్‌ 8-12 తేదీల మధ్య షంషేర్‌గంజ్‌, సూటి, ధులియాన్‌, జంగిపూర్‌ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ముగ్గురు మరణించగా.. వందల మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లనువిచారించే క్రమంలోనూ ఈ అల్లర్లను సీజేఐ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం ప్రస్తావించింది. మే 5వ తేదీన ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement