ఆరెస్సెస్‌ చీఫ్‌పై జ్యోతిర్‌మఠ్ శంకరాచార్య ఆగ్రహం | Shankaracharya Criticised RSS chief Mohan Bhagwat | Sakshi
Sakshi News home page

ఆరెస్సెస్‌ చీఫ్‌పై జ్యోతిర్‌మఠ్ శంకరాచార్య ఆగ్రహం

Dec 26 2024 1:22 PM | Updated on Dec 26 2024 1:37 PM

Shankaracharya Criticised RSS chief Mohan Bhagwat

రాష్ట్రీయ స్వయంసేవక్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ (Mohan Bhagwat) పై జ్యోతిర్‌మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మందిర్‌-మసీద్‌ వివాదాలను ఉద్దేశించి భగవత్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. భగవత్‌కు హిందువుల మనోభావాలపై పట్టింపు లేనట్లు ఉందని అన్నారాయన. ఈ మేరకు ఓ జాతీయ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ..

‘‘అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను రాజేసి తాము కూడా హిందూ నాయకులం కావచ్చని కొందరు వ్యక్తులు భావిస్తున్నారని మోహన్‌ భగవత్‌ అన్నారు. కానీ, సాధారణ హిందువులు అలా ఏనాడూ అనుకోరు. దేశంలో ఎన్నో ఆలయాలను కూల్చేశారు. ఇది జగమెరిగిన సత్యం. ఆయనకు(మోహన్‌ భగవత్‌కు) హిందువుల నొప్పేంటో పట్టన్నట్లు ఉంది. హిందువుల ప్రస్తుత దుస్థితి ఆయనకు అర్థం కావడం లేదు. ఆయన మాటలతో ఆ విషయం స్పష్టమైంది’’ అని అవిముక్తేశ్వరానంద సరస్వతి అన్నారు.

భగవత్‌ ఏమన్నారంటే..

ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ పుణే(Pune)లో జరిగిన ‘ఇండియా ది విశ్వగురు’ అనే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘ఇటీవల కాలంలో మందిర్‌-మసీద్‌ వివాదాలు గణనీయంగా పెరగడం ఆందోళనకరం. అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను రాజేసి తాము కూడా హిందూ నాయకులం కావచ్చని కొందరు వ్యక్తులు భావిస్తున్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రతిరోజూ కొత్త వివాదం తీసుకొస్తున్నారు. వీటిని ఎలా అంగీకరించమంటారు?..  

.. ఇది కొనసాగకూడదు. కలిసిమెలిసి ఎలా ఉంటామో భారత్‌ చూపించాలి. ప్రస్తుతం దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తోంది. దీనిలో ప్రభుత్వాన్ని నడిపే ప్రజాప్రతినిధులను వారే ఎన్నుకొంటారు. ఎవరో ఒకరి ఆధిపత్యం చేసే రోజులు ఎప్పుడో పోయాయి. ప్రతిఒక్కరూ తమను తాము భారతీయులుగా చెప్పుకొంటున్నప్పుడు ఆధిపత్యం భాష ఎందుకు..? ఎవరు మైనార్టీ..? ఎవరు మెజార్టీ..? ప్రతిఒక్కరూ సమానమే. 

ఎవరి ఇష్టమైన భగవంతుడి ఆరాధనను వారు పాటించడమే ఈ దేశ ఆచారం. కాకపోతే నిబంధనలు, చట్టాలకు లోబడి సామరస్యంగా జీవించడం అవసరం. అలాగే.. కలుపుగోలు సమాజాన్ని మనకు మంచింది. మన దేశం సామరస్యంగా ఉంటుందని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉంది. మేం హిందువులం కాబట్టే రామకృష్ణ మిషన్‌(Rama Krishna Mission) లో కూడా క్రిస్మస్‌ వేడుకలు చేసుకొంటాం. మనం చాలాకాలంగా సామరస్యంగా ఉంటున్నాం. దీనిని మనం ప్రపంచానికి అందించాలనుకొంటే.. ఓ ఉదాహరణగా నిలవాలి’’ అని అన్నారు.

👉ఇదిలా ఉంటే.. భగవత్‌ వ్యాఖ్యలపై జగద్గురు స్వామి రామభద్రచార్య సహా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. భగవత్‌ తమ అనుచరుడి కాదని మండిపడ్డారు. ఆయన ఎంతోమంది భస్వాసురులను సృష్టించారని.. వాళ్లే ఆరెస్సెస్‌ నెత్తిన చెయ్యి పెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. 

👉మరోవైపు.. రాజకీయంగానూ ఈ వ్యాఖ్యలపై చర్చ నడిచింది. సామరస్యం పాటించాలని భగవత్‌ బీజేపీనే కోరుతున్నారని ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. యోగి ఆదిత్యానాథ్‌కు ఆయన(మోహన్‌ భగవత్‌) గనుక సూచిస్తే.. ఏ సర్వేలు. వివాదాలు ఉండవని అఖిలేష్‌ అన్నారు. మరోవైపు.. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ స్పందిస్తూ.. మోహన్‌ భగవత్‌ది ద్వంద్వ ధోరణి అని మండిపడ్డారు.

ఇదీ చదవండి: ఈ పుణ్య క్షేత్రాల నగరం గురించి తెలుసా?

Advertisement
 
Advertisement
Advertisement