వక్ఫ్‌ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు | Waqf Amendment Act Hearing Live Updates April 17th Updates | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Apr 17 2025 11:08 AM | Updated on Apr 17 2025 6:04 PM

Waqf Amendment Act Hearing Live Updates April 17th Updates

న్యూఢిల్లీ, సాక్షి: వక్ఫ్‌ సవరణ చట్టం 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. 

వక్ఫ్‌ (సవరణ) చట్టం 2025ను సవాల్‌ చేస్తూ 73 పిటిషన్లు నమోదు కాగా.. గురువారం వరుసగా రెండో రోజూ సుప్రీం కోర్టు వాదనలు వింది.  కొన్ని అంశాలతో ప్రాథమిక సమాధానం ఇవ్వడానికి కేంద్రం తరఫున  సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరారు. తదుపరి విచారణ వరకు వక్ఫ్‌ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపారు. 

ఈ క్రమంలో.. వక్ఫ్‌ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దని సీజేఐ నేతృత్వంలోని బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. ‘‘వక్ఫ్‌ బోర్డులో నూతన నియామకాలు చేయొద్దు. వక్ఫ్‌ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించొద్దు. వక్ఫ్, వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీ నోటిఫై చేయొద్దు వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై స్టేటస్ కో విధిస్తున్నాం. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు వారం రోజుల్లో సవివర రిప్లై దాఖలు చేయాలి. మరో ఐదు రోజుల్లో రిజైన్డర్ దాఖలు చేయాలి’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. 

గత విచారణలో(బుధవారం).. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు  

  • వక్ఫ్  సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తుంది
  • ఇది రాజ్యాంగ విరుద్ధమైన  చట్టం
  • వక్ఫ్ అంటే ఇస్లాం కు అంకితమైంది


కేంద్రప్రభుత్వం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు

  • జేపిసీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపాము
  • వక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించినది మాత్రమే
  • హిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి
  • హిందూయేతర అధికారులు హిందూ ధార్మిక సంస్థలను నిర్వహిస్తున్నారు
  • వక్ఫ్ భై యూజర్ ద్వారానే అనేక మసీదులను ఏర్పాటు చేశారు
  • రిజిస్టర్ చేసుకోవడంలో మసీదులకున్న అభ్యంతరం ఏమిటి  


సుప్రీంకోర్టు సీజేఐ వ్యాఖ్యలు

  • సుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి
  • వక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం..అయితే ఇది దుర్వినియోగమైంది
  • అయితే నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయి
  • హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా
  • పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా ?
  • హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా
  • ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమి లోనే ఉందని అంటున్నారు  
  • చారిత్రక , పురావస్తు ఆస్తులను వక్ఫ్ గా ప్రకటించడానికి వీలు లేదు
కాసేపట్లో వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ

వక్ఫ్‌ పిటిషన్లపై విచారణ వేళ.. హైలైట్స్‌

అంతకు ముందు.. వక్ఫ్ పిటిషన్ల విచారణను లైవ్ టెలికాస్ట్ కోరుతూ సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ లేఖ రాసింది. బుధవారం విచారణ టైంలో కిక్కిరిసిపోయిన కోర్టు హాల్‌లో కనీసం నిలబడటానికి కూడా స్థలం సరిపోలేదని, ఊపిరి ఆడక ఇద్దరు లాయర్లు స్పృహ కోల్పోయారని లేఖలో ప్రస్తావించింది.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ హర్షం
హైదరాబాద్‌: వక్ఫ్ (సవరణ) బిల్లుపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు వైఖరి దేశవ్యాప్తంగా ముస్లింలకు ఊరట కలిగించిందన్నారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం మరింత బలోపేతం చేసిందన్నారు. వక్ఫ్‌ సవరణ చట్టంపై సుప్రీంలో జరిగిన పరిణామాలను స్వాగతిస్తున్నామన్నారు.

 

 

👉అధికారంలోకి రాగానే వక్ఫ్‌ చట్టాన్ని అడ్డుకుంటాం. బీహార్‌ను వక్ఫ్‌ అల్లర్లతో మరో బెంగాల్‌(ముర్షిదాబాద్‌)గా మార్చాలని వాళ్లు(కేంద్రంలోని బీజేపీ) అనుకుంటున్నారు. ఆర్జేడీ నాయకత్వంలో అది అయ్యే పని కాదు అని తేజస్వి యాదవ్‌ అన్నారు. 

👉వక్ఫ్‌ చట్టం దేశ ప్రజల మధ్య ఐక్యతను క్రమంగా తుడిచిపెట్టేందుకేనని కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వక్ఫ్‌ సవరణ చట్టం తెచ్చిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆరోపించారు. ఇది ఫెడరలిజాన్ని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 26ను ఉల్లంఘించడమేనని అన్నారాయన. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్య ద్వారా.. ఆరెస్సెస్‌, బీజేపీలు వక్ఫ్‌ చట్టం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. 

ఇండియా కూటమి.. కలిసి పోరాడుదాం
రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్‌ సవరణ చట్టం అడ్డుకునేందుకు ప్రతిపక్ష కూటమి ఇండియా కలిసి రావాలని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పిలుపు ఇచ్చారు. సొంత దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం.. సౌదీ అరేబియా, దుబాయ్‌ లాంటి పశ్చిమ ఆసియా దేశాల నుంచి ఆతిథ్యం మాత్రం స్వీకరిస్తున్నారని మండిపడ్డారు. ఏకతాటిపైకి వచ్చి వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలు పోరాడాలని ఆమె అంటున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement