సాక్షి,బళ్లారి: కుటుంబ కలహాలు, భార్యపై అనుమానం పెంచుకున్న కిరాతక భర్త ఏడు నెలల పసికందును, భార్యను దారుణంగా హత్య చేశాడు. నగర శివార్లలో 8వ వార్డు పరిధిలోని ఆంధ్రాళ్ ప్రాంతంలో జరిగిన ఈ జంట హత్యలు కలకలం రేపాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. ఆంధ్రాళ్లో నివాసం ఉంటున్న హొన్నూరప్ప(28), తన భార్య రాజేశ్వరి(24)ని, కుమార్తె అశ్వని(1)ని దారుణంగా హత్య చేశాడు.
స్థానికులు సమాచారం అందించిన వెంటనే జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్, డీఎస్పీ, సీఐలు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆరేళ్ల క్రితం కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన రాజేశ్వరికి హొన్నూరప్పతో పెళ్లయింది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. అయితే చివరి సంతానం అశ్విని తనకు పుట్టలేదంటూ భార్య శీలంపై అనుమానం పెంచుకుని తరచు గొడవ పడేవాడు. చివరకు పసికందును, భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పథకం ప్రకారం భార్యను, పసికందును సుత్తితో కొట్టి దారుణంగా హతమార్చాడు. అనంతరం తానే హత్య చేసినట్లు చెప్పి పోలీసులకు లొంగిపోయాడు.
ఆంధ్రాళ్లో విషాద ఛాయలు
చిన్నారిని, భార్యను దారుణంగా హత్య చేయడంతో ఆంధ్రాళ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఘటనా స్థలం వద్ద కన్నీరుమున్నీరయ్యారు. అభం, శుభం తెలియని చిన్నారిని, తమ కుమార్తెను దారుణంగా హత్య చేశాడని హొన్నూరప్పపై శాపనార్థాలు పెట్టారు.
నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన సుత్తి తదితరాలను స్వా«దీనం చేసుకుని తదుపరి చర్యలు చేపడుతున్నారు. ఈ విషయంపై శుక్రవారం జిల్లా ఎస్పీ సమన్ పన్నేకర్ విలేకరులతో మాట్లాడారు. కుటుంబ కలహాలు, భార్యపై అనుమానంతో భార్యను, చిన్నారిని దారుణంగా భర్తే హత్య చేశాడని, నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.


