సుప్రీం కోర్టు తీర్పు.. ఉపరాష్ట్రపతి హాట్‌ కామెంట్స్‌ | Vice President Dhankhar Reacts On SC Deadline for President Governor | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టు ‘గడువు’పై ఉపరాష్ట్రపతి హాట్‌ కామెంట్స్‌

Apr 17 2025 4:03 PM | Updated on Apr 17 2025 4:19 PM

Vice President Dhankhar Reacts On SC Deadline for President Governor

న్యూఢిల్లీ: శాసనసభలు ఆమోదించిన బిల్లులను ఆమోదించడం లేదంటే తిప్పి పంపే విషయంలో గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ ఇటీవల సుప్రీం కోర్టు గడువు విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ హాట్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. న్యాయస్థానాలు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి ఉండకూడదంటూ వ్యాఖ్యలు చేశారాయన. 

రాజ్యసభ ఇంటర్న్స్‌ 6వ బ్యాచ్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. న్యాయస్థానాలు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి ఉండకూడదన్నారు. అదే జరిగితే రాజ్యాంగంలోకి ఆర్టికల్‌ 142 కింద సుప్రీం కోర్టు తనకున్న ప్రత్యేక అధికారాలను.. ప్రజాస్వామ్య శక్తులపై ఒక అణ్వాయుధాన్నే ప్రయోగించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు.  సుప్రీం కోర్టు నిర్దిష్ట సందర్భాల్లో ఈ అధికారాన్ని విస్తృతంగా ఉపయోగించడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన.

తమిళనాడు పెండింగ్‌ బిల్లుల వ్యవహారంపై ​జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ ఎన్‌ రవికుమార్‌ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్న సర్వోన్నత న్యాయస్థానం.. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్‌ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత తమిళనాడు ప్రభుత్వం 10 పెండింగ్‌ బిల్లుల్ని చట్టాలుగా ప్రకటించింది.

అయితే అటుపై రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలే చేసింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గవర్నర్‌ పంపిన బిల్లులను రాష్ట్రపతి ఎటూ తేల్చకపోతే అప్పుడు రాష్ట్రాలు నేరుగా తమను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ తీర్పుపై కేంద్రం ప్రభుత్వం సమీక్షకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇక ఇదే వేదిక నుంచి.. ఢిల్లీ హైకోర్టు జడ్జి బంగ్లాలో నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారంపైనా ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ స్పందించారు. ఘటన జరిగి నెలరోజులు గడుస్తున్నా.. ఎఫ్‌ఐఆర్‌ లేకపోవడం, దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం, జడ్జిలకు కలిగే ఉపశమనం గురించీ ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement