బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ‘బిగ్బాస్ 20’(హిందీ)లోకి అడుగుపెట్టారు. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో కొత్త సీజన్లో ఆమె పాల్గొనడం అత్యంత ఆసక్తికరంగా మారింది. మేరీ కోమ్ బిగ్బాస్ ప్రయాణం ప్రారంభించిన అనంతరం నటి ప్రియాంక చోప్రా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. షోలో మేరీ కోమ్ తన ఆటను ఎలా కొనసాగిస్తారో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు.
మేరీ కోమ్, ప్రియాంక చోప్రాల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. 2014లో తెరకెక్కిన చిత్రం ‘మేరీ కోమ్’లో ప్రియాంక చోప్రా.. మేరీ కోమ్ పాత్రను పోషించారు. ఆమె క్రీడా ప్రయాణంలోని కీలక ఘట్టాలను ఈ చిత్రం అందరికీ తెలియజెప్పింది. మేరీ కోమ్ కథను వెండితెరపై ఆవిష్కరించిన కొన్నేళ్ల తర్వాత.. ఇప్పుడు ఆమె బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెడుతున్నారు. దీనిలో ఆమె విభిన్న టాస్క్లను ఎదుర్కొనబోతున్నారు.
బాక్సింగ్ రింగ్లో ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు అలవాటుపడిన మేరీకి బిగ్బాస్ హౌస్ పూర్తిగా భిన్నమైన పరీక్షలను పెట్టనుంది. కెమెరాల నిరంతర నిఘాలో ఇతర కంటెస్టెంట్లతో కలిసి జీవిస్తూ, టాస్కులు, నామినేషన్లు, స్నేహాలు, విభేదాలు మొదలైనవాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒత్తిడిని ఎదుర్కొంటూ క్రమశిక్షణతో పోటీపడిన మేరీ కోమ్ క్రీడా నేపథ్యం ఆమె బిగ్బాస్ ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా మార్చనుంది. బిగ్బాస్ 20 ప్రారంభానికి ముందు నుంచే మేరీ కోమ్ పాల్గొంటారనే ఊహాగానాలు సాగాయి. పలువురు కంటెస్టెంట్ల పేర్లతో పాటు ఆమె పేరు కూడా వినిపించింది.
పలుమార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచి, ఒలింపిక్ పతక విజేత అయిన మేరీ కోమ్.. బిగ్బాస్ కంటెస్టెంట్ల జాబితాలో భిన్నమైన నేపథ్యంతో నిలిచారు. రింగ్లో సాధించిన విజయాలకు అతీతంగా ఆమె వ్యక్తిగత కోణాన్ని తెలుసుకునే అవకాశం ఇప్పుడు ప్రేక్షకులకు లభించనుంది. మేరీ ఆటను చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రియాంక వెల్లడించడంతో.. బిగ్బాస్ ఇంట్లో ఆమె ఎలా కలిసిపోతారన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.
ఇది కూడా చదవండి: చెరకు తోటల్లోనే పుట్టి, చెరుకు తోటల్లోనే పెరిగి..


