బాగ్పత్: ఉత్తర్ప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తీర్థయాత్రికులతో వెళ్తున్న బస్సు డివైడర్ను ఢీకొని బోల్తాపడటంతో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదం ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వేపై బడాగావ్ కట్ సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 32 మంది యాత్రికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని బంగార్ నుంచి బదాయూన్ వైపు బస్సు వెళ్తుండగా రాత్రి సుమారు 12.30 గంటలకు ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొన్న అనంతరం బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. 112 అత్యవసర సేవకు సమాచారం అందడంతో నాలుగు పోలీస్ రెస్పాన్స్ వెహికల్స్ (పీఆర్వీలు), అంబులెన్స్లు, స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు.
బస్సులో ఉన్నవారిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్పీ కుమార్ రాయ్ తెలిపారు. బోల్తాపడిన బస్సు నుంచి క్షతగాత్రులను బయటకు తీసి సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ), జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కొందరిని మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్య కేంద్రాలకు పంపినట్లు చెప్పారు. బాగ్పత్ జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్ కూడా నలుగురు మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని, బాధితులందరినీ సమీపంలోని వైద్య కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: డ్రోన్ల కలకలం.. హైఅలర్ట్లో అమృత్సర్ ఎయిర్పోర్ట్!


