ఇండోర్లోని నెహ్రూ నగర్లో వివాహమైన 25 రోజులకే నవవధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఇంటి బయట ఉన్న నీటి ట్యాంక్లో ఆమె శవమై తేలింది. పొరుగు వారి సమాచారంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మృతురాలు వందనా కుష్వాహా ఈ ఏడాది ఆగస్టు 11న ఉపేంద్ర పటేల్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏమైందో తెలియదు గానీ వివాహం జరిగి నెల కూడా తిరగ్గకుండానే ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించింది.
అయితే గురువారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి వందన గట్టిగా అరిచిన శబ్దం విన్నారు పొరుగువారు. ఆ తర్వాత కొద్దిసేపటికే భర్త ఉపేంద్ర పటేల్ షర్టుపై రక్తం మరకలతో బయటకు రావడం, ఇంట్లో ఏ చప్పుడు లేకపోవడంతో అనుమానం వచ్చిన పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు.
నీటి ట్యాంక్లో మృతదేహం
పొరుగువారి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శోధించగా, ఇంటి బయట ఉన్న వాటర్ ట్యాంక్లో వందన మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై గాయాల గుర్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భర్త ఉపేంద్ర పటేల్కు తీవ్రమైన వ్యసనాలున్నాయని, ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. గతంలో వందన కుటుంబ సభ్యులు చందన్ నగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసినప్పటికీ, వందన మేజర్ కావడంతో ఉపేంద్రతోనే ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చింది.
ఇదీ చదవండి: లోయలోకి దూకేసిన మహిళా రెజ్లర్ : తీవ్ర దిగ్భ్రాంతిలో క్రీడాలోకం
ప్రాథమికంగా ఇది హత్యగా అనుమానిస్తున్నామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) నిధి సక్సేనా తెలిపారు. భర్త ఉపేంద్ర పటేల్, అతని సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి పూర్తి కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి : వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియో


