‘డాక్టర్లు నన్ను చంపేస్తారు’ అని చెప్పిన కొద్దిసేపటికే మహిళ మృతి | Woman her newborn die after delivery, In video she had pled | Sakshi
Sakshi News home page

‘డాక్టర్లు నన్ను చంపేస్తారు’ అని చెప్పిన కొద్దిసేపటికే మహిళ మృతి

Aug 28 2026 6:32 PM | Updated on Aug 28 2026 6:42 PM

Woman her newborn die after delivery, In video she had pled

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని రేవాలో ప్రభుత్వ ఆసుపత్రిలో 25 ఏళ్ల మహిళ, ఆమె నవజాత శిశువు మృతి చెందారు. ప్రసవానికి కొన్ని గంటల ముందు ఆమె చేసిన విజ్ఞప్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కల్పనా మిశ్రా అనే ఆ మహిళ తనను ఆసుపత్రి నుంచి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులను వేడుకున్నారు ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తే తనకు ప్రాణహాని జరుగుతుందనే భయాన్ని వ్యక్తం చేశారు.

“నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లండి. నేను బతకను.. వాళ్లు నన్ను చంపేస్తారు” అని కల్పనా మిశ్రా అన్నారు. కల్పనను మంగళవారం సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రిలో చేర్పించారు. దీనిని గాంధీ మెమోరియల్ ఆసుపత్రి అని కూడా పిలుస్తారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మరుసటి రోజు ఆమెకు సిజేరియన్‌ శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ ఆమెతో పాటు ఆమె నవజాత శిశువు మృతి చెందారు.

కల్పన తన ఆరోగ్య పరిస్థితి గురించి పదేపదే ఫిర్యాదు చేసినా, ఆమెకు సకాలంలో చికిత్స అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తించారని కూడా వారు ఆరోపించారు. ఈ వీడియోలో కల్పనా తీవ్ర ఆందోళనలో కనిపిస్తూ, తనను ఆసుపత్రి నుంచి తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నిస్తూ, వైద్యులు చికిత్స చేస్తున్నారని, ఆమెకు ఏమీ కాదని చెప్పడం కనిపించింది.

ఈ మరణాలపై ఆసుపత్రిలో నిరసనలు మొదలయ్యాయి. మృతురాలి కుటుంబ సభ్యులు ప్రధాన ద్వారం బయట బైఠాయించి, బాధ్యులుగా భావించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం ఆరోపణలను ఆసుపత్రి అధికారులు ఖండించారు. ఆందోళన తీవ్రం కావడంతో డీన్ సునీల్ అగర్వాల్, సూపరింటెండెంట్ రాహుల్ మిశ్రా అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిష్పక్షపాత విచారణ జరుపుతామని వారికి హామీ ఇచ్చారు.

ప్రాథమిక చర్యగా విధుల్లో ఉన్న ఇద్దరు నర్సింగ్ అధికారులను సస్పెండ్ చేశారు. మరణాలకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనుంది. పోస్టుమార్టం, విచారణ నివేదికలు వచ్చిన తర్వాతే తల్లి, నవజాత శిశువు మృతికి కచ్చితమైన కారణం నిర్ధారణ అవుతుందని అధికారులు తెలిపారు.

పరిస్థితిని తెలుసుకునేందుకు మంగావన్‌ బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర ప్రజాపతి కూడా ఆసుపత్రికి వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను కలిశారు. ఆయన ఆసుపత్రి అధికారులతో మాట్లాడి, ఎవరైనా బాధ్యులుగా తేలితే చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement