కృష్ణా జిల్లా: రోడ్డు ప్రమాదానికి గురైన తండ్రిని చూసేందుకు హైదరాబాద్కు వెళ్లి తిరిగి వస్తున్న ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన యాసారపు చిన్ని(32) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. తేలప్రోలు గ్రామంలోని సుందరయ్యనగర్లో కుటుంబంతోపాటు చిన్ని నివసిస్తుంది. ఆమె భర్త సుధాకర్ తేలప్రోలు సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్. వీరికి ఇద్దరు కుమారులు. పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. భర్త, పిల్లలతో ఆనందంగా జీవిస్తున్న ఆమె తండ్రి హైదరాబాద్లో ఉంటున్నారు.
ఆయన ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డాడు. తండ్రిని చూసేందుకు పదిహేను రోజుల క్రితం చిన్ని హైదరాబాద్ వెళ్లారు. ఆమెను తీసుకువచ్చేందుకు భర్త సుధాకర్ సోమవారం వెళ్లారు. ఇద్దరూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో గ్రామానికి బయలుదేరారు. కోదాడ సమీపంలో జరిగిన ప్రమాదంలో చిన్ని అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త సుధాకర్ గాయాలతో బయటపడ్డాడు. చిన్ని మృతితో సుందరయ్యకాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నతల్లి మృతి చెందిన విషయం తెలుసుకుని ఇద్దరు చిన్నారులు బోరున విలపించారు. వారిని ఆపడం ఎవరి తరమూ కాలేదు.


