ఘోర రోడ్డు ప్రమాదం | A serious road accident occurred near Kodad in Suryapet district of Telangana | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం

Aug 27 2026 4:31 AM | Updated on Aug 27 2026 4:31 AM

A serious road accident occurred near Kodad in Suryapet district of Telangana

ఆరుగురు దుర్మరణం 

15 మందికి తీవ్ర గాయాలు 

ప్రమాదానికి గురైన ట్రాలీ లారీని ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు  

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో దుర్ఘటన 

మృతులందరిదీ ఉమ్మడి కృష్ణా జిల్లా 

మృతులలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు 

వారిలో ముగ్గురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు  

కోదాడ, కోదాడ రూరల్‌/సాక్షిప్రతినిధి, విజయవాడ: హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి మరో­సారి రక్తసిక్తమైంది. బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమా­దం జరిగింది. ప్రమాదానికి గురై సగం రోడ్డుమీద, సగం డివైడర్‌పై ఆగి­పోయిన ట్రాలీ లారీని గమనించని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్‌డ్రైవర్‌  వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణి­స్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడిక­క్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విష­మంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు (టీఎస్‌ 08­యుఎల్‌ 5112) 42 మంది ప్రయా­ణికులతో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్‌ నుంచి ఏలూ­రుకు బయలుదేరింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సూర్యాపేట సమీపంలోని చార్జింగ్‌ స్టేషన్‌ వద్ద ఆపి బస్సు చార్జింగ్‌ పెట్టుకు­న్నారు. ఈ సమయంలో మొదటి డ్రైవర్‌ డ్యూటీ దిగి రెండో డ్రైవర్‌కు బస్సు అప్పగించాడు. హైద­రాబాద్‌ నుంచి విజయ­వాడవైపు ఐరన్‌ పిల్లర్లలోడ్‌తో వెళ్తున్న ట్రాలీ లారీ బుధ­వారం తెల్లవారు­జామున 4 గంటలకు కోదాడ శివా­రులో అదుపుతప్పి డివైడర్‌పైకి సగం వెళ్లి ఆగింది. ఆ తర్వాత 48 నిమిషాలకు కోదాడ శివారుకు చేరుకున్న బస్సు డ్రైవర్‌ ట్రాలీ లారీని గమనించకుండా వెనుక­వైపు నుంచి వేగంగా ఢీ కొట్టాడు. 

ఈ ప్రమాదంలో ట్రాలీ లారీ­లో ఉన్న ఐరన్‌ పిల్లర్లు బస్సులోకి చొచ్చు­కురావడంతో బస్సు కుడివైపు భాగం పూర్తిగా దెబ్బతిని డ్రైవర్‌ సీటు వెనుక సీట్ల­లో ఉన్న యాసారపు చిన్ని(32), బొల్లిపోగు మేరీ జ్యోత్స్న (29), సూరవరపు షకీనా­(24), చెన్నకేశ­వుల నాగేంద్రబాబు(31), పడికిటి లక్ష్మీతేజ (30), కొండూరు భావన వర్ష(23) అక్కడిక్కడే మృతిచెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, కోదాడ రూరల్‌ ఇన్‌చార్జ్‌ సీఐ రామకృష్ణారెడ్డి, పలువురు ఎస్సైలు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌ ఘటనాస్ధలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. కోదాడ రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు మీద నిలిచిపోయిన ట్రాలీ లారీతోనే..
కోదాడ దాటిన తరువాత కిలోమీటరు దూరంలో ఇనుప పిల్లర్ల లోడ్‌తో వెళుతున్న ట్రాలీ లారీ బుధవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో ప్రమాదానికి గురై డివైడర్‌మీదకు దూసుకెళ్లింది. సగం టైర్లు రోడ్డుమీద, సగంటైర్లు డివైడర్‌పై ఉన్నాయి. లారీ డ్రైవర్‌ ఎలాంటి హెచ్చరిక బోర్డులూ పెట్టకపోవడంతో ఈ ఘోరం జరిగింది.  ఈ ప్రమాదం జరగడానికి అరగంట ముందే మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్‌ కూడా ట్రాలీ లారీని ఢీకొట్టబోయి తృటిలో తప్పించుకుంది. ఆ బస్సుకు స్వల్పంగా గీతలు పడ్డాయి.

ఆ బస్సు డ్రైవర్‌ తన బస్సును పక్కకు ఆపి ట్రాలీ లారీ వద్దకు వచ్చి డ్రైవర్‌ను తీవ్రంగా హెచ్చరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే హెచ్చరిక బోర్డులు పెట్టాలని గట్టిగా చెప్పి వెళ్లిపోయినట్టు సమాచారం. ఆ బస్సు వెళ్లిన 15 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు అతికష్టంమీద వెలికితీశారు. కోదాడ వైద్యశాలకు తరలించారు. పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

మృతుల్లో ముగ్గురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే..
మృతి చెందిన ఆరుగురిది ఉమ్మడి కృష్ణా జిల్లా. వీరిలో యాసరపు చిన్ని, భావనవర్ష, షకీనా మినహా మిగిలిన ముగ్గురూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే. షకీనా కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇంట­ర్వ్యూకు వెళ్లి తిరిగి వస్తూ మృత్యుఒడికి చేరారు.

క్షతగాత్రుల వివరాలు
» విజయవాడకు చెందిన యాసరపు సుధాకర్, కేతు రమణమ్మ, ఆదిలాబాద్‌కు చెందిన రాథోడ్‌ విశాల్‌లకు గాయాలు కావడంతో వారు కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు, ఉన్నం యశ్వంత్‌ సూర్యాపేట ఏరియా వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు.

» తాడేపల్లిగూడెంకు చెందిన పెద్దోజు భవానీకి  తీవ్రగాయాలు కావడంతో ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. 

» విజయవాడకు చెందిన గరికపాటి మనోహర్, ఏలూరుకు చెందిన బండి చందన, సాయిల అనిల్‌కుమార్, సుంకర విజయలక్ష్మి, కరిషపోగు వంశీ,  ఆకుల నవీన్‌కుమార్, జి.వి. ధృవకుమార్, ఎం.జేసన్‌కుమార్‌ విజయవాడలోని పలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. రేపల్లి వేదవ్యాస్‌ ఏలూరు ఆంధ్ర వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు. గాయపడిన వారిలో వరంగల్‌కు చెందిన జి.అవినాష్‌ ఉండగా.. ఆయన ఎక్కడ చికిత్సపొందుతున్నాడన్న వివరాలు తెలియరాలేదు.

అన్నయ్యకు రాఖీకట్టాలని...  
మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రమాదంలో మరణించిన కొండూరు భావన వర్ష(23)ది విజయవాడ. హైదరాబాద్‌లో హెచ్‌ఆర్‌ ఉద్యోగం చేస్తు­న్న ఆమెకు తండ్రి కృష్ణారావు, తల్లి సుభాíÙణి ఉన్నారు. వీరు అజిత్‌సింగ్‌ నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో జ్యూయలరీ వర్క్‌షాపు ఉంది. దీంతో మంగళవారం మకాం అడవినెక్కలంకు మార్చారు. భావన వర్ష సోదరుడు రెశ్వంత్‌ సౌదీలో పనిచేస్తున్నారు. ఆయన రాఖీ పండగ కోసం వస్తుండడంతోపాటు తనకు బెంగళూరులో ఉద్యోగం రావడంతో కొన్ని రోజులు తల్లిదండ్రులతో ఉండాలని భావించిన భావన వర్ష చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి విజయవాడకు బయలుదేరారు. 

ముందు వేరే బస్సుకు టికెట్‌ బుక్‌ చేసుకున్న ఆమె ఆ బస్సు వెళ్లిపోవడంతో ప్రమాదానికి గురైన బస్సు ఎక్కారు. రూమ్‌మేట్స్‌ బుధవారం వెళ్లొచ్చుకదా అన్నా.. సోదరుడికి రాఖీ కట్టాలని, అన్నయ్య వచ్చేటప్పటికే తాను అక్కడ ఉండాలని ఉత్సాహంగా బయలుదేరారు. మార్గమధ్యంలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారారు. ఆమె మృతదేహాన్ని అంబులెన్సులో విజయవాడ మధురానగర్‌లోని తాతయ్య బ్రహ్మయ్య ఇంటి వద్దకు తీసుకురావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అమ్ములూ ఒక్కసారి కళ్లుతెరువమ్మా అంటూ ఆమె తల్లి, పెద్దమ్మలు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. సోదరుడు రెశ్వంత్‌ సౌదీ నుంచి వచ్చిన తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

చేతికందివచ్చిన కొడుకు అనంతలోకాలకు...
పమిడిముక్కల: చెన్నకేశవుల నాగేంద్రబాబు(31)ది కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం లంకపల్లి. హైదరాబాద్‌లో ఆరేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఈయన తండ్రి నరసింహారావు, తల్లి విజయలక్ష్మి. నాగేంద్రబాబుకు ఓ సోదరి ఉంది. ఆమెకు ఇటీవలే వివాహం చేశారు. ప్రస్తుతం బాబాయి కొడుకు(తమ్ముడు) పెళ్లికని హైదరాబాద్‌ నుంచి ప్రైవేటు బస్సులో ఉత్సాహంగా బయలుదేరిన నాగేంద్రబాబు మార్గమ­ధ్యంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అసువులుబాశాడు. 

లంకపల్లికి తీసుకొచ్చిన నాగేంద్రబాబు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.  చేతికందివ­చ్చిన కొడుకు అండగా ఉన్నాడను­కుంటున్న సమయంలో తిరిగిరాని లోకాల­కు వెళ్లిపోయాడని, ఇక తమ­ను ఎవరు పట్టించుకుంటారంటూ  కన్నీరు­మున్నీ­ర­య్యారు. చిన్న రైతు కుటుంబమైనా బాగా చదివించుకున్నామని, రోజూ ఫోన్‌ చేసి తమ ఆరోగ్య వివరాలు అడిగేవాడని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని రోదించారు.

ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి... 
పటమట(విజయవా­డతూర్పు): బీటెక్‌ చదివిన సూరవరపు షకీనా­(24)  ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం సోమ­వారం హైదరాబాదు వెళ్లారు. ఇంటర్వ్యూ బాగా చేశానని, తనకు ఉద్యోగం తప్పకుండా వస్తుందని మంగళవారం రాత్రి తన భర్తకు ఫోన్‌ చేసి సంతోషంగా చెప్పింది. ఉద్యోగం సాధిస్తే తను జీవిత లక్ష్యాన్ని చేరుకున్నట్లేనని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఆ ఆనందం అంతలోనే ఆవిరైందని ఆమె కుటుంబ సభ్యులు గుండలవిసేలా విలపిస్తున్నారు. 

భీమవరానికి చెందిన షకీనాకు  రాజమండ్రికి చెందిన సాయికృష్ణతో గత ఏడాది వివాహం జరిగింది. సాయి కృష్ణ విజయవాడ గురునానక్‌ కాలనీలోని ఓ ప్రైవేటు కన్సల్టెన్సీలో ఆర్కిటెక్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వీరు పెళ్లయిన రెండునెలల తర్వాత విజయవాడ పటమట ఆర్‌ఆర్‌ గార్డెన్స్‌లోని కనకదుర్గ కాలనీకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. రోజూ తమతో కలుపుగోలుగా ఉండే షకీనా మరణించడంతో స్థానికులూ కంటతడి పెట్టారు.

రోడ్డు ప్రమాదానికి గురైన తండ్రిని చూసి వస్తూ...
గన్నవరం: రోడ్డు ప్రమాదానికి గురైన తండ్రిని చూసేందుకు హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి వస్తున్న ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన యాసారపు చిన్ని(32) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. తేలప్రోలు గ్రామంలోని సుందరయ్యనగర్‌లో కుటుంబంతోపాటు చిన్ని నివసిస్తుంది. ఆమె భర్త సుధాకర్‌ తేలప్రోలు సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్‌ ఆపరేటర్‌. వీరికి ఇద్దరు కుమారులు. పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. భర్త, పిల్లలతో ఆనందంగా జీవిస్తున్న ఆమె తండ్రి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డాడు. 

తండ్రిని చూసేందుకు పదిహేను రోజుల క్రితం చిన్ని హైదరాబాద్‌ వెళ్లారు. ఆమెను తీసుకువచ్చేందుకు భర్త సుధాకర్‌ సోమవారం వెళ్లారు. ఇద్దరూ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో గ్రామానికి బయలుదేరారు. కోదాడ సమీపంలో జరిగిన ప్రమాదంలో చిన్ని అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త సుధాకర్‌ గాయాలతో బయటపడ్డాడు. చిన్ని మృతితో సుందరయ్యకాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నతల్లి మృతి చెందిన విషయం తెలుసుకుని ఇద్దరు చిన్నారులు బోరున విలపించారు. వారిని ఆపడం ఎవరి తరమూ కాలేదు.

తేజ.. లేమ్మా.. నా పట్టీలు ఇస్తాను.. తమ్ముడికి రాఖీ కడుదువు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ జయ­ప్రకాష్‌ నగర్‌కు చెందిన పడికిటి లక్ష్మీతేజ(30) హైదరాబాద్‌లో అమెజాన్‌ కంపెనీలో ఐదేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు తండ్రి రామ్‌ప్రసాద్, తల్లి కవిత, తమ్ముడు దేవివరప్రసాద్‌ ఉన్నారు. మిలాద్‌ ఉన్‌నబీ, రాఖీ, వీకెండ్‌ వరుస సెలవులు కావడంతో ఆమె తమ్ముడికి రాఖీ కట్టేందుకు విజయవాడకు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ఆనందంగా బయలుదేరారు. మంగళవారం రాత్రి తండ్రికి ఫోన్‌ చేసి బుధవారం ఉదయం ఆరు గంటలకల్లా విజయవాడలో ఉంటానని సంతోషంగా చెప్పింది. కూతురి కోసం ఏడు గంటల వరకు వేచి చూసిన తల్లిదండ్రులు కూతురుకు ఫోన్‌ చేశారు. ఫోన్‌ కలవకపోవడంతో ఏం జరిగిందో తెలీక కంగారు పడ్డారు. 

ఇంతలో కోదాడ సమీపంలో ప్రమాదం జరిగిందని టీవీలో వార్తలు ప్రసారం కావడం, మృతుల జాబితాలో లక్ష్మీతేజ పేరు ఉండడంతో తండ్రి రాంప్రసాద్‌ హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లారు. అప్పటికే లక్ష్మితేజ మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురిలో ఉంచారు. రాత్రి ఫోన్‌ చేసి ఉదయానికి వస్తాను నాన్న అని చెప్పిన నా కూతురిని ఇలా చూస్తానని అనుకోలేదని రాంప్రసాద్‌ కన్నీరుమున్నీరయ్యారు. ఇంటికి తీసుకొచ్చిన కూతురు మృతదేహంపై పడి తల్లి కవిత విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. 

ఇంటికి వచ్చినప్పుడల్లా నీ కాళ్ల పట్టీలు కావాలమ్మా.. అని అడిగేదానివి కదా.. లే అమ్మా పట్టీలు ఇస్తాను. తమ్ముడికి రాఖీ కడుదువుగానీ అంటూ ఆమె గుండెలవిసేలా రోదిస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. గత రెండేళ్ల నుంచి లక్ష్మితేజకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నామని, ఈ ఏడాది ఎలాగైనా కల్యా­ణం జరిపించాలని అనుకున్నామని తల్లిదండ్రులు కన్నీరు­మున్నీరవుతున్న తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది.

ఏడాదిన్నర బిడ్డను చూసేందుకు వస్తూ..
గుణదల(విజయవాడ తూర్పు)/పెనమలూరు: విజయవాడ అరుళ్‌నగర్‌కు చెందిన  బొల్లిపోగు మేరీజ్యోత్స్న (29) తండ్రి సాల్మన్‌ రాజు విజయవాడ లో పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి, తల్లి నిర్మలా కుమారి గృహిణి. రెండేళ్ల క్రితమే హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న వంశీతో పెళ్లయింది. వీరికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఇవాన్‌ ఉన్నాడు. బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, దీనికోసం తానూ కష్టపడతానని జ్యోత్స్న భర్తకు చెప్పారు. దీంతో హైదరాబాద్‌లోనే కాగ్నిజెంట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరారు. బిడ్డను విజయవాడ కానూరు తులసీనగర్‌లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దే ఉంచారు. 

ఆమెకు తమ్ముడు రాహుల్‌ కూడా ఉన్నాడు  ఇటీవల వర్క్‌ఫ్రం హోం చేస్తున్న జ్యోత్స్న అప్పుడప్పుడు హై­ద­రాబాద్‌­లోని కార్యాలయానికి వెళ్లివస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ వెళ్లిన ఆమె మంగళవారం రాత్రి తిరిగి విజయవాడ కానూరుకు ట్రావెల్‌ బస్సులో బయలుదేరారు. బిడ్డను చూడాలని బయలుదేరే ముందు భర్తతో చెప్పారు. అయితే మార్గమధ్యంలోనే కోదాడ వద్ద జరిగిన ప్రమాదంలో మరణించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ­రవుతున్నారు. 

బిడ్డను చూడాలని ఆశగా బయలుదేరిందని, అతడి భవిష్యత్తు కోసం తానూ కష్టపడతానని చెప్పిందని, సాఫీగా సాగుతున్న జీవితం ఒక్కసారిగా తల్లకిందులైందని ఆమె భర్త వంశీ, తల్లిదండ్రులు విలపించారు. విజయ­వాడ అరుళ్‌ నగర్‌కు తరలించి అంతిమ సంస్కారాలు చేశారు.  ఇదిలా ఉంటే తెల్లవారు జామున 4.48 గంటలకు ఫోన్‌ మెసేజ్‌ అలర్ట్‌తో కోదాడ సమీపంలో బస్సు ప్రమాదానికి గురైందని తెలిసిందని, వెంటనే ట్రావెల్స్‌ సంస్థ టోల్‌ఫ్రీకి ఫోన్‌ చేస్తే స్పందించలేదని జ్యోత్స్న సోదరుడు రాహుల్‌ విమర్శించాడు.

తీవ్ర విషాదకరం 
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌
సాక్షి, అమరావతి: హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాద­కరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను కోరారు. 

అవస­రమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించి, విషమ పరిస్థితిలో ఉన్న వారి ప్రాణా­లను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement