న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీల అనర్హత వేటు పిటిషన్పై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో, సదరు ఎంపీలకు నోటీసులు జారీ చేస్తూ ఏడు రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ జూన్ 18న నిబంధన 6 (ఫిరాయింపుల ఆధారంగా లోక్సభ సభ్యుల అనర్హత నియమావళి, 1985) కింద స్పీకర్కు పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి, స్పీకర్ వద్ద పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ల విచారణను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయడమే కీలకమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
టీఎంసీ గుర్తుపై గెలిచిన 20 మంది ఎంపీలు పార్టీని వీడి, త్రిపురకు చెందిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లో చేరారని, అలాగే ఎన్డీయే కూటమి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని టీఎంసీ ఆరోపించింది. ఇది రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతకు దారితీస్తుందని అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు. అయితే, తమది చట్టబద్ధమైన పార్టీ విలీనమేనని తిరుగుబాటు ఎంపీలు వాదిస్తున్నారు. నోటీసులు అందుకున్న వారిలో కాకోలి ఘోష్ దస్తిదార్, సుదీప్ బందోపాధ్యాయ, శతాబ్ది రాయ్, ప్రసూన్ బెనర్జీ, రచనా బెనర్జీ, జగదీష్ చంద్ర బర్మా బసునియా, పార్థా భౌమిక్, అరూప్ చక్రవర్తి, అధికారి దీపక్ దేవ్, సయానీ ఘోష్, బాపి హల్దార్, ఎండీ అబూ తాహిర్ ఖాన్, కలిపాద సొరేన్ ఖేర్వాల్, అసిత్ కుమార్ మాల్, జూన్ మాలియా, మితాలి బాగ్, ఖలీలుర్ రెహమాన్, మాలా రాయ్, శర్మిలా సర్కార్, యూసుఫ్ పఠాన్ ఉన్నారు.
ఇది కూడా చదవండి: మళ్లీ వార్తల్లోకి ఖాన్ సర్.. ఈసారి వేధింపుల కేసు


