సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై సుస్మిత అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
చిన్నారెడ్డికి కూడా...
కాగా, మాజీ మంత్రి చిన్నారెడ్డికి కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. వనపర్తి సభలో పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై చిన్నారెడ్డిని కమిటీ వివరణ కోరింది. స్థానిక ఎమ్మెల్యేపై అనుచిత ప్రసంగం చేసిన అంశంపైనా మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని టీపీసీసీ కోరింది.
జక్కిడి ప్రభాకర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు
జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సస్పెన్షన్ వేటు వేసింది. ఎల్బీ నగర్ కాంగ్రెస్ సీనియర్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ కమిటీ ఆదేశాలు ఇచ్చింది. వ్యక్తిగత, కులపరమైన దూషణలపై ఆధారాలు ఉండటంతో చర్యలు తీసుకున్న కమిటీ.. జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.


