సాక్షి,తాడేపల్లి: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు-ఆటో ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం తీవ్ర విషాదకరమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని పేర్కొన్నారు. మృతులు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా తెలిసిందని, ఒకే ప్రాంతానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోవడం మరింత బాధాకరమన్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని చికిత్సా సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను కోరారు. తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రోడ్డు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని వైఎస్ జగన్ కోరారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


