వికారాబాద్: తన కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, ఓ వ్యక్తి పెడుతున్న లైంగిక వేధింపులు, బెదిరింపులను భరించలేకున్నానని బాధిత మహిళ బుధవారం పరిగి డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆమె వివరాల మేరకు.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్త పక్షవాతంతో బాధపడుతున్నాడు.
దీన్ని ఆసరాగా చేసుకొని ఇదే ఊరికి చెందిన కర్రె సుధాకర్ నెల రోజులుగా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈవిషయమై బాధితురాలు ఈనెల 15న స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, 18న కేసు నమోదు చేశారు. కానీ ఇంతవరకూ అతన్ని అరెస్టు చేయకపోగా, కేసు వాపస్ తీసుకోవాలని ఎస్ఐ తనను బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. దీనిపై పూర్తి విచారణ చేసి న్యాయం చేయాలని డీఎస్పీ శ్రీనివాస్కు ఫిర్యాదు చేసింది.
వెంటనే స్పందించిన ఆయన ఎస్ఐ బాలవెంకటరమణతో ఫోన్ మాట్లాడి, నిందితున్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించినట్లు కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు, చైతన్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు అలివేలు, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు.


