కన్నడ స్టార్ యశ్ నటించిన భారీ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా ‘టాక్సిక్’ విడుదలైన తొలి రోజే భారీ వసూళ్లు సాధించింది. అయితే కంటెంట్ కారణంగా పూర్తిగా నెగెటివ్ రివ్యూలతో ట్రోలింగ్ను ఎదుర్కొంటోంది. మరోవైపు సినిమా వివాదంలో చిక్కుకుంది. సినిమాలో మహిళలను అతిగా చూపించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీజేపీ మాజీ నేత, ‘వీ ది లీడర్స్’ వ్యవస్థాపకుడు కె. అన్నామలై ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన అనుమతిపైనా ప్రశ్నలు సంధించారు.
సినిమాల్లో మహిళల చిత్రీకరణ విషయంలో సెన్సార్ నిబంధనలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని అన్నామలై అన్నారు. ప్రముఖ హీరోలు నటించే సినిమాల విషయంలోనూ ఏ సన్నివేశాలు అనుమతించాలి? ఏవి అనుమతించకూడదనే అంశంపై సెన్సార్ బోర్డు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
పిల్లలపై ప్రభావం:
‘టాక్సిక్’కు తొలి రోజే రూ.104 కోట్ల వసూళ్లు వచ్చాయని ప్రస్తావించిన అన్నామలై.. ఇలాంటి సినిమాలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘మహిళలను ఒక నిర్దిష్ట కోణంలో చూపిస్తున్నారు. పిల్లలు ఇలాంటి చిత్రాలను పదేపదే చూస్తే.. సమాజంలో మహిళల పట్ల వారి దృక్పథం ఎలా మారుతుంది?’’ అంటూ ప్రశ్నించారు.
మహిళల భద్రత, గౌరవం కోసం తాము పట్టణాలు, కళాశాలలకు వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాంటి సమయంలో మహిళలను సమస్యాత్మకంగా చూపించే సన్నివేశాలతో ఉన్న సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడం తనకు ఆందోళన కలిగిస్తోందన్నారు. సినిమాల్లో మహిళలకు తగిన గౌరవం దక్కుతోందా? అని ప్రశ్నించారు.
యశ్ రియాక్షన్
‘టాక్సిక్’పై మహిళల చిత్రీకరణకు సంబంధించి ఇప్పటికే విమర్శలు రావడంతో.. హైదరాబాద్లో జరిగిన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో యశ్ స్పందించారు. ట్రైలర్లో కనిపించిన కొన్ని సన్నివేశాలను చూసి సినిమా మొత్తాన్ని అంచనా వేయొద్దని అన్నారు. దర్శకురాలు గీతూ మోహన్దాస్ మహిళా పాత్రలను బలంగా తీర్చిదిద్దారని చెప్పారు.
‘‘ప్రతి మహిళ, ప్రతి అమ్మాయి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని.. తన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేసి.. సమాజంలో విజయం సాధించగలదనే విషయాన్ని ఈ సినిమా చూపిస్తుంది’’ అని యశ్ పేర్కొన్నారు. సినిమాలో మహిళలకు ప్రత్యేకమైన స్వరం ఉందని, ట్రైలర్ ద్వారా ఏర్పడిన అభిప్రాయం కంటే సినిమా భిన్నంగా ఉంటుందని చెప్పారు. అమ్మాయిలంతా థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని, ఆస్వాదించాలని కోరారు.
భారీ అంచనాలతో ‘టాక్సిక్’
‘టాక్సిక్’కు గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందిన ఈ పీరియడ్ గ్యాంగ్స్టర్ డ్రామాలో యశ్ ద్విపాత్రాభినయం చేశారు. నయనతార, తారా సుతారియా, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు.
ఇదీ చదవండి: నీతులు చెప్పే చైనాకు.. బాన్కియావో ఘోరకలి గుర్తుందా?


