పట్నా: బిహార్ బోర్డు విద్యార్థుల మార్కుల జాబితాల నుండి ‘ఫెయిల్’ అనే పదాన్ని పూర్తిగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మార్కుల షీట్లలో ‘ఫెయిల్’ అనే పదానికి బదులుగా ‘స్కిల్ ట్రైనింగ్కు అర్హులు’ (Eligible for Skill Training) అనే పదాన్ని ఉపయోగించనున్నట్లు విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ ప్రకటించారు.
ఒక పరీక్షలో ఆశించిన మార్కులు సాధించలేకపోయినంత మాత్రాన విద్యార్థి ప్రతిభ ఎప్పటికీ తగ్గిపోదని, అందుకే సర్టిఫికెట్లపై ‘ఫెయిల్’ వంటి నిరుత్సాహపరిచే పదాలు ఉండకూడదని భావించామన్నారు. ఈ మేరకు త్వరలోనే నిబంధనల్లో సవరణలు చేసి, బీహార్ పాఠశాల పరీక్షా మండలికి విద్యాశాఖ అధికారిక మార్గదర్శకాలు జారీ చేయనుంది. మెట్రిక్యులేషన్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం నెల రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు మెరుగైన అబ్యాసానికి అవకాశం కల్పించి, వారి విజయాన్ని సుసాధ్యం చేయడమే ఈ ప్రత్యేక తరగతుల ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.
ఇదే సమయంలో బీహార్ ప్రభుత్వం విద్యారంగంలో పలు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ‘టీచర్ సపోర్ట్ పోర్టల్’ను ప్రారంభించనున్నారు. అలాగే, 9 నుండి 12 వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘విద్యా సాథి’ యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా విద్యార్థులకు 24 గంటలూ ఉపాధ్యాయుల నుండి ఆన్లైన్ విద్యా సహాయం లభిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 75,000 మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు వ్యక్తిగత విద్యా మార్గదర్శకత్వం అందించనున్నారు. ఇంజనీరింగ్, మెడికల్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులు సులభంగా సిద్ధం కావడానికి ఈ వేదిక ఎంతగానో దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.
ఇది కూడా చదవండి: కిమ్తో ట్రంప్ దోస్తీ.. ఐరాస అణు నిఘా చీఫ్ అనూహ్య వ్యాఖ్యలు!


