6 ఏళ్లకే ఈ బాలుడు ‘అభిజీత్‌ దీప్కే’లా అయిపోయాడు.. | Fact check: 6 year old Aditya leads protest in Patna | Sakshi
Sakshi News home page

6 ఏళ్లకే ఈ బాలుడు ‘అభిజీత్‌ దీప్కే’లా అయిపోయాడు..

Aug 26 2026 3:32 PM | Updated on Aug 26 2026 3:48 PM

Fact check: 6 year old Aditya leads protest in Patna

పట్నా: ఉపాధ్యాయుల నియామక పరీక్ష (టీఆర్‌ఈ-4)లో ఒకే పరీక్ష, నెగెటివ్‌ మార్కింగ్‌ విధానాన్ని తొలగించడంతో పాటు పలు డిమాండ్లతో బిహార్‌ రాజధాని పట్నాలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గాంధీ మైదాన్‌ నుంచి ముఖ్యమంత్రి నివాసం వరకు విద్యార్థులు మార్చ్‌ నిర్వహించారు. డాక్‌ బంగ్లా చౌరస్తాలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య కొంత ఉద్రిక్తత కనిపించింది.

వాటర్‌ క్యానన్‌ ప్రయోగించినా విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో లాఠీచార్జ్‌ చేశారు. ఈ సమయంలో పలువురిని కలచివేసే చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ ఆందోళనలో ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల ఆదిత్య ప్రభుత్వం తీరుపై ప్రశ్నలు సంధించాడు. బిహార్‌ ముఖ్యమంత్రి సమ్రాట్‌ చౌధరి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాడు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు అడిగాడు.

జనంలో వైరల్‌గా మారిన బాలుడు
వేలాది మంది పోలీసు సిబ్బంది, ఆందోళనకారుల మధ్య వైరల్‌గా మారిన ఈ బాలుడు ప్రభుత్వం విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేశాడు. నిరుద్యోగ సమస్యను ప్రస్తావిస్తూ విద్యార్థులు నిరుద్యోగులుగా మారుతున్నారని చెప్పాడు. అతడి మాటలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. వైరల్‌ అవుతున్న వీడియోలో బాలుడు మాట్లాడుతూ.. అధికారం వస్తుంది, పోతుంది. కానీ దేశ భవిష్యత్తుతో జరిగిన ఆట కారణంగా విద్యార్థుల జీవితాలపై ప్రభావం పడుతోందని చెప్పాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావని అతడిని అడిగినప్పుడు.. విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చానని చెప్పాడు.

ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన బాలుడు
ముఖ్యమంత్రి సమ్రాట్‌ చౌధరి విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆ బాలుడు అన్నాడు. విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం రూపొందించిన పథకాల పరిస్థితి ఏమైందని ఆదిత్య ప్రశ్నించాడు. ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ వాటిలో కొన్ని ఎందుకు అమలు చేయడం లేదని అడిగాడు. విద్యార్థులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం చెప్పిందని, కానీ ఇక్కడ వారికి లాఠీఛార్జ్‌లు అందుతున్నాయని అన్నాడు.

ఆదిత్యను తీసుకెళ్లిన పోలీసులు
ఆదిత్య తన తల్లితో కలిసి చేతిలో పోస్టర్‌ పట్టుకుని ఆందోళనకు వచ్చాడు. విద్యార్థులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేసి బిహార్‌ విద్యాశాఖ మంత్రి మిథిలేశ్‌ తివారీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ ఉన్న పోలీసులు బాలుడిని అక్కడి నుంచి తమ వెంట తీసుకెళ్లారు. ఆందోళనకారులు గాంధీ మైదాన్‌ నుంచి ర్యాలీగా ముఖ్యమంత్రి నివాసం వైపు ముందుకు సాగారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసులకు ఆదిత్య కూడా పోస్టర్‌ పట్టుకుని ఆందోళనకారులతో కలిసి కనిపించడంతో అతడిని తీసుకెళ్లడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం
ఫ్యాక్ట్‌చెక్‌: ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలంటూ ఆ బాలుడు పోస్టర్లు పట్టుకోవడంతో అతడిని అరెస్టు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ అందులో నిజం లేదు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసు బృందం ఆదిత్యను ఆందోళన స్థలం నుంచి తమ వెంట తీసుకెళ్లింది. దీనిపై సోషల్‌ మీడియాలో భిన్నమైన వాదనలు వచ్చాయి. అయితే బాలుడిని అధికారికంగా అదుపులోకి తీసుకున్నట్లుగానీ, అతడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నట్లుగానీ అధికారిక సమాచారం వెలువడలేదు. గుంపు, ఉద్రిక్త పరిస్థితుల మధ్య బాలుడిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లేందుకే పోలీసులు చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఆందోళన మధ్య 6 ఏళ్ల ఆదిత్య హీరో అయిపోయాడు. 6 ఏళ్లకే ఈ బాలుడు అభిజీత్‌ దీప్కే అపోయాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement