ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం నేడు ఒక విచిత్రమైన, తీవ్రమైన ఆర్థిక వైరుధ్యాన్ని ఎదుర్కొంటోంది. ఫోర్బ్స్ 2026 నివేదిక ప్రకారం అమెరికా (989), చైనా (539) తర్వాత 229 మంది బిలియనీర్లతో(సుమారు రూ.8,300 కోట్లకు పైగా ఆస్తి కలిగినవారిని బిలియనీర్లు అంటారు) భారత్ ప్రపంచంలోనే అత్యధిక కుబేరులున్న మూడో దేశంగా నిలిచింది. కానీ, నాణేనికి మరోవైపు చూస్తే.. పేదరికం, నిరుద్యోగం, ఆకలిచావులు, ఆరోగ్య సమస్యలు.. పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు కుబేరుల సంపద ఆకాశాన్నంటుతుంటే మరోవైపు సామాన్యుడి బతుకు తాటాకు చప్పుడు-తమలపాకు భోజనం అన్న చందంగా మారుతోంది.
ఆర్థిక అసమానతల కఠిన వాస్తవాలు
వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2026 ప్రకారం, భారతదేశ సంపదలో 40 శాతం పైగా కేవలం అత్యంత ధనవంతులైన 1 శాతం మంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. అదే సమయంలో దిగువన ఉన్న 50 శాతం జనాభా కేవలం 15 శాతం ఆదాయంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. దేశ జీడీపీ గణాంకాలు పెరుగుతున్నప్పటికీ యువతకు తగిన సంఖ్యలో నాణ్యమైన ఉద్యోగాలు లభించడం లేదు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ఆరోగ్య సూచీల్లో భారత్ ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే వెనుకబడి ఉంది.
ఈ పరిస్థితులకు కారణాలు ఏమిటి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారత్లో ఈ అసమానతలు ఆర్థిక రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. మన ఆర్థిక వ్యవస్థ మూలధన ఆధారిత శ్రమకు ఎక్కువ ప్రతిఫలాన్ని, మానవ శ్రమకు తక్కువ విలువను ఇస్తోంది. నాణ్యమైన విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారడం వల్ల పేదరికం తరతరాలుగా కొనసాగుతోంది. సంపద పన్ను (వెల్త్ ట్యాక్స్) లేకపోవడం, పరోక్ష పన్నుల భారం సామాన్యులపై ఎక్కువగా పడటం ఆర్థిక అసమానతలను మరింత పెంచుతోంది.
పరిష్కార మార్గాలు.. ఏం చేయాలి?
సంపద సృష్టి కొందరు వ్యక్తులకు మాత్రమే పరిమితం కాకుండా ఉపాధి కల్పించే తయారీ రంగానికి పెద్దపీట వేయాలి. ప్రభుత్వ విద్య, వైద్య రంగాలకు జీడీపీలో కనీసం 6% నిధులు కేటాయించి నాణ్యమైన సేవలు అందించాలి. అత్యంత ధనవంతులపై సరైన పన్నులు విధించి ఆ నిధులతో సామాజిక భద్రతా పథకాలను మెరుగుపరచాలి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి స్థానిక ఉపాధిని ప్రోత్సహించాలి.
దేశం కేవలం బిలియనీర్ల సంఖ్యతో గొప్పది కాబోదు; సమాజంలో చిట్టచివరి నిరుపేద సాధించే ఆర్థిక ప్రగతిలోనే అసలైన ప్రగతి దాగి ఉంది. సిరి ఉంటే సరిపోదు.. అందరికీ పోషకాలతో కూడిన పట్టెడన్నం దొరికిననాడే అసలైన సమృద్ధి అనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో పాలకులు స్పష్టమైన వ్యూహాత్మక మార్పు తీసుకురావాలి.
ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా..


