పరీక్షార్థులపైకి జల ఫిరంగుల్ని ప్రయోగించి చెదరగొడుతున్న దృశ్యం
ఉపాధ్యాయ అభ్యర్థుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
రాళ్లు రువ్విన నిరసనకారులు
లాఠీచార్జి, వాటర్ కెనాన్లతో చెదరగొట్టిన పోలీసులు
పట్నా: బిహార్ రాజధాని పట్నా మంగళవారం రణరంగాన్ని తలపించింది. బిహార్ పబ్లిక్ సర్విస్ కమిషన్(బీపీఎస్సీ) వచ్చే నెలలో నిర్వహించనున్న ఉపాధ్యాయ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులు ర్యాలీ తలపెట్టగా పోలీసులు అడ్డుకున్నారు. తమ సమస్యలను విన్నవించుకునేందుకు ముఖ్యమంత్రి నివాసం వైపునకు ర్యాలీగా వెళ్తుండగా అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వుతారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు.
వాటర్ కెనాన్లు ప్రయోగించారు. ఉపాధ్యాయ నియామక రాత పరీక్షలను ప్రిలిమ్స్, మెయిన్స్ అనే రెండు దశల్లో కాకుండా ఒకే దశలో నిర్వహించాలని అభ్యర్థులు డి మాండ్ చేస్తున్నారు. ప్రభు త్వంపై ఒత్తిడి పెంచడానికి ‘ముఖ్యమంత్రి నివాస ముట్టడి’కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో బీపీఎస్సీ నిర్వహించిన ‘కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్’లో అక్రమాలు జరిగాయని నిరసనకారుల్లో మరో వర్గం ఆరోపించింది. ఆ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలని పట్టుబట్టింది. పోరాటంలో భాగంగా పట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్ వద్ద ప్రారంభమైన ర్యాలీలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ వంటి సంఘాలకు చెందిన వామపక్ష కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. గాంధీ మైదాన్ నుంచి ముఖ్యమంత్రి నివాసం వరకు దాదాపు 5 కిలోమీటర్ల మార్గంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
జేపీ గోలాంబర్ వద్ద పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించగా, నిరసనకారులు నీటిలో తడుస్తూనే రెయిన్ డ్యాన్స్ చేయడం కనిపించింది. నిరసనకారులు బారికేడ్లను ఛేదించుకుని ముందుకు పరుగులు తీశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. నిరసనకారులను అదుపులోకి తీసుకొని నగరంలో వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉందని అధికారులు వెల్లడించారు. సమస్యల పరిష్కారం కోసం కొన్ని వారాలుగా ధర్నా చేస్తున్న అభ్యర్థులను కించపరిచేలా, బీపీఎస్సీ పరీక్షల నియంత్రణాధికారి రాకేష్కుమార్ సింగ్ సోమవారం ‘ఏనుగు బజారులో నడుస్తుంటే వేలకొద్దీ కుక్కలు మొరుగుతాయి’అనే హిందీ సామెతను ప్రయోగించడంపై నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


