దొడ్డబళ్లాపురం: స్త్రీని ఆమె భర్త ఇంటి పని చేయాలని, అత్తమామలను చూసుకోవాలని బలవంతం చేయరాదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. భార్య, కుమార్తెకు నెలకు రూ.9వేలు భరణం ఇవ్వాలన్న ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. భర్త హైకోర్టును ఆశ్రయించిన పిటిషన్పై హైకోర్టు విచారించింది. ‘తల్లిదండ్రుల బాధ్యత వారి కుమారుడు లేదా కుమార్తెది మాత్రమే. కోడలిది కాదు’ స్త్రీ పుట్టింటికి వెళ్లడానికి భర్త ఇంట్లో అందరి అనుమతి తీసుకోవాలనుకోవడం అవివేకం.
వివాహం పేరుతో స్త్రీ స్వాతంత్య్రాన్ని, ఇష్టాయిష్టాలను నియంత్రించడం, ఆమెపై హక్కులు చలాయించడానికి చట్టం ఒప్పుకోదు’ అని హైకోర్టు స్పష్టం చేసింది. స్త్రీ పుట్టింటికి ఇష్టం వచ్చినప్పుడు వెళ్లవచ్చని, అందుకు భర్త ఇంట్లో ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. భార్యాభర్తల సంబంధం యజమాని, నౌకరు లాంటిది కాదని, భార్య, కుమార్తె జీవనానికి నెలకు రూ.9 వేలు భరణం కచ్చితంగా ఇవ్వాలని ఆదేశించింది.


