నేపాల్లోని ఎగువ పరీవాహక ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అత్యవసరం సమావేశం నిర్వహించారు. నేపాల్ నుంచి వరద నీరు వచ్చే ప్రమాదం పొంచి ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. బిహార్లోని డ్యామ్లు, కరకట్టలపై 24 గంటల నిఘా ఉంచాలని అధికారులను అప్రమత్తం చేశారు.
ఈ వరదల కారణంగా గండక్ నదిలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పాట్నాలోని సంకల్ప్ ఆడిటోరియంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లోని జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గండక్ నదికి సంబంధించి ముఖ్యంగా పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, గోపాల్గంజ్, సారణ్, ముజఫర్పూర్, వైశాలి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు.
నేపాల్లో మెరుపు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 16 మంది మృతి చెందగా.. 36 మంది గాయపడ్డారు. 400 మందికి పైగా టూరిస్టులు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పర్యాటకుల్లో దాదాపు 100 మందికి పైగా భారతీయులు ఉన్నారు. భూకంపంతో మంచు చరియలు విరిగిపడి బోటే కోసి నదిలో వరద ప్రవాహం పెరిగింది. టిబెట్ నుంచి నేపాల్ వైపు సరిహద్దుల గుండా వరద పరుగులు ప్రవహించింది. వరద ప్రవాహం పొంగి పట్టణాలు, గ్రామాలను నది ముంచెత్తింది. సెకండ్ల వ్యవధిలో దూసుకొచ్చిన వరద ప్రవాహంతో జనం కొట్టుకుపోయారు. వరదలకు టిబెట్-నేపాల్ సరిహద్దు రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది.
ఇదీ చదవండి: విమానంలో వచ్చి మనిషిని చంపిన దోమ


