గుజరాత్లోని సూరత్ నగరంలోని ఉన్న్ ప్రాంతం మిస్వాహున్ నగర్ నుంచి ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడి మహ్మూదియా మదర్సాలో చదువుతున్న 10 ఏళ్ల నాజిష్ మొహమ్మద్ అలియాస్ నాజిమ్ 3వ అంతస్తు నుంచి కిందపడిపోయాడు. బాలుడు నేరుగా సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం పిల్లర్ నుంచి బయటకు వచ్చిన ఇనుప రాడ్పై పడిపోయాడు.
ప్రమాదం తీవ్రత ఎంతగా ఉందంటే ఇనుప రాడ్ బాలుడి భుజం, మెడ వెనుక భాగాన్ని చీల్చుకుంటూ నోటి నుంచి బయటకు వచ్చింది. అయితే స్థానికుల సమయస్ఫూర్తి, సూరత్ న్యూ సివిల్ ఆసుపత్రి వైద్యుల అప్రమత్తతతో దాదాపు గంట పాటు సాగిన అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స తర్వాత బాలుడిని ప్రాణాపాయం నుంచి కాపాడారు.
కట్టర్తో రాడ్ను కత్తిరించిన స్థానికులు
ఈ ఘటన మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. బాలుడు 3వ అంతస్తు నుంచి కిందపడగానే అక్కడ గందరగోళం నెలకొంది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన స్థానికులు ఆలస్యం చేయకుండా కట్టర్ సహాయంతో ప్రధాన రాడ్ను కత్తిరించారు. మెడలో ఇరుక్కున్న ఇనుప రాడ్తోనే బాలుడిని అంబులెన్స్లో న్యూ సివిల్ ఆసుపత్రి ట్రామా సెంటర్కు తరలించారు.
అప్పుడు బతికే అవకాశాలు కేవలం 20 శాతమే
ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి బాలుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వైద్యుల ప్రకారం అతను బతికే అవకాశం కేవలం 20 శాతం మాత్రమే. అత్యవసర విభాగం సిబ్బంది వెంటనే ప్రాథమిక చికిత్స అందించి బాలుడి శ్వాసను స్థిరీకరించారు. సీటీ స్కాన్ తర్వాత నేరుగా శస్త్రచికిత్స గదికి తీసుకెళ్లారు.
శస్త్రచికిత్స చేసిన వైద్యుడు దివ్యాంగ్ దవే మాట్లాడుతూ.. బాలుడి నోటిలో రాడ్ ఇరుక్కుపోవడంతో మత్తు మందు కోసం ట్యూబ్ను అమర్చడం అత్యంత సవాలుగా మారిందని తెలిపారు. అయితే మత్తు మందుల వైద్య బృందం దీన్ని ఎంతో సమర్థంగా నిర్వహించిందని చెప్పారు.
యూనిట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రకాశ్ పటేల్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ నీలేశ్ కాచ్డియా, డాక్టర్ దీప్ షా, డాక్టర్ ఋత్విక్ జీవాణి, డాక్టర్ కౌశల్, డాక్టర్ హార్దిక్ ఆస్తిక్, ఈఎన్టీ శస్త్రచికిత్స నిపుణుల పూర్తి బృందం దాదాపు గంట పాటు శ్రమించి రాడ్ను విజయవంతంగా బయటకు తీసింది.
ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే గొంతులోని ప్రధాన రక్తనాళానికి ఎలాంటి నష్టం జరగలేదు. లాలాజల గ్రంథి, కండరాలకు స్వల్ప గాయాలయ్యాయి. వాటిని ఈఎన్టీ శస్త్రచికిత్స నిపుణులు సరిచేశారు. బాలుడు ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు. అతని పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉంది.
బాలుడి తండ్రి సద్రే ఆలమ్ మాట్లాడుతూ.. ఈ ఘటన జరిగిన సమయంలో తాను పనిలో ఉన్నానని తెలిపారు. ఫోన్లో సమాచారం అందగానే నేరుగా ఆసుపత్రికి చేరుకున్నానని చెప్పారు. “ఆసుపత్రిలోని వైద్యులందరూ తమవంతు పూర్తి ప్రయత్నం చేశారు. ప్రమాదం ఎలా జరిగింది? ఇందులో ఎవరి నిర్లక్ష్యం ఉంది? అనేది మదర్సాలో ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించిన తర్వాతే స్పష్టమవుతుంది” అని తెలిపారు.


