సూర్యాపేట జిల్లా: వివాహితను ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తుండగా.. అతడిపై బాధితురాలి కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామానికి చెందిన చింతారెడ్డి భాస్కర్రెడ్డి ఏడాది కాలంగా మేళ్లచెరువు మండలం వెంకట్రామాపురం గ్రామానికి చెందిన బేత మౌనిక వెంటపడుతూ ‘నువ్వంటే నాకిష్టం..నా కోరిక తీర్చు’అంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు.
ఎన్నిసార్లు మందలించినా అతడి పద్ధతిలో మార్పు రాలేదు. దీంతో ఈ నెల 4న మౌనిక తన తల్లిగారి ఊరైన బక్కమంతులగూడేనికి వచ్చింది. ఆదివారం ఉదయం తన తల్లిగారింటి ముందు ఆమె వాకిలి ఊడుస్తుండగా భాస్కర్రెడ్డి ఒక్కసారిగా మౌనిక వద్దకు వచ్చి బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లడంతో ఆమె కేకలు వేసింది. దీంతో భాస్కర్రెడ్డి కొడవలితో ఆమె కుడిచేతిపై కొట్టి.. ‘నా కోరిక తీర్చు, లేకపోతే నిన్ను చంపేస్తాను, నీ ఫొటోలు సోషల్ మీడియాలో పెడతాను’అంటూ బెదిరించాడు.
భాస్కర్రెడ్డి ఇంటిపై దాడి..
అనంతరం బేత మౌనికతోపాటు బేత రామాంజిరెడ్డి, బోగాల పద్మ, కుందూరు సంధ్య, బోగాల మధుసూదన్రెడ్డి కలిసి భాస్కర్రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి కర్రలు, రాడ్లతో అతడిపై దాడిచేసి తల పగులగొట్టారు. దీంతో భాస్కర్రెడ్డిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భాస్కర్రెడ్డి భార్య శివనాగిని మెడలోని నాలుగున్నర తులాల బంగారు గొలుసు కూడా పోయింది.
ఇదంతా భాస్కర్రెడ్డి ఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. భాస్కర్రెడ్డి తనను లైంగికంగా వేధించడంతోపాటు అతడి భార్య శివనాగిని, కొడుకు మంజూనాథరెడ్డి కూడా అసభ్య పదజాలంతో తనను తిట్టి బెదిరించారని మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాత పంచాయితీలు మనసులో పెట్టుకొని తమ ఇంటిపై దాడి చేసి తన భర్త తల పగులగొట్టారని భాస్కర్రెడ్డి భార్య శివనాగిని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మొత్తం 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.
చదవండి: పబ్లో అర్ధరాత్రి ఘర్షణ


