హుజూర్నగర్ : హుజూర్నగర్ వాసుల దశాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరింది. స్థానిక విద్యార్థులతో పాటు జిల్లా రైతాంగానికి ఎంతో మేలు చేకూర్చే ప్రభుత్వ బీఎస్సీ వ్యవసాయ కళాశాల హుజూర్నగర్ పట్టణంలో లాంఛనంగా ప్రారంభమైంది. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రభుత్వం ఈ కళాశాలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, సొంత భవనాలు అందుబాటులో లేకపోవడంతో గతేడాది (2024–25) బీఎస్సీ అగ్రికల్చర్లో చేరిన 37 మంది విద్యార్థులకు హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించారు. వారంతా ఇప్పుడు హుజూర్నగర్లోని తాత్కాలిక ప్రాంగణంలో ద్వితీయ సంవత్సరం అభ్యసించనున్నారు.
మొదలైన తరగతులు
ఈ వ్యవసాయ కళాశాలలో మొత్తం 120 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా నిర్వహించిన తొలి విడత కౌన్సిలింగ్లో 33 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరికి ఈనెల 1వ తేదీ నుంచే మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కళాశాలలో 24 మంది బోధన, బోధనేతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 8 మంది శాశ్వత అధ్యాపకులు, ఐదుగురు టీచింగ్ అసోసియేట్లు, ఒక శాశ్వత బోధనేతర ఉద్యోగితో పాటు 10 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు.
రెండేళ్లలో శాశ్వత భవనాలు
హుజూర్నగర్ శివారులోని మగ్దూంనగర్లో కళాశాల శాశ్వత భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే 100 ఎకరాల భూమిని సేకరించింది. రెండేళ్లలో భవన నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్తులో ఈ సువిశాల స్థలాన్ని విద్యార్థుల శిక్షణ తరగతులు, విత్తనోత్పత్తి, రైతు సాధికారత కార్యక్రమాలకు వినియోగించనున్నారు.
ఫ మగ్దూంనగర్ శివారులో
తాత్కాలిక భవనంలో కళాశాల
ఫ శాశ్వత భవనాలకు 100 ఎకరాల భూమి కేటాయింపు
ఫ 120 సీట్లకు తొలి విడత
33 మంది విద్యార్థుల చేరిక
ఫ ఈ నెల 1నుంచే ప్రారంభమైన తరగతులు


