సాక్షి, హైదరాబాద్: తుక్కుగూడ నర్సు హత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై మేజిస్టీరియల్ విచారణ చేయాలని ఆదేశించారు. నర్సు హత్య కేసులో ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా సత్వర న్యాయం అందించాలని కోరారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని బాధితురాలు ఉంటున్న వసతి ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లపై విచారణ జరిపించాలన్నారు. సంబంధిత సంస్థ నిర్వహణలో నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయాలని మహిళా ఉద్యోగుల భద్రతా నిబంధనల అమలుపై విచారణ జరపాలని సీఎం ఆదేశించారు.
అదేవిధంగా నిందితుడిపై పకడ్బందీ దర్యాప్తు పూర్తి చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ఫోరెన్సిక్, సాంకేతిక ఆధారాలను వేగంగా సేకరించాలని ఆదేశించారు. సమగ్ర ఛార్జ్షీట్ దాఖలు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని న్యాయశాఖ, పోలీసు, ప్రాసిక్యూషన్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ వేగంగా పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఏం జరిగింది?
తుక్కుగూడలో యువ నర్సు అనుమానాస్పద మృతి చెందింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతిపై లైంగిక దాడి.. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్థానికంగా మెకానిక్గా పని చేసే సనావుల్లా ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. తాజాగా దీనిపై సీఎం స్పందించారు.


