ఎర్రవల్లి: కాంగ్రెస్ 1,000 రోజుల పాలన అట్టర్ప్లాప్ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడి, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ది థర్డ్ క్లాస్ పాలన అని చెప్పారు. కాంగ్రెస్కు నూకలు చెల్లాయని అర్థమైపోయిందని, అందుకే ఆ పార్టీ నేతలు దోపిడీ చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు అందరూ తప్పకుండా హాజరుకావాలని చెప్పారు.
‘‘త్వరలో పాదయాత్ర చేస్తాను. నేను అసెంబ్లీకి రావాలో, వద్దో మీరే చెప్పండి. శాసనసభ, శాసన మండలిలో జరిగే ప్రతి చర్చలో మాట్లాడాలి. స్పీకర్ పక్షపాత వైఖరి చూపిస్తే ఎండగట్టాలి. ప్రతిపక్షంలో ఉన్న మనకు సంఖ్యాబలమే ముఖ్యం. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ విషయం అసెంబ్లీలో చెప్పే బాధ్యత ప్రతిపక్ష ఎమ్మెల్యే లుగా తీసుకోవాలి. ఉభయ సభలలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. పాలన చేతగాక బూతులు మాట్లాడుతున్నారు’’ అని కేసీఆర్ అన్నారు.
ప్రాజెక్టుల దగ్గరికి వెళ్దాం
త్వరలో లక్ష మందితో కలిసి కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతలు ప్రాజెక్టుల దగ్గరికి వెళ్దామని కేసీఆర్ చెప్పారు. ‘‘ఆ బూతుల వీరుడు చర్చలకు అసెంబ్లీకి రమ్మంటున్నారు.. అవసరమా..? నా చావు కోరుతూ పదేపదే స్పీచులు.. అసెంబ్లీకి రావాలని ధర్నాలు. ఉభయ సభల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. అసెంబ్లీలో ప్రజల అజండానే బీఆర్ఎస్ అజెడాగా ఉండాలి. రేవంత్ రెడ్డి బయట, అసెంబ్లీలో చిల్లర బూతు మాటలు మాటాడుతున్నాడు. పాలన చాతకాకే రేవంత్ బూతుపురాణం. కాంగ్రెస్ ది థర్డ్ క్లాస్ పాలన’’ అని కేసీఆర్ చెప్పారు.
కాగా, సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఏయే అంశాలపై ప్రశ్నించాలన్న అంశాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హామీలు, పెండింగ్ పథకాలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అసెంబ్లీలో నిలదీసే అవకాశం ఉంది’’ అని కేసీఆర్ అన్నారు.


