సాక్షి, హైదరాబాద్: SIR ప్రక్రియపై కేంద్రఎన్నికల సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ( శనివారం) లేఖ రాశారు. ఎస్ఐఆర్పై అభ్యంతరాలు, క్లెయిమ్ల గడువులు పొడిగించాలని కోరారు. మరో నాలుగు వారాల పాటు ఈ గడువును పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వాటితో పాటు తుది ఓటర్ల జాబితా గడువునూ పెంచాలని కోరారు.
73.39 లక్షల ఓటర్ల ఎంట్రీలు ASDD జాబితాలోకి వెళ్లాయని దీంతో తాత్కాలికంగా వెళ్లిన వారిని సైతం శాశ్వతంగా తరలివెళ్లినట్లు పరిగణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లు నోటీసులకు స్పందించేందుకు ఓటర్లకు సమయం ఇవ్వాలని సూచించారు. ఓటర్ల జాబితాలో అర్హుల ఓట్లు తొలిగిపోకుండా చూడాల్సిన అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్పై అభ్యంతరాలు, క్లెయిమ్ల గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.
కాగా రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువును ఇదివరకే కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఎస్ఐఆర్ ప్రక్రియను ఆగస్టు మూడు వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.ఆగస్టు 3న సర్వే పూర్తి కాగానే ఓటరు డ్రాఫ్ట్ జాబితా ఆగస్టు 10న ప్రచురించనున్నట్లు అని తెలిపింది. అభ్యంతరాల స్వీకరణ ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకూ గడువుగా పేర్కొంది. చివరగా అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించించనుంది. ఈ నేపథ్యంలో మరోసారి గడువు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.


