సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో బహుళ అంతస్తుల పీజీ (PG) భవనం కూలిపోయిన తీవ్ర విషాదాన్ని నింపింది. ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో కనీసం ఏడుగురు మరణించిన, పలువురు గాయపడిన ఘటనలో పరారీలో ఉన్న భవన యజమాని హరిరామ్ గుప్తాను రాజస్థాన్లో పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. చదువు లేదా ఉద్యోగం కోసం నగరానికి బయటి ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని కోర్టు పేర్కొంది.ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలో ఉన్న ఈ బాలుర పీజీలో ఎక్కువగా కేరళ, హర్యానా, ఉత్తర ప్రదేశ్లకు చెందిన విద్యార్థులు నివసిస్తున్నారు.
పాత భవనంలో మరమ్మతులు చేస్తుండగా, బేస్మెంట్లో నీరు చేరడంతో భవనం బలహీనపడి కూలి పోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత పరారైన పీజీ యజమాని హరిరామ్ గుప్తాను రాజస్థాన్లో అదుపులోకి తీసుకున్నారు. శిథిలాల నుంచి ఇప్పటివరకు 12 మందిని వెలికితీశారు. వారిలో ఏడుగురు మరణించగా, మిగిలిన ఐదుగురు గాయపడి చికిత్స పొందుతున్నారు. ప్రమాదం నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా ఐదు అంతస్తులు ఉన్న భవనాలన్నింటినీ తక్షణమే సీల్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్, దుబాయ్లో సింగర్ హఠాన్మరణం

మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాద స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పరిశీలించారు. బాధ్యులైన ఎంసీడీ (MCD) అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పక్కనే ఉన్న ప్రమాదకరమైన మరొక భవనాన్ని కూడా కూల్చివేయనున్నట్లు వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఫైర్ సర్వీసెస్, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ పరిస్థితిని కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా ప్రధాని కార్యాలయం నిశితంగా పరిశీలిస్తున్నాయి.
ఇదీ చదవండి: రూ. 1,470 కోట్ల లాటరీ, సగం దానమిచ్చేసిన టీచరమ్మ!


