విజయ్‌ వర్సెస్‌ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ | TN Assembly: Vijay Takes on DMK Over Law and Order and Corruption | Sakshi
Sakshi News home page

విజయ్‌ వర్సెస్‌ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ

Sep 7 2026 1:23 PM | Updated on Sep 7 2026 1:39 PM

TN Assembly: Vijay Takes on DMK Over Law and Order and Corruption

తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు సోమవారం తీవ్ర గందరగోళం మధ్య సాగాయి. రాష్ట్రంలో వరుస హత్యలు, శాంతిభద్రతల పరిస్థితిపై అధికార టీవీకే ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షం నిలదీయడంతో సభలో వాగ్వాదం, నినాదాలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. దీనికి ముఖ్యమంత్రి విజయ్‌ ఘాటుగా బదులిస్తూ.. నేరస్తులు ఏ పార్టీకి చెందినవారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో డీఎంకేపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. ‘పార్టీ ఫండ్స్‌’ పేరుతో కాంట్రాక్టర్ల నుంచి లంచాలు వసూలు చేశారని ఆరోపించడం సభలో మరింత వేడి పెంచింది.

సభ ప్రారంభమైన వెంటనే డీఎంకే సభ్యులు రాష్ట్రంలో పెరుగుతున్న హత్యలను ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, వరుసగా హత్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దీనిపై చర్చకు అనుమతించాలని స్పీకర్‌ను ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్‌ కోరారు. ఈ అంశంపై అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు డీఎంకే సభ్యులు ప్రయత్నించడంతో సభలో ఉద్రిక్తత మొదలైంది.

దీనిపై ముఖ్యమంత్రి విజయ్‌ స్పందిస్తూ.. తమ ప్రభుత్వం నేరాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుందని చెప్పారు. పోలీసులు మంచివారికి మిత్రులుగా, నేరస్తులకు శత్రువులుగా ఉండాలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. నేరస్తుడు ఏ పార్టీకి చెందినవాడైనా చట్టం ముందు సమానమేనని తెలిపారు.

‘పోలీసులు పవర్‌ సెంటర్‌ కాకూడదు’
పోలీసు వ్యవస్థ ప్రజలను భయపెట్టే పవర్‌సెంటర్‌గా మారకూడదని విజయ్‌ అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసుల ప్రధాన బాధ్యతగా ఉండాలని చెప్పారు. గత మూడు నెలల్లో జరిగిన నేరాలను ఒకేసారి జరిగిన ఘటనలుగా చూడటం సరికాదని, వాటిలో అనేకం పాత కక్షలు, ప్రతీకారాల కారణంగా జరిగినవేనని వివరించారు.

డ్రగ్స్‌ నియంత్రణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కోయంబత్తూరులో జరిగిన ఓ కాలేజీ విద్యార్థి హత్య కేసులో 36 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 37 జిల్లాల్లో యాంటీ డ్రగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామని, చెన్నైలో మూడు నెలల్లో ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద 330 కేసులు నమోదు చేసి 556 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

డీఎంకేపై విజయ్‌ సంచలన ఆరోపణలు
శాంతిభద్రతల అంశంతో మొదలైన అసెంబ్లీ రచ్చ.. ఆ తర్వాత అవినీతి ఆరోపణలతో మరింత ముదిరింది. తమపై అవినీతి ఆరోపణలకు ఆధారాలు చూపించాలని విపక్షాలు పదేపదే డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో.. విజయ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పత్రాన్ని ప్రస్తావించారు.

గత డీఎంకే ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ల నుంచి కాంట్రాక్టు విలువలో 7.5 శాతం నుంచి 10 శాతం వరకు ‘పార్టీ ఫండ్స్‌’ పేరుతో వసూలు చేశారని** ఆయన ఆరోపించారు. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, వాటర్‌ సప్లై (MAWS) శాఖ పరిధిలో ప్రభుత్వ పనులు చేపట్టే కాంట్రాక్టర్ల నుంచి ఈ మొత్తాలను లంచాల రూపంలో వసూలు చేశారని ఈడీ పత్రంలో పేర్కొన్నట్లు విజయ్‌ సభలో చదివి వినిపించారు.

‘లంచాలు.. లోన్‌ ఈఎంఐల్లా వసూలు’
ఈ క్రమంలో పురుషోత్తం అనే వ్యక్తి పేరును ప్రస్తావించిన విజయ్‌.. ఆయన నుంచి రూ.29 లక్షలు లంచంగా వసూలు చేసినట్లు ఈడీ నివేదికలో ఉందన్నారు. అయితే ఆ మొత్తం ఒక్కసారిగా తీసుకోలేదని.. లోన్‌ ఈఎంఐలు చెల్లించినట్టుగా విడతల వారీగా వసూలు చేశారని విజయ్‌ ఆరోపించారు. అంతేకాదు.. ఈడీ పత్రంలో పేర్కొన్నట్లు ‘పార్టీ ఫండ్స్‌’కు ప్రత్యక్ష లబ్ధిదారులుగా అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌, అప్పటి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌, రవి ప్రసాద్‌తో పాటు మరికొందరి పేర్లు ఉన్నాయని విజయ్‌ పేర్కొన్నారు. ఈ ఆరోపణలు తనవి కావని, ఈడీ పత్రంలో ఉన్నవేనని ఆయన స్పష్టం చేశారు.

సర్కారియా కమిషన్‌ నివేదిక ప్రస్తావన
డీఎంకేపై అవినీతి ఆరోపణలకు చారిత్రక నేపథ్యం ఉందని చెప్పేందుకు విజయ్‌ సర్కారియా కమిషన్‌ నివేదికను కూడా ప్రస్తావించారు. వీరాణం నీటి సరఫరా పథకానికి సంబంధించిన వ్యవహారంలో ‘పార్టీ ఫండ్‌’ పేరుతో 2.5 శాతం డిమాండ్‌ చేశారన్న ఆరోపణలు కమిషన్‌ నివేదికలో ఉన్నాయని చెప్పారు. అప్పట్లో టెండర్‌ విలువ రూ.16 కోట్లుగా ఉందని తెలిపారు.

2001లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత, మాజీ మంత్రి పొన్నయ్యన్‌ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారని విజయ్‌ గుర్తుచేశారు. ‘కొంచెం లోతుగా పరిశీలిస్తే మరెన్నో విషయాలు బయటకు వచ్చాయి’ అంటూ డీఎంకేపై విమర్శలు గుప్పించారు.

చివరకు వాకౌట్‌..
విజయ్‌ వ్యాఖ్యలపై డీఎంకే సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డుపడుతూ.. నినాదాలు చేశారు. పలువురు డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌ పోడియం చుట్టూ చేరడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్‌ చేశారు.

ఇదీ చదవండి: డీ బాస్‌ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కాంగ్రెస్‌ నేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement