జీవించి ఉండగానే పిల్లలకు ఆస్తులు, పెట్టుబడులు బదిలీ చేయాలనుకునే తల్లిదండ్రుల ముందు సాధారణంగా రెండు మార్గాలుంటాయి.. గిఫ్ట్ డీడ్ ద్వారా వెంటనే బదిలీ చేయడం లేదా విల్లు ద్వారా మరణానంతరం అప్పగించడం. ఈ రెండింటిలో ఏది మెరుగైనదో నిర్ణయించేటప్పుడు ఆస్తిపై నియంత్రణ, ట్యాక్స్-స్టాంప్ డ్యూటీ భారం, వివాదాల అవకాశం, పిల్లలు నివసించే ప్రాంతం వంటి అంశాలు కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.
ఖైతాన్ అండ్ కో పార్టనర్ బిజల్ అజింక్యా అభిప్రాయం ప్రకారం గిఫ్ట్లు, విల్లు రెండూ వారసత్వ ప్రణాళికకు సమర్థవంతమైన సాధనాలేనని చెబుతున్నారు. అయితే వ్యక్తి ఉద్దేశం, విల్లు వివాదాస్పదమయ్యే అవకాశం వంటి అంశాల ఆధారంగా సరైన మార్గం ఎంచుకోవాలని పేర్కొన్నారు.
పన్ను ఉండదు.. కానీ..
భారత్లో నివసించే వ్యక్తులు దగ్గరి బంధువులకు ఇచ్చే గిఫ్ట్లపై సాధారణంగా ఆదాయపు పన్ను ఉండదు. కానీ స్టాంప్ డ్యూటీ వర్తించవచ్చు. విల్లు ద్వారా వచ్చే ఆస్తులపై పన్ను, స్టాంప్ డ్యూటీ రెండూ ఉండవు. అయితే బదిలీ తర్వాత ఆ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయంపై పిల్లలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
తల్లిదండ్రులకు హక్కు ఉండదు..
స్థిరాస్తి గిఫ్ట్ ఇవ్వాలంటే తప్పనిసరిగా రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ అవసరం అవుతుంది. మూవబుల్ ఆస్తులకు ఇది అవసరం లేదు. దగ్గరి బంధువులకు ఇచ్చే నివాస, వ్యవసాయ భూములపై కొన్ని రాష్ట్రాలు రాయితీ స్టాంప్ డ్యూటీ రేట్లు అందిస్తున్నాయి. గిఫ్ట్ ఇచ్చాక పిల్లలు చట్టబద్ధమైన యజమానులవుతారు కాబట్టి, తల్లిదండ్రులు ఆ ఆస్తిపై హక్కు కోల్పోతారు. కానీ విల్లు ద్వారా జీవితకాలం ఆస్తిపై నియంత్రణ కొనసాగించవచ్చు. షరతులతో కూడిన గిఫ్ట్ డీడ్ కూడా ఒక ప్రత్యామ్నాయం.
పిల్లలు విదేశాల్లో ఉంటే..
పిల్లలు విదేశాల్లో ఉంటే విదేశీ మారక నియంత్రణ నిబంధనలు, ఆ దేశ పన్ను చట్టాలు కూడా పరిగణించాలి. వివాదాలు, సుదీర్ఘ న్యాయ వ్యాజ్యాల భయంతో ఆస్తుల రక్షణ కోసం ప్రైవేట్ ట్రస్ట్లు ఎంపిక చేసుకునే కుటుంబాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అన్ని అంశాలను బేరీజు వేసుకొని, ఆస్తుల వ్యవహారంలో నిపుణుల సలహా మేరకే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరలు!


