ముంబై: కోరుకున్న విద్యాసంస్థలో ప్రవేశం లభించకపోవడంతో ఓ 17 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని థానే నగరం, ఘోడ్బందర్ రోడ్డులోని హీరానందాని ఎస్టేట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, షిబ్పూర్లో బీఎస్-ఎంఎస్ డ్యుయల్ డిగ్రీ చదవాలని అతడు అనుకున్నాడు. ఆ బాలుడు ఇటీవల 12వ తరగతి పరీక్షలు పూర్తి చేసి 95.7% మార్కులు సాధించాడు. అయితే ప్రవేశ పరీక్షలో 10,474 ర్యాంకు రావడంతో తాను కోరుకున్న విద్యాసంస్థలో సీటు పొందలేకపోయాడు.
కుటుంబానికి మెసేజ్ పంపిన బాలుడు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 4న రాత్రి 7.30 గంటల సమయంలో సైకిల్ తొక్కేందుకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సుమారు 45 నిమిషాల తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్లు కుటుంబ వాట్సాప్ గ్రూపులో సందేశం పెట్టాడు.
కుటుంబ సభ్యులు ఆ సందేశాన్ని గమనించి అతడిని సంప్రదించేందుకు ప్రయత్నించారు. అతడి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండటంతో కాసర్వడవలి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, కుటుంబ సభ్యులు నివాస సముదాయం పరిసరాల్లో బాలుడి కోసం గాలింపు చేపట్టారు.
అయితే కుటుంబ సభ్యులు, పోలీసులు జోక్యం చేసుకునేలోపే నివాస భవనంలోని 22వ అంతస్తు నుంచి బాలుడు కిందకు దూకాడు. తీవ్ర గాయాలతో అపార్ట్మెంట్ సమీపంలోని ఫుట్పాత్పై బాలుడు పడి ఉన్నట్లు తర్వాత గుర్తించారు. పోలీసులు, కుటుంబ సభ్యులు అతడిని థానే సివిల్ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. తాను కోరుకున్న విద్యాసంస్థలో ప్రవేశం పొందలేకపోవడం వల్ల బాలుడు తీవ్ర విద్యాపరమైన ఒత్తిడికి గురయ్యాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


