పంపాను శబరిమల సన్నిధానంతో అనుసంధానించే పూర్తి రోప్వేని సకాలంలో పూర్తి చేసేలా చర్యలుతీసుకోవాలని కేరళ రాష్ట్ర దేవస్వం పెన్షనర్ల సమాఖ్య పునలూర్ గ్రూప్ కాన్ఫరెన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
శబరిమలను సందర్శించే లక్షలాది మంది యాత్రికులకు ఈ రోప్వే గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుందని, ఈ ప్రాజెక్టును మరింత ఆలస్యం చేయకుండా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
గత ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం కులతుపుళ గ్రామంలో 4.5336 హెక్టార్ల భూమిని కేటాయించింది. అయితే, యుడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు చేశారు. అలాగే ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత వరకు త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదిలా ఉండగా, శబరిమల అభివృద్ధి కార్యకలాపాలపై తన నియంత్రణను బలోపేతం చేసుకునేందుకు కేరళ ప్రభుత్వం కొత్త శబరిమల అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేయనుంది. దీనివల్ల అభివృద్ధి సంబంధిత విషయాలలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) పరిపాలనా పాత్ర తగ్గుతుందని భావిస్తున్నారు.ఈ అధికార సంస్థ తొలి సమావేశం సెప్టెంబర్ 11న జరగనుంది.
శబరిమల మాస్టర్ ప్లాన్ కింద ప్రాజెక్టులను కాలపరిమితిలోగా అమలు జరిగేలా చూడటమే ఈ కొత్త ప్రాధికార సంస్థ ప్రధాన లక్ష్యం. ఇది సన్నిధానంచుట్టుపక్కల ప్రాంతాలలో యాత్రికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం, అభివృద్ధి ప్రాజెక్టులను సమన్వయం చేయడం, నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షించడం వంటి వాటిపై దృష్టి సారిస్తుంది. అంతేగాదు ఈ సంస్థ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు, అటవీ శాఖ, పోలీస్ శాఖతో సహా శబరిమల అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వివిధ విభాగాల పనితీరును ఈ అథారిటీ సమన్వయం చేస్తుందని చెబుతున్నారు అధికారులు.
(చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం)


