వరద ముప్పు తప్పించవచ్చు
కేరళం కుర్రాడి ఘనత
త్రిశూర్: వరద ప్రమాదాలను తగ్గించేందుకు, డ్యామ్ల నిర్వహణ మరింత మెరుగ్గా ఉండేందుకు కేరళం రాష్ట్రానికి చెందిన పదిహేడేళ్ల యువకుడు నొవెయిన్ సరికొత్త కృత్రిమ మేధ వ్యవస్థను రూపొందించాడు. డ్యామ్ ఎగువ ప్రాంతాల్లో నీటి ప్రవాహాన్ని, అలల తిరోగమన ప్రవాహాలను విశ్లేషించడం ద్వారా వరద ముప్పును తప్పించుకునేందుకు ఎంత తొందరగా డ్యామ్ నుంచి నీరు విడుదల చేయాలో అంచనా వేస్తుందీ వ్యవస్థ. దీనివల్ల వరద ముప్పు తగ్గడమే కాకుండా.. నీటిని సంరక్షించేందుకు కూడా వీలేర్పడుతుందని నొవెయిన్ చెబుతున్నాడు.
2018లో కేరళంలోని చాలక్కుడి ప్రాంతంలో వరదలు, ఆ సమయంలో ఆ ప్రాంతంలోని డ్యామ్ల పరిస్థితులపై వచ్చిన కథనాలతో స్ఫూర్తి పొంది తానీ వ్యవస్థను రూపొందించినట్లు చెప్పారు. పెద్ద పెద్ద డ్యామ్ల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగలనని తాను నమ్మానని, పలు ప్రయత్నాలు విఫలమైనప్పటికీ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలన్న సంకల్పంతో ముందుకెళ్లానని, విజయం సాధించానని వివరించారు.
ప్రస్తుతం తాను నమూనా వ్యవస్థను మాత్రమే తయారు చేశానని, మరింత సమర్థంగా పనిచేసే అసలు మోడళ్ల అభివృద్ధికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. నొవెయిన్ ఆవిష్కరణకు ప్రఖ్యాత ఎల్రక్టానిక్స్ కంపెనీ శాంసంగ్ తన సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ‘సాల్వ్ టుమారో’పోటీలో ప్రథమ స్థానం లభించింది. యువ ఇన్నొవేటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పోటీలో 40 మంది పాల్గొన్నారని, నొవెయిన్కు చెందిన అకూస్టీనోడ్ సిస్టమ్స్ మొదటి స్థానంలో నిలిచిందని శాంసంగ్ ఒక ప్రకటనలో తెలిపింది.


