స్థిరమైన ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం చేయాలంటే చాలా ధైర్యం కావాలి. అందులో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్గా, వైస్ ప్రిన్సిపాల్గా సేవలందించిన ఆమె సొంతంగా వ్యాపారం చేయాలనే సాహసం చేసింది. విద్యార్థులకు పదే పదే చెప్పిన మాటల్నే ఆచారించి చూపాలని తీసుకున్న ఆ అనూహ్య నిర్ణయం..చివరికి విజయం దక్కించుకునేలా చేసిందా అంటే..
ఆ ప్రొఫెసరే తమిళనాడుకు చెందిన సుభ్రద. కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేసిన ఆమె కొద్దికాలంలోనే ఎమరాల్డ్ హైట్స్ అనే మహిళా కాలేజ్కి వైస్ ప్రిన్స్పాల్ అయ్యింది. అయితే ఆమె ఎప్పుడు తన స్టూడెంట్స్కి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఉండాలి తప్ప..ఒకరి కింద పనిచేసే స్థాయిలో ఉండొద్దని సదా చెబుతుండేది. అసలు ఆ మాటలనే తానే ఆచరించి విద్యార్థులకు ఎందుకు చూపకూడదంటూ సొంతంగా వ్యాపారం చేయాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.
అయితే ప్రజలకు నాణ్యమైన పోషకవంతమైన ఆహారం అందించే వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే తాను గతంలో హార్మోన్ల సమస్యతో బాధపడి రెండుసార్లు గర్భస్రావం అయ్యి బాధపడిన అనుభవమే అందుకు కారణమట. ఇలాంటి సమస్యలకు మూలం పోషకాహార లోపం అని వైద్యులు చెప్పడంతోనే..ఈ వ్యాపారాన్ని ఎంచుకున్నట్లు తెలిపిందామె. అందులోనూ చిరుధాన్యాలు గ్లూటెన్ రహితమైనవి, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాలు అందుకే ఈ వ్యాపారం చేసేందుకు మొగ్గు చూపిందామె.
ఆ నేపథ్యంలోనే చిరుధాన్యాల ప్రాసెసింగ్పై పరిశోధన చేయడానికి మైసూర్లోని 'సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్' (CFTRI)కి వెళ్లి మరి శిక్షణ తీసుకుంది. అయితే ఆ ట్రైనింగ్లో పిండిలో నిల్వచేసే పదార్థాలు కలపకపోతే నిల్వ కాలం తగ్గిపోతుంది. అలాగే కోల్డ్ చైన్ కోసం భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని చెప్పారు. అయినా సరే ఆమె పట్టు వదలకుండా ప్రిజర్వేటివ్ రహతంగా పోషకవంతమైన ఆహారం అందించాలనే ఉద్దేశ్యంతో నాలుగువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 20 లక్షలు పెట్టుబడి పెట్టి మరి భూమిని లీజుకు తీసుకుంది. ఉత్పత్తులను వేరు చేయడం, గ్రేడింగ్ చేయడం, నానబెట్టడం, రుబ్బడం, ప్యాకేజింగ్ చేయడం వంటి వాటికి అనుగుణంగా యంత్రాలను మార్చుకుంది.
కానీ మొదట్లో కనీసం 50 ప్యాకెట్లను కూడా అమ్మలేకపోయింది. తెల్లగా లేని దోసె లేదా ఇండ్లీ పిండి కొనేందుకు ఆసక్తి చూపకపోవడంతో..200 ప్యాకెట్లను ప్రజలకు ఉచితంగా ఇచ్చి తినేలా ప్రోత్సహించాల్సి వచ్చింది. దాంతో తన ఉత్పత్తులకు ఒక్కసారిగా ఆదరణ లభించి అమ్మకాలు ఊపందుకున్నాయి. అలాతన పీవీఆర్ బ్రాండ్తో పిండి, నూడుల్స్, హెల్త్ మిక్స్లు, పొంగల్ వంటి వాటితో సహా 83 రెడీ టు కుక్ మిల్లెట్ ఉత్పత్తులను అందించే స్థాయికి చేరుకుంది.
అంతేగాదు దేశవ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఆస్పత్రులు, కార్యాలయాలు, ఆన్లైప్ ఫ్లాట్ఫామ్లలో ఈ బ్రాండ్కి ఆదరణ పెరిగి అమ్మకాలు జోరందుకున్నాయి. పైగా ఈ బ్రాండ్ని కోయంబత్తూర్లోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంక్యుబేట్ చేసింది. అలాగే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద రూ. 23 లక్షల గ్రాంట్ను కూడా అందించింది. అలా సుభ్రద కంపెనీ ప్రతి ఏడాది సుమారు రూ. 3 కోట్లో ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరుకుంది. ఇక్కడ వ్యాపారంలోకి దిగడమే కాదు..అందులో ఎదురయ్యే సవాళ్లు, ఇబ్బందులను అధిగమిస్తేనే గెలుపుని అందుకోగలమని చెబుతోంది ఈ మాజీ ప్రిన్స్పాల్ సుభద్ర కథ.
(చదవండి: ఆ గాయం రూపాన్ని మార్చిందే తప్ప..ఆమె గెలుపుని కాదు!)


