తమిళనాడు: గర్భిణి అని కూడా చూడకుండా ఓ యువతిని గొంతు నులిమి హత్య చేసి, సంచిలో పెట్టి బావిలో పడేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సేలం జిల్లాలోని ఎడప్పాడి పక్కన కొంగనపురం సమీపంలోని వ్యవసాయ బావి నుంచి కొన్ని రోజుల క్రితం దుర్వాసన వెలువడింది. నీటిలో ఒక తెల్లటి సంచి తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న కొంగనపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
వారు బావిలో తేలుతున్న సంచిని బయటకు తీసి తెరిచారు. ఆ సంచిలో కుళ్లిపోయిన స్థితి ఓ యువతి మృతదేహం ఉంది. విచారణలో, కరుంగుళ్లవట్టం ప్రాంతానికి చెందిన పేరకౌండర్ కుమార్తె కోకిల (23) అని తెలిసింది. ఆమెని ఎందుకు హత్య చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కళాశాల చదువు పూర్తి చేసుకున్న కోకిల, పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఆగస్టు 20వ తేదీన కోకిల తనకు తీవ్రమైన కడుపునొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పింది. వెంటనే వారు సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. వైద్యులు ఆమెను పరీక్షించి 7 నెలల గర్భవతి అని వెల్లడించారు..
ఈ విషయం తెలుసుకుని కోకిల కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. విచారించగా, పొరుగు గ్రామానికి చెందిన అమ్మసి (26) అనే వ్యక్తితో తనకు పరిచయం ఉందని కోకిల చెప్పింది. దీని తర్వాత, కోకిల కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని పిలిచి మాట్లాడారు. ఆ సమయంలో, గ్రామంలో ఒక పండుగ ఉందని, ఆ తర్వాత కోకిలను పెళ్లి చేసుకుంటానని అమ్మాసి చెప్పాడు. అప్పటి వరకు ఆమె అక్కడ ఉండడానికి వీలుగా కోకిలను తన ఇంటికి తీసుకువెళ్లాడని తెలుస్తుంది.
ఇంతలో, కోకిల 31వ తేదీ నుంచి కనిపించడం లేదని అమ్మాసి, కోకిల కుటుంబానికి తెలియజేశాడు. అంతటా వెతికినా జాడ దొరకలేదు. కోకిల హత్యకు గురైందని, ఆమె మృతదేహం బావిలో తేలుతున్న ఒక సంచిలో లభ్యమైందని తెలిసింది.. కొంగనపురం పోలీసులు అమ్మాసిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. పెళ్లి విషయంలో జరిగిన గొడవ కారణంగా తాను దుపట్టాతో కోకిల గొంతు నులిమి చంపి, ఆమె మృతదేహాన్ని బావిలో పడేసినట్లు అమ్మాసి వెల్లడించాడు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసి అమ్మాసిని అరెస్టు చేశారు.


